Suryaa.co.in

Family

డబ్బు శాశ్వతం కాదు.. డబ్బే జీవితమూ కాదు

ఒక జడ్జి తన వృత్తినుండి పదవీవిరమణ అయ్యాక తన భార్య నుండి తనలోని భావాలను ఇలా పంచుకుంటున్నారు.

”లక్ష్మీ! నేను లాయర్ గా ఉన్నప్పుడు కాని జడ్జి గా ఉన్నప్పుడు కానీ ఈరోజు నేను చూసిన నా చివరి కేసు లాంటిది చూడనే లేదు” అని అన్నాడు.
“ఏంటా కేసు?” అని ఆమె అడగగా…
”ఒక తండ్రి తన కొడుకు తనకు నెలకు డబ్బులు ఇవ్వడం లేదని కేసు“ అన్నాడు.

కొడుకుని పిలిచి … “ఏంటయ్యా నీ తండ్రికి నెలకు సరిపడ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు?” అని అడిగాను.
”మా తండ్రిగారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ పొందిన వ్యక్తి. నెలనెలా ఆయనకు పెన్షన్ వస్తున్నది. బాగానే డబ్బులు ఉన్న వ్యక్తి. నా పైన ఇలా ఎందుకు కేసు పెట్టాడో అర్థం కాలేదు” అన్నాడు.
ఆ తండ్రి “అవును డబ్బుకు నాకు లోటులేదు, కాని నా కొడుకు నెలకు 100 రూపాయలు కానివ్వండి స్వయంగా వచ్చి అందించేలా తీర్పు ఇవ్వమ”ని అడిగాడు.

తీర్పు చెప్పాక ఆ తండ్రిని కలిసాను “ఎందుకయ్యా ఇలా అడిగావు” అని ”మాకు ఉన్నది ఒక్కడే కొడుకు. మీరు ఇచ్చే తీర్పు కారణంగా అయినా నెలకు ఒక్కసారి మా దగ్గరకు వచ్చి మాతో గడిపి వెళ్ళగలడని ఆశ, వాళ్ళ అమ్మకు వాడంటే ప్రాణం।” అని అన్నాడు. ఇలా చెబుతూ ఆయన కళ్ళు తడిచాయి.

డబ్బే ప్రధానం అనుకుంటారు; అంత కంటే ఎక్కువగా మనల్ని ఎదురుచూసేవారుంటారు అని గుర్తించలేము. నాకెందుకో అప్పటి కన్నవారికి నేడు ఉన్న తల్లితండ్రులకి చాలా తేడా కనిపిస్తుంది.

మా పిల్లలు డబ్బు సంపాదించకపోయినా పర్లేదు మా కళ్ళ ముందు ఉంటే చాలు సరిపడా సంపాదన చాలు అనుకునే వారు…. నేడు పిల్లలు అంటే వారు విధేశాలకు వెళ్ళిపోవాలి, లక్షలు సంపాదించాలి అని కోరుకుంటున్నారు.

అందుకే ప్రేమ ఆప్యాయతలు బంధాలు అనేవాటికి విలువ లేకుండా పోయింది . ఎవరైనా ఇవన్నీ పిల్లల నుండి ఎదురుచూస్తుంటే పిచ్చివాళ్ళను చూసినట్టు చూస్తున్నారు. అనురాగం ఆప్యాయత అందని ద్రాక్ష పళ్ళు కాకూడదు కనిపెంచిన తల్లిదండ్రులకు!

– బీఎండబ్ల్యు లక్ష్మి

LEAVE A RESPONSE