Suryaa.co.in

Andhra Pradesh

పోలవరం: నీటి పారుదల పనులకే నిధులు

రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: పోలవరం ప్రాజెక్ట్‌లో ఇరిగేషన్‌ విభాగానికి మాత్రమే నిధులు కేటాయించబోతున్నట్లు జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. 2017-18 ధరల ప్రాతిపదికపై పోలవరం ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి రెండవసారి సవరించిన అంచనా వ్యయం మొత్తం 55,548 కోట్లను 2019 ఫిబ్రవరిలో జరిగిన సలహా సంఘం సమావేశం ఆమోదించినట్లు తెలిపారు. తదుపరి దీనిని పరిశీలించిన రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ సవరించిన అంచనా వ్యయంలో కేవలం ఇరిగేషన్‌ విభాగానికి అయ్యే ఖర్చు మొత్తం 35,950 కోట్లకు మాత్రమే ఆమోదం తెలుపుతూ మార్చి 2020న నివేదికను సమర్పించింది. దీనిపై పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ) తుది సిఫార్సుల అనంతరం ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
2014 ఏప్రిల్‌ 1 నుంచి పోలవరం ప్రాజెక్ట్‌లో ఇరిగేషన్‌ విభాగం పనులకు అయ్యే వ్యయాన్ని నూరు నూరు శాతం భరించడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తదనుగుణంగా పోలవరం పనుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చుకు సంబంధించిన బిల్లులను పీపీఏ, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ) పరిశీలించి, సిఫార్సు చేసిన మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి రీయంబర్స్‌ చేస్తున్నట్లు చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి 11,600 కోట్ల రూపాయలను రీయంబర్స్‌ చేసింది. అదనంగా మరో 711 కోట్ల రూపాయల రీయంబర్స్‌మెంట్‌ కోరుతూ ఇటీవలే పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫార్సు చేసినట్లు మంత్రి చెప్పారు.
కాచ్‌ ద రైన్‌ క్యాంపెయిన్‌ కింద ఏపీలో 7 లక్షల 97 వేల పనులు…
జలశక్తి అభియాన్‌: కాచ్‌ ద రైన్‌ క్యాంపెయిన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 7 లక్షల 97,502 పనులు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. జలశక్తి అభియాన్‌ ప్రారంభించిన ఈ క్యాంపెయిన్‌ కింద జల సంరక్షణ, వర్షపు నీటి సంరక్షణ, సాంప్రదాయ నీటి వనరులు, చెరువుల పునరుద్దరణ, బోరు బావుల పునరుద్దరణ, వాటర్‌షెడ్‌ డెవలప్‌మెంట్‌, అడవుల పెంపకం, శిక్షణా కార్యక్రమాలు, కిసాన్ మేళాల నిర్వహణ వంటి పనులను దేశ వ్యాప్తంగా చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు.
వీజీఎఫ్‌ సర్దుబాటు చేస్తేనే పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌
వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) సర్దుబాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు వస్తేనే కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ నిర్మాణం సాధ్యమవుతుందని పెట్రోలియ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి స్పష్టం చేశారు. రాజ్యసభలో సోమవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ కాకినాడలో 32 వేల 901 కోట్ల రూపాయల వ్యయంతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ ఏర్పాటు కోసం 2017 జనవరి 27న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గెయిల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. తదనంతరం ప్రాజెక్ట్‌ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చాలంటే వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే భరించాలని ఆయిల్‌ కంపెనీలు స్పష్టం చేశాయి. అనంతరం వీజీఎఫ్‌ను సమకూర్చవలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పెట్రోకెమికల్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు భారీ మూలధన వ్యయం, పెట్టుబడుల అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాలిస్తే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అది ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పారిశ్రామీకరణతోపాటు రాష్ట్రానికి పన్నుల రూపంలో రాబడి పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అందువలన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే దీనిపై తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని మంత్రి తన జవాబులో స్పష్టం చేశారు.
ఖరగపూర్-విజయవాడ మధ్య డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌
ఖరగపూర్‌, విజయవాడ (1115 కి.మీ), విజయవాడ-నాగపూర్‌(975కి.మీ)ల మధ్య డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ నిర్మాణం కోసం రైల్వే శాఖ డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు గనుల శాఖ మంత్రి ప్రల్హాద్‌ జోషి వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ నేషనల్‌ మినరల్‌ పాలసీ కింద డెడికేటెడ్‌ మినరల్‌ కారిడార్లు కల్పించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. మైనింగ్‌ చేసే ప్రాంతాల నుంచి ఖనిజాలను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఈ కారిడార్లు ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. మినరల్‌ కారిడార్లకు అనుబంధంగా ఖనిజ రవాణా కోసం స్థానికంగా సమగ్రమైన రీతిలో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా భారీ సరకులతో పొడవాటి ట్రైన్ల ద్వారా రవాణా చేసేలా రూపుదిద్దుకుంటాయని మంత్రి చెప్పారు.

LEAVE A RESPONSE