– కిషన్ రెడ్డి అడ్డుపడటం వల్లే మెట్రో ఆగింది
– మేం మోదీ ఆస్తులనో, కిషన్ రెడ్డి ఆస్తులనో అడగడం లేదు
– దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేసే కుట్ర
– మేం ఢిల్లీకి వెళ్లి లిక్కర్ దందా చేయడంలేదు
– సీట్ల ప్రాతిపదికన పునర్విభజన చేపట్టాలి
– ఏపీలో మీ ప్రభుత్వంలో ఉన్నా ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేయడంలేదు?
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్
– గాంధీ భవన్ ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: మోదీ గుజరాత్ నుంచి రైళ్లల్లో నోట్ల కట్టలు పంపిస్తున్నట్లు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మేం మోదీ ఆస్తులనో, కిషన్ రెడ్డి ఆస్తులనో అడగడం లేదు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటినే కేంద్రాన్ని అడుగుతున్నాం. కిషన్ రెడ్డి అడ్డుపడటం వల్లే మెట్రో ఆగింది.
మూసీకి నిధులు అడిగితే అవహేళన చేస్తున్నారు. సబర్మతిని, గంగానదిని, యమునా నదిని వాళ్లు ప్రక్షాళన చేయొచ్చు కానీ మేం మూసీని ప్రక్షాళన చేయొద్దా? కిషన్ రెడ్డి వందశాతం సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. రీజనల్ రింగ్ రోడ్ పై ఆనాడు మోడీ స్పష్టమైన ప్రకటన చేసింది నిజం కాదా ఎందుకు మెట్రోను కేంద్రమంత్రివర్గ ఎజెండాలో పెట్టడంలేదు?
ఎజెండాలో పెట్టొద్దని మంత్రివర్గంపై ఒత్తిడి తెస్తోంది ఎవరు? ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన ప్రాజెక్టు ఏమైనా తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలి మీరు బెదిరిస్తే భయపడటానికి ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరు. మేం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులే అడుగుతున్నాం.
కిషన్ రెడ్డి ఒక్కరోజైనా మోడీ దగ్గర తెలంగాణ రాష్ట్రానికి కావలసినవి ఏమైనా అడిగారా? ఏ పార్లమెంట్ సమావేశంలో మీరు మాట్లాడారో చెప్పండి? ఖచ్చితంగా కిషన్ రెడ్డిది సైంధవ పాత్రనే. కెసిఆర్ దిగిపోయారనే బాధతో కిషన్ రెడ్డి మాపై పడుతున్నారు. తెలంగాణకు కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలి.
బీజేపీ కూటమి అధికారంలో ఉన్న పక్క రాష్ట్రంలో ముస్లింలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న బీహార్ , యూపీ లాంటి రాష్ట్రంలో ముస్లింలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. అక్కడ ఎందుకు రద్దు చేయించడంలేదు? ఏపీలో మీ ప్రభుత్వంలో ఉన్నా ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేయడంలేదు? కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి లేకనే కులగణనపై విమర్శలు చేస్తున్నారు.
తమిళనాడుకు మెట్రోకు అనుమతిస్తారు కానీ తెలంగాణకు ఎందుకివ్వరు కిషన్ రెడ్డి అడ్డుపడటం వల్లే మెట్రోకు అనుమతులు ఇవ్వడంలేదు. ఎప్పటిలోగా మెట్రోకు అనుమతులు తెస్తారో కిషన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి.కులగణనలో పాల్గొనాలని కెసిఆర్ ను కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు డిమాండ్ చేయడంలేదు? లోపాలు ఉన్నాయని విమర్శించేవారు ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పండి. బీసీలకు అన్యాయం చేయాలనుకునే కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు.. బిజెపి, బీఆరెస్ చీకటి ఒప్పందాన్ని ఎండగడతాం.
కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తాం. మేం ఢిల్లీకి వెళ్లి లిక్కర్ దందా చేయడంలేదు. రాష్ట్రానికి కావాల్సినవి అడుగుతున్నాం. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోంది.
శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాది తీవ్రంగా సంక్షోభంలో కూరుకుపోతుంది. సీట్ల ప్రాతిపదికన పునర్విభజన చేపట్టాలి. దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. బీజేపీ కుట్రలను సాగనివ్వం. ధీటుగా ఎదుర్కొంటాం.