-దిశ చట్టం కింద 21 రోజుల్లో శిక్ష దేవుడెరుగు..21 రోజుల్లో బెయిల్పై వచ్చేస్తోన్న హంతకులు
-ఉన్మాదులు బయట తిరుగుతూ కేసులు విత్డ్రా చేసుకోవాలంటూ తల్లిదండ్రులకు బెదిరింపులు
-ఉన్మాదుల దాడుల్లో గాయపడిన వారి చికిత్సకి రూపాయి కూడా ఇవ్వని ప్రభుత్వం
– ఇదేనా మీ దిశ చట్టం? ఇదేనా మీరు మహిళలకు కల్పించే భద్రత? అని సీఎంని నిలదీసిన నారా లోకేష్
ఆడపిల్లల్ని అత్యంత దారుణంగా పట్టపగలు చంపేసిన హంతకులకు దిశచట్టం కింద 21 రోజుల్లో శిక్షిస్తామన్న ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం అరాచక ధోరణితో వారంతా బెయిల్ పై విడుదలై స్వేచ్ఛగా తిరుతున్నారని…వారి తల్లిదండ్రుల్ని చంపుతామని బెదిరించినా పట్టించుకునే నాథుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
36 కేసుల్లో బెయిల్పై ఉన్న సీఎం జగన్రెడ్డి…తనలాంటి క్రిమినల్స్, ఆడబిడ్డల్ని అంతమొందించిన కరడుకట్టిన ఉన్మాదులు బెయిల్ పై బయట వుండాలనే ఆలోచనతో వున్నట్టు కనిపిస్తోందని ఆరోపించారు. కడప జిల్లా బద్వేలు మండలం చింతలచెరువుకి చెందిన శిరీషని దారుణంగా చంపిన ఉన్మాదులు బెయిల్పై బయటకొచ్చి, శిరీష తల్లిదండ్రుల్ని చంపుతామని బెదిరిస్తున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో లావణ్యపై దాడి చేసి జీవచ్ఛంలా చేసిన నిందితుడు బెయిల్ వచ్చి, మరోసారి దాడి చేస్తానని, ఏం చేస్తారో చూస్తానని హెచ్చరిస్తున్నా పట్టించుకోని పోలీసులు అందరికీ న్యాయం చేశామని చెబుతుండడం ఈ నేరగాళ్లకు పోలీసులే మద్దతుగా నిలుస్తున్నారని అనుమానించాల్సి వస్తోందన్నారు.
గాయపడిన లావణ్య కోలుకునేంతవరకూ చికిత్స అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం… లక్షలు ఖర్చయినా రూపాయి ఇవ్వకపోవడం, ఇది ఆడపిల్లల్ని వంచించే ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుందన్నారు. విశాఖలో వలంటీర్ ప్రియాంకపై దాడిచేసిన నిందితుడు నెల తిరక్కుండానే బెయిల్పై వచ్చేశాడంటే, రాష్ట్రంలో దిశచట్టమే కాదు, అసలు ఏ చట్టమూ అమలు కావడంలేదనేది సుష్పస్టమైందన్నారు. ఆడబిడ్డలని ఆదుకోవడం అంటే జగన్ అక్రమాస్తుల మీడియా సాక్షికి కోట్ల రూపాయలు ప్రకటనలు ఇవ్వడం కాదని ఎద్దేవ చేశారు.
హంతకులు బెయిల్పై వచ్చి, ఇష్టారాజ్యంగా తిరుగుతూ, కేసులు వాపసు తీసుకోకపోతే చంపేస్తామని కన్నబిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నారని, జగన్రెడ్డి అరాచకపాలనలో ఆంధ్రప్రదేశ్ ఆఫ్గనిస్తాన్ కంటే ఘోరంగా మార్చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పాలాభాషేకాలు, పూలాభిషేకాలు చేయించుకున్న దిశచట్టం తెచ్చిన తరువాత జరిగిన శిరీష, లావణ్య, ప్రియాంకలే కాదు..స్నేహలత, అనూష కేసుల్లో బాధిత కుటుంబాలకు ఏం న్యాయం చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రమ్యని అత్యంత దారుణంగా పట్టపగలు నడిరోడ్డుపై చంపేసిన మృగాడికి ఏం శిక్ష విధిస్తారో రెండు రోజుల్లో తేలిపోనుందని, ప్రభుత్వం ఇలాగే మాయమాటలతో కాలం గడిపేస్తే అన్యాయం అయిపోయిన ఆడబిడ్డల కుటుంబాలకి న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ ముందుండి పోరాడుతుందని నారా లోకేష్ స్పష్టం చేశారు.