Suryaa.co.in

Devotional Places

చిదంబర రహస్యం

ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన, విశ్లేషణ అనంతరం, పాశ్చాత్య శాస్త్రవేత్తలు, ప్రపంచం యొక్క అయస్కాంత క్షేత్ర, భూమధ్య రేఖ యొక్క కేంద్ర స్థానం చిదంబరం లోని నటరాజ స్వామి పెద్ద బ్రొటన వేలు లో ఉన్నది అని నిరూపించారు.
మన ప్రాచీన తమిళ పండితుడు, కవి ’తిరుమూలర్’ ఈ విషయాన్ని ఐదు వేల సంవత్సరాల క్రితమే వక్కాణించారు. వీరు రచించిన ’తిరుమందిరం’ అనే గ్రంథం ప్రపంచం అంతటికీ శాస్త్రీయంగా మార్గ నిర్దేశం చేసే అద్భుతమైన గ్రంథరాజం. వీరి అధ్యయనాలను, విశ్లేషణలను అర్థం చేసుకోవడానికి బహుశా మనకు మరో వందేళ్లు కావాలి, ప్రత్యేకించి, చిదంబరం ఆలయం ఈ విధమైన లక్షణాలు, విశిష్టతలు కలిగి ఉంది.

ప్రపంచం యొక్క అయస్కాంత క్షేత్రం -భూమధ్యరేఖ యొక్క కేంద్ర స్థానం లో ఈ ఆలయం నెలకొని ఉంది.
‘పంచభూత’ ఆలయాలలో, చిదంబరం-‘ఆకాశ’ తత్వానికి ప్రతీక, శ్రీ కాళహస్తి-‘వాయు’ తత్వానికి ప్రతీక, శ్రీ కాంచీ పురం-‘భూమి’ తత్వానికి ప్రతీక. ఈ మూడు క్షేత్రాలు/ ఆలయాలు ఒకే రేఖ పైన, 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం(79°41′) పై నెలకొని ఉన్నాయి.
ఆసక్తి కలవారు ఈ విషయాన్ని గూగుల్ లో పరీక్షించుకోవచ్చును. ఇది ఒక అద్భుతమైన వాస్తవమే కాక, ఖగోళ శాస్త్రంలో కూడా అద్భుతమే.

చిదంబర క్షేత్రం మానవ శరీర నిర్మాణం ఆధారంగా నిర్మించబడినది. మానవ శరీరం తొమ్మిది ద్వారాలను/రంధ్రాలను కలిగి ఉన్నట్లే, ఈ ఆలయం లో తొమ్మిది ద్వారాలు ఉన్నాయి.
ఆలయం పై కప్పు/ విమాన గోపురం లో 21,600 స్వర్ణ పత్రాలు/బంగారు రేకులు ఉపయోగించబడినవి. ఇవి, మనిషి ఒక రోజు లో తీసుకునే శ్వాస ను సూచిస్తాయి.(15x60x24=21,600).
ఈ 21,600 బంగారు రేకులను 72,000 బంగారు మేకులు ఉపయోగించి బిగించ బడినవి. మానవ శరీరం లో ఉన్న 72,000 నాడులకు ఇవి ప్రతీకలు. ఇవి శరీరం లోని కొన్ని అదృశ్య భాగాలకు ‘శక్తి’ ని సరఫరా చేస్తాయి.
మనిషి ‘శివలింగం’ ఆకారానికి ప్రాతినిధ్యం వహిస్తాడని తిరుమూలర్ వివరించారు. అదే ‘చిదంబరం’, ‘సదాశివం’, నటరాజ తాండవాన్ని సూచిస్తుంది.

‘పొన్నాంబలమ్’ కొద్దిగా ఎడమవైపుకు వంగి ఉంటుంది. ఇది హృదయ స్థానాన్ని సూచిస్తోంది. దీన్ని చేరుకోవడానికి ఐదు మెట్లను ఎక్కాలి, అవి, ‘పంచాక్షరి’ ‘పడి’, ‘శి వా య న మః’ అనే పంచాక్షరీ మంత్రం. నాలుగు వేదాలే, నాలుగు స్తంభాలు గా, వీటి ఆధారంగా ‘కనకసభ’ ఉన్నది.

‘పొన్నాంబలమ్’ 28 శైవ ఆగమాలకు (28 పూజా విధానములు) సూచనగా 28 స్తంభాలను కలిగి ఉంది. ఈ 28 స్తంభాలు, ఆలయం పై కప్పు లోని 64 దూలాలకు(బీమ్) ఆధారంగా ఉన్నాయి. ఈ 64, అరువది నాలుగు కళలను సూచిస్తాయి. ఆలయం లోని అడ్డ దూలాలు మనిషి శరీరం లో అంతటా వ్యాపించి ఉన్న రక్త నాళాలను సూచిస్తాయి.

గర్భాలయం పైన బంగారు విమానం పై ఉన్న తొమ్మిది కలశాలు, తొమ్మిది రకములైన శక్తి ని సూచిస్తాయి. అర్థ మంటపం లోని ఆరు స్థంభాలు, ‘ఆరు శాస్త్రముల’కు సూచికలు. ప్రక్కగా ఉన్న మంటపం లోని 18 స్తంభాలు, పద్దెనిమిది పురాణాలను సూచిస్తాయి.

నటరాజ స్వామి తాండవాన్ని/నృత్యాన్ని పాశ్చాత్య శాస్త్రవేత్తలు విశ్వ తాండవం/నృత్యం గా పేర్కొన్నారు.
విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు దేనిని సిద్ధాంతీకరిస్తున్నదో, దాన్ని వేల సంవత్సరాలకు పూర్వమే హిందూ మతం వక్కాణించి చెప్పింది.

– ఎంబీఎస్ గిరిధర్‌రావు

LEAVE A RESPONSE