Suryaa.co.in

Andhra Pradesh

అన్నదాతను ఉరికంబమెక్కిస్తున్న జగన్ ప్రభుత్వం

– రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాలకు నిలయంగా మార్చారు
– ధరల పెంపుతో పేదవాడి బతకును దుర్భరం చేశారు
– వైసిపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలపక్షాన పోరాడుదాం
– తెలుగు రైతు సమావేశంలో చంద్రబాబునాయుడు పిలుపు
వైసీపీ పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటరీ పార్టీ తెలుగు రైతు విభాగం నాయకులతో చంద్రబాబు నాయుడు బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ వరకు తాను సిఎంగా ఉన్న హయాంలో వ్యవసాయరంగంపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అన్నివిధాలా అండగా నిలిచామని చెప్పారు.
గత 28నెలల జగన్ రెడ్డి పాలనలో వ్యవసాయం రంగం సంక్షోభంలో పడింది, ప్రభుత్వం నుంచి సాయం అందక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎరువులు, విత్తనాల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతు భరోసా రూ. 12500 ఇస్తానని చెప్పి కేవలం రూ. 7500 మాత్రమే ఇఛ్చి రైతులను మోసగించారు, 5వ విడత రుణమాపీ సొమ్ము ఎగ్గొట్టారన్నారు. టీడీపీ హయాంలో అమరావతి, పోలవరం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందకు నడిపించాం, మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికి పోలవరంతోపాటు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తయ్యేదని తెలిపారు. జగన్ వచ్చాక అమరావతితో పాటు పోలవరాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
టీడీపీ అయిదేళ్ల పాలనలో ఒక్క సాగునీటి రంగంపైనే 64 వేల కోట్లు ఖర్చు చేశాం, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం, తద్వారా రాయలసీమకు నీరందించాం, రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా అభివృద్ది చేశామని చంద్రబాబు అన్నారు. దేశం మొత్తమ్మీద వ్యవసాయంరంగంలో రెండంకెల వృద్ది సాధించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని చెప్పారు. రైతులకు మద్దరు ధర ఇచ్చాం, వరదలు, తుపాన్లు, ప్రకృతి విపత్తుల ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకున్నాం, శనగ, పామాయిల్, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి న్యాయం చేశామని తెలిపారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్నా రైతులకు ఇఛ్చిన హామీ ప్రకారం రైతులకు రుణ మాఫీ అమలుచేశామని చెప్పారు. రైతులకు సబ్సిడీ కింద ఎరువులు, యంత్ర పరికరాలు, డ్రిప్స్ అందించాం, టీడీపీ ‍హయాంలో రైతులకు అన్ని విధాలా న్యాయం చేశామని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలుగు రైతు నేతలకు పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తల్ని ఆర్దికంగా ఇబ్బందులకు గురిచేసినా, భౌతిక దాడులు చేసినా, అక్రమ కేసులు పెట్టినా సరే ఒక్కరు కూడా పార్టీని వీడలేదని అన్నారు. పార్టీ కోసం పనిచేసినవారికి కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది, పార్టీలోని అన్ని అనుబంద విభాగాలు సమన్వయంతో ప్రజావ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, అందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కెళ్లింది, అభివృది లేదు, ఉపాథి, పెట్టుబడులు లేవు, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి భావితరాల భవిష్యత్ ని ప్రశ్నార్ధకం చేశారని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాష్ర్టంలో జోరుగా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోంది, అఫ్ఘనిస్తాన్ నుంచి వేలకోట్ల డ్రగ్ దిగుమతి అవుతున్నాయి, ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో ఒక టాల్కమ్ పౌడర్ కంపెనీ పేరుతో 21 వేల కోట్ల ‍హెరాయిన్ పట్టుబడింది, దీనికి ముఖ్యమంత్రి, డిజిపి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యాపారానికి గేట్లు ఎత్తి సంఘ వ్యతిరేక శక్తులు, టెర్రరిస్టు సంస్థలను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు.
నాసిరకం మద్యంతో సొంత బ్రాండ్లు తెచ్చి మందుబాబులను ఆర్థికంగా, శారీరకంగా పీల్చి పిప్పి చేస్తున్నారని అన్నారు. టీడీపీ 5 ఏళ్లలో ఏనాడు కరెంట్ చార్జీలు పెంచలేదు, ఎన్నికల సమయంలో జగన్ కరెంట్ చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. ట్రూప్ అప్ చార్జీల పేరుతో ప్రజలపై 11వేలకోట్ల భారం మోపారు, నిత్యావసరాల ధరల నుంచి పెట్రోల్, డీజిల్ వరకు అన్ని రేట్లు పెంచి సామాన్యుడు రాష్ర్టంలో జీవించలేని పరిస్థితి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా చెత్తపై పన్నువేసిన ఏకకై చెత్త ప్రభుత్వం జగన్ దేనని అన్నారు. నరేగా బిల్లులు చెల్లించకుండా పనులుచేసిన ఇబ్బందులకు గురిచేస్తే న్యాయ పోరాటం చేశాం, చివరకు కోర్టు చివాట్లు పెట్టడంతో ఇప్పుడు బిల్లులు చెల్లిస్తున్నారని అన్నారు.
చంద్రబాబు నాయుడుతో పలువురు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ…. తెలుగుదేశం పాలనలో వ్యవసాయరంగాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపి రైతులకు అన్ని విధాల న్యాయం చేశారని అన్నారు. కానీ జగన్ రెడ్డి వచ్చి వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు, క్రాప్ ఇన్సూరెన్స్ కడతానని చెప్పి సమయానికి కట్టకుండా రైతుల్ని మోసగించారన్నారు. కొంతమంది రైతులకు ఇంతవరకు క్రాప్ ఇన్సూరెన్స్ రాలేదు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే వరకు ఎన్ని కేసులైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టి.డి జనార్ధన్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్ష్యులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE