Suryaa.co.in

Andhra Pradesh

జనం నమ్మకం కోల్పోయిన జగన్

-ఎన్నికల్లో అక్రమాలనే నమ్ముకున్నాడు
-వైసీపీ ఎన్నికల కుట్రలను అడ్డుకోవడంలో ప్రజలూ భాగస్వాములు కావాలి
-సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులతో వైసీపీ అక్రమాలకు చెక్ పెట్టాలి
-ఏప్రిల్ 15 వరకు ఓట్ల నమోదుకు ఉన్న అవకాశాన్ని యువత వినియోగించుకోవాలి
-ప్రజలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు

అమరావతి:- 5 ఏళ్ల తన పాలనపై సీఎం జగన్ కు నమ్మకం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పూర్తిస్థాయిలో జనం నమ్మకం, మద్ధతు కోల్పోయిన జగన్…ఎన్నికల్లో అక్రమాలను చివరి అస్త్రంగా ఎంచుకున్నాడని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని ఇంటికి పంపేందుకు ఇప్పుడు రాష్ట్ర పౌరులు బాధ్యత తీసుకుని ముందడుగు వేయాలని కోరారు.

ఎన్నికల నిబంధనలు సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభ పెట్టడం, ప్రభుత్వ ఉద్యోగులతో నిబంధనలకు విరుద్దంగా పనులు చేయించడం, ప్రత్యర్థి పార్టీలపై తప్పుడు ప్రచారం చేయడం వంటి వివిధ కోడ్ ఉల్లంఘనలపై సి-విజిల్ అనే యాప్ ద్వారా ప్రజలే నేరుగా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు తమ దృష్టికి వచ్చిన ప్రతి తప్పును సి-విజిల్ యాప్ ద్వారా అత్యంత సులభంగా ఈసీ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని అన్నారు.

తద్వారా ప్రజలు కూడా పారదర్శక ఎన్నికల నిర్వహణకు తమ వంతుగా కృషి చేసినట్లు అవుతుందన్నారు. పౌరులు నేరుగా సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఈసీ వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని..ఈ కారణంగా వెంటనే ఈ యాప్ ను ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిబంధనల అమలు విషయంలో టెక్నాలజీని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. అధికార పార్టీ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానకి ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన పోరాటం చేస్తున్నాయని…ఈ పోరాటంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నదే తమ అభిమతమని అన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే ఎన్నికల్లో అక్రమాలను మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.

యువతకు పిలుపు
జగన్ రెడ్డి రివర్స్ పాలనతో రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయింది యువతే అని చంద్రబాబు నాయుడు అన్నారు. యువత తమ భవిష్యత్ కోసం సమర్థవంతమైన నాయత్వాన్ని గెలుపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత కూడా కొత్తగా ఓట్లు నమోదు చేసుకునే అవకాశం ఉందని…దీన్ని యువత సద్వివినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 15 తేదీ వరకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.

ఆన్ లైన్ ద్వారా సులభంగా ఓటు హక్కు పొందాలని యువతకు సూచించారు. రాక్షస పాలన అంతంలో ప్రతి ఓటూ..ప్రతి సీటూ కీలకమని….యువత తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ఓటు నమోదు చేసుకుని మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఈ మేరకు బుధవారం చంద్రబాబు నాయుడు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

LEAVE A RESPONSE