Suryaa.co.in

Andhra Pradesh

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన యువనేత లోకేష్

పెందుర్తి: తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక అన్న ఎన్టీఆర్ అని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. పెందుర్తి నియోజకవర్గం పరవాడ మార్కెట్ సెంటర్ లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… డిల్లీ పాదాల చెంత తెలుగువారి ఆత్మగౌరవం బందీగా మారిన సమయంలో ప్రపంచం మేం తెలుగువారమని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

పేదవాడికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కల్పించాలన్న లక్ష్యంతో 2 రూపాయలకు కిలోబియ్యం, జనతా వస్త్రాల పంపిణీ, పక్కాగృహాల నిర్మాణం వంటి కార్యక్రమాలకు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేశారన్నారు. మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

లోకేష్ ను కలిసిన ఎల్ జి పాలిమర్స్ బాధితులు

పెందుర్తి నియోజకవర్గం వెంకటాపురం గ్రామ అభివృద్ధి సేవాసంఘం ఆధ్వర్యంలో ఎల్ జి పాలిమర్స్ బాధితులు యువనేత లోకేష్ ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు.
• ఎల్ జి పాలిమర్స్ ప్రభావిత గ్రామంగా ఉన్న వెంకటాపురానికి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి ఆదుకోవాలి.
• మా గ్రామప్రజలు ఆనాటి విషవాయువు పీల్చడం వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నారు. మాకు జీవితకాల హెల్త్ కార్డులు ఉచితంగా ఇప్పించి, వైద్యం అందించాలి.
• విషవాయువు వల్ల నీరు కలుషితమైనందున ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేయాలి.
• ఆనాడు అనారోగ్యానికి గురైన ఆసుపత్రి పాలైన 1100మంది బాధితుల్లో కొంతమందికి మాత్రమే పరిహారం అందింది, మిగిలినవారికి ఇప్పటివరకు కూడా పరిహారం అందించలేదు. అందరికీ పరిహారం అందేలా చూడాలి.
• కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటుచేసి మా బిడ్డలకు ఉద్యోగాలు కల్పించాలి.
• ఎల్ జి పాలిమర్స్ బాధితులు జి.చంద్రశేఖర్, సిహెచ్ దివాకర్, పి.సూరిబాబు, పి.సురేష్, ఎన్.లత యువనేత లోకేష్ ను కలిసిన వారిలో ఉన్నారు.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పర్యావరణ, కాలుష్య నియంత్ర చట్టాల అమలును పర్యవేక్షించకపోవడం వల్లే ఎల్ జి పాలిమర్స్ ఘటన చోటుచేసుకుంది.
• రాష్ట్రచరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటన విశాఖపట్నం ఎల్ జి పాలిమర్స్ లో మే 7, 2020న దుర్ఘటన జరిగింది. 15మంది ప్రాణాలు కోల్పోగా, 1100 మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు.
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా లాక్ డౌన్ లో 45 రోజులుగా మూతబడిన ఈ పరిశ్రమకు ఎటువంటి తనిఖీలు లేకుండా ఎస్సెన్షియల్ కమోడిటీస్ కింద అనుమతులు ఇచ్చి తెరిపించింది.
• దుర్ఘటన జరిగాక జగన్ చుట్టపు చూపుగా విశాఖ వచ్చి వెళ్లారే తప్ప ఇప్పటివరకు బాధితుల సమస్యను ఇప్పటివరకు పరిష్కరించకపోవడం దారుణం.
• విశాఖలో హుదుహుద్ తుపాను సంభవించినపుడు పరిస్థితులు చక్కబడే వరకు చంద్రబాబునాయుడు అక్కడే ఉండి సహాయ చర్యలు పర్యవేక్షించారు.
• ఎల్ జి పాలిమర్స్ బాధిత గ్రామాలకు ఆనాడు ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
• మరో 3నెలల్లో టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎల్ జి పాలిమర్స్ బాధిత గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.
• ప్రభావిత గ్రామాల ప్రజలందరికీ హెల్త్ కార్డులిచ్చి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటాం.
• పర్యావరణహిత, కాలుష్యరహిత పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం.

LEAVE A RESPONSE