– ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచన
– ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు. ఏలూరు శాంతినగర్ లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ‘ప్రజా దర్బార్’ నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అర్జీలు స్వీకరించారు.
ప్రతి ఒక్కరి సమస్యలను సావధానంగా విని, సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భరోసా కల్పించారు. తక్షణమే స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ అప్పటికప్పుడు అధికారులకు ఫోన్ చేసి సమస్యలను వారికి వివరించి, పరిష్కరించాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఇచ్చిన అర్జీలను తమ సిబ్బంది ఆన్లైన్ చేస్తారని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు.
ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి సంబంధించిన పురోగతిని అర్జీదారులకు ఫోన్ చేసి సమాచారం అందిస్తారని ఎంపీ పేర్కొన్నారు. తాను లేని సమయంలో కూడా కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగం ద్వారా అర్జీలు స్వీకరిస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలు ఎప్పుడైనా తన క్యాంపు కార్యాలయానికి వచ్చి సేవలు వినియోగించుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ సూచించారు.