– కేంద్ర ఆర్థిక మంత్రి, పలువురు ఇతర మంత్రులతో భేటీ
అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ జాతీయ ఆరోగ్య మిషన్, ఇతర పథకాల కింద రాష్ట్రానికి అదనంగా రూ.259 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో శుక్రవారంనాడు సమావేశమైన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమెకు ఈ విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద పునఃకేటాయింపులు జరిపే తరుణంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ ప్రతిపాదనను కేంద్రం ముందుంచారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూ.800 కోట్ల మేరకు పునఃకేటాయింపుల కింద అదనపు నిధుల్ని కోరింది. వీటిలో ఎన్హెచ్ ఎం కింద రాష్ట్రానికి రూ.109 కోట్లు విడుదల చేయాలని కేంద్ర వైద్య, ఆర్థిక శాఖా మంత్రుల్ని కోరారు. పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కింద రాష్ట్రానికి మరో రూ.150 కోట్లు విడుదల చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.
కేంద్ర టూరిజం, న్యాయ, అణుశక్తి శాఖా మంత్రులతో కూడా సమావేశమైన మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్రానికి చెందిన పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, క్యాన్సర్ చికిత్సల విషయంలో అదనపు కేంద్ర సాయాన్ని కోరారు.