Suryaa.co.in

Andhra Pradesh National

మోదీకి అకీరాను పరిచయం చేసిన పవన్

ప్రధానమంత్రి నరేంద్రమోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా పవన్ తన తనయుడు అకీరా నందన్‌‌ను మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ పోటీ చేసి గెలిచింది. పవన్ విజయంపై మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.

అయితే పవన్ కళ్యాణ్ విజయంపై అకీరా ఓ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను అకీరా తల్లి రేణూ దేశాయ్‌ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న(బుధవారం) సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే.

మోదీ నివాసంలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మోదీని ముచ్చటగా మూడోసారి ఎన్డీయే సారథిగా భాగస్వామ్య పక్షాల నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 8వ తేదీ లేదా 9న మోదీ, కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తన తనయుడు అకీరా నందన్‌‌‌ను త్వరలోనే సినీరంగంలో అరంగ్రేటం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

LEAVE A RESPONSE