వినాయక చవితి వేడకల్లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదిస్తాం. కానీ మోరియా అనే మాటకు అర్ధం ఎవరికి తెలియదు. మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? దానికి అర్థం ఏమిటి ? దాని వెనక ఉన్న అసలు కథ ఏంటో ? తెలుసుకుందాం..
మోరియా అసలు కథ:
15వ శతాబ్దంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు ఉండేవాడట. అతను మహారాష్ట్రలోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడ్ అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడ్ నుంచి, మోర్ గావ్ కు రోజూ కాలినడకన వెళ్లేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి..అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ..దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించమని చెప్పాడట. గణపయ్య చెప్పటం భక్తుడు వెళ్లకపోవటమూనా..వెంటనే మోరియా నదికి వెళ్లాడు. గణపతి చెప్పినట్టుగానే అక్కడ మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికిందట.
ఈ విషయం ఆనోటా..ఈనోటా స్థానికులకు తెలిసింది. దీంతో మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ.. మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అంటే.. గోసావి మంగళమూర్తి అంటూ మొక్కారట. గణపతి ప్రతిమను నది నుంచి తెచ్చిన మోరియా గొప్ప భక్తుడు కాబట్టి అప్పటి నుంచి గణపతి ఉత్సవాల్లో ఆయన పరమ భక్తుడు మోరియా గోసావి ఓ భాగమైపోయాడు. ఆనాటి నుంచి ’గణపతి బప్పా మోరియా’..అనే నినాదం కొనసాగుతోంది. భక్త వల్లభుడైన వినాయకుడి సేవలతో మోరియా గోసావి తరించిపోయాడు.