అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు హాజరవుతానని జనసేన అధినేత పవన్కల్యాణ్ చెప్పారని ఆ ప్రాంత మహిళా రైతులు తెలిపారు. తొలి నుంచీ అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉన్నారంటూ.. మంగళగిరిలో పవన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా యాత్ర ముగింపు సభకు ఆహ్వానించగా.. వస్తానని చెప్పారని మహిళలు వివరించారు. అన్ని పక్షాల మద్దతుతో అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా కాపాడుకుంటామని మహిళలు ధీమా వ్యక్తంచేశారు. తిరుపతిలో నిర్వహించనున్న పాదయాత్ర ముగింపు సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా అనుమతి నిరాకరించారని ఆరోపించారు. సభకు అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.