– యాప్ సక్రమంగా పనిచేయక సరుకుల పంపిణీకి ఇబ్బందులు
– ఏప్రిల్ నెల పూర్తి కావస్తున్నా పూర్తి కాని పంపిణీ
( శివ శంకర్. చలువాది)
అంగన్వాడీ సెంటర్లలో పోషకాహార పంపిణీకి తిప్పలు తప్పడం లేదు. ప్రతి నెలా మొదటి శుక్రవారానికి పోషకాహార పంపిణీ పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఏప్రిల్ నెల పూర్తి కావస్తున్నా ఇంకా 84.6% మాత్రమే పంపిణీ జరిగింది. కేంద్ర ప్రభుత్వం పారదర్శకత కోసం ముఖ ఆధారిత ధ్రువీకరణ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే సరకులు అందించే సమయంలో ఈ యాప్ సక్రమంగా పనిచేయక పోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నట్ సరిగా రావడంలేదు. దీని కారణంగా గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకునేందుకు పలుమార్లు అంగన్వాడీ సెంటర్లకు రావాల్సి వస్తోంది.
గర్భిణులు అంగన్వాడీ సెంటర్లో తమ పేర్లను తప్పక నమోదు చేసుకోవాలి. వారి వివరాలను సిబ్బంది బాల సంజీవని, పోషణ్ ట్రాకర్ , మిల్క్ యాప్లలో నమోదు చేస్తారు. ఆ వివరాల ఆధారంగా వారికి పోషకాహార కిట్లు అందిస్తారు. ప్రతి నెలా 15లోగా నమోదైన లబ్ధిదారులకు మాత్రమే తర్వాత నెల పోషకాహార కిట్లను అందజేస్తారు. యాప్ సరిగ్గా పనిచేయకపోవడంతో 15వ తేదీ తర్వాత పేర్లు నమోదు చేస్తున్న వారికి పోషకాహారం అందడం లేదు.
బాలింతలకు ప్రతి నెలా 2 కిలోల రాగి పిండి, కిలో అటుకులు, పావు కిలో బెల్లం, ఎండు ఖర్జూరం, చిక్కీలతో పాటు 3 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, నూనె అరలీటరు పౌరసరఫరాల శాఖ నుంచి అందజేస్తున్నారు. అయితే ఏప్రిల్ నెలకు సంబంధించి ఇంకా 15.4 శాతం మంది లబ్ధిదారులకు కిట్లు ఇవ్వాల్సి ఉంది. వాటికోసం లబ్ధిదారులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
లబ్ధిదారులకు ముఖ ఆధారిత అటెండెన్స్తో సరకులు అందజేస్తారు. గత ప్రభుత్వం నాసిరకమైన ఫోన్లను సిబ్బందికి అందజేసింది. ఇవి పనిచేయక కార్యకర్తలు తమ సొంత ఫోన్లలో యాప్లను ఇన్స్టాల్ చేసుకున్నారు. దీనికి ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే 2GB డేటా సరిపోవడం లేదని పలువురు సిబ్బంది వాపోతున్నారు. దీనివల్ల తమపై అదనపు భారం పడుతోందని అంగన్వాడీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.