– పోలీసు విధులను అడ్డుకున్నందుకు కేసు
మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ను పోలీసులు గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మాధవ్ కు ఈ నెల 24 వరకు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో ఆయనను పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. అయితే అక్కడ తమకు తగిన సౌకర్యాలు లేవని నెల్లూరు జైలు అధికారులు చెప్పడంతో.. మాధవ్, ఆయన అనుచరులను రాజమహేంద్రవ రం సెంట్రల్జైలుకు రాత్రి తరలించారు.
పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై మాధవ్తో పాటు, మరో ఐదుగురు నిందితులకు కూడా కోర్టు రిమాండ్ విధించింది.
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం, పోలీసులు మాధవ్ను ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. రిమాండ్ను తిరస్కరించాలని మాధవ్ తరపున వాదించిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు. కోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది.
వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. ఎస్పీ కార్యాలయానికి తరలిస్తుండగా, మాధవ్ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. చుట్టుగుంట జంక్షన్ వద్ద తన కారును అడ్డుగా ఉంచి, కిరణ్కుమార్పై దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఆయన పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు తెలిపారు.