Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీని ఇంటికి సాగనంపుదాం

-విజయవాడ పశ్చిమ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి

ఏపీలో అయిదేళ్ళపాటు జగన్ అరాచక పాలన చేశారని, ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపుదామని విజయవాడ పశ్చిమ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణ వీధి నుంచి 52వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఈగల సాంబ, టీడీపీ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటితో కలిసి కొత్తపేట కోమల విలాస్, చేపల మార్కెట్, శ్రీనివాస్ మహల్ ప్రాంతాల్లో సుజనా ప్రచారం చేశారు.

కొండ ప్రాంత వీధులలో తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు. ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు, ఎన్డీఏ ఇస్తున్న హామీలపై అవగాహన కల్పించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా పథకాలను అమలు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని విద్య వైద్యం తాగు నీటి సదుపాయాలని మెరుగుపరుస్తానని కొండ ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్ లో ఎంపీ ఎమ్మెల్యే ఆఫీసులను ఏర్పాటు చేసి 24 గంటలు ప్రజలకు సేవ చేస్తామన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో ప్రజలకు చేసింది శూన్యం అన్నారు. అవినీతి అరాచక పాలన త్వరలోనే అంతం చేయాలని. కూటమి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.

ప్రచారంలో భాగంగా కోమల విలాస్ ప్రాంతంలోని సర్దార్ మరుపిళ్ళ చిట్టి కాంగ్రెస్ కార్యాలయాన్ని సుజనా సందర్శించారు. కార్యాలయ ఇన్ చార్జ్ పోతిన బేసు కంటేశ్వరుడు సుజనాకు స్వాగతం పలికారు. కాంగ్రెస్ నాయకులు మరుపిళ్ల చిట్టి చిత్రపటానికి సుజనా పూలమాలలు వేసి నివాళులర్పించారు. పశ్చిమ నియోజకవర్గం ఉద్యమాల పురిటి గడ్డ అని, స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది నాయకులను తయారు చేసి ప్రజాసేవకు అంకితం అయ్యేలా చేసిందని, తను కూడా ఈ ప్రాంతం నుంచి పోటీ చేయటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పార్టీలకతీతంగా అందరూ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

53 వ డివిజన్ లో టీడీపీ అధ్యక్షుడు రావుల సత్యనారాయణతో కలిసి చేపల మార్కెట్ ప్రాంతాలలో ప్రచారం చేశారు. సుజనా వెంట ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ఎం ఎస్ బేగ్, టీడీపీ అధికార ప్రతినిధి నాగూల్ మీరా, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, కూటమి నాయకులు అభిమానులు స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.

LEAVE A RESPONSE