Suryaa.co.in

Telangana

కౌంటింగ్ రోజు ర్యాలీలకు అనుమతి లేదు

– స్పష్టం చేసిన సీఈవో వికాస్‌ రాజ్‌

హైదరాబాద్: ఈ నెల 4న ఉదయం 8 గంటలకు లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని సీఈవో వికాస్‌ రాజ్‌ వెల్లడించారు.మొదట పోస్టల్‌ బ్యాలెట్స్‌ లెక్కింపు ఉంటుందని.. 8.30 గంటలకు ఈవీఎం ల ఓట్ల లెక్కింపు షురూ అవుతుందని ప్రకటించారు. హైదరాబాద్‌ లోని బీఆర్‌కే భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కౌంటింగ్ కేంద్రాల వద్ద నాలుగు అంచెల భద్రత ఉంటుందని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకు వెళ్లేందుకు అనుమతి ఉండదని సీఈవో వికాస్ రాజ్ స్పష్టం చేశారు. అలాగే, కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బందికి సైతం సెల్‌ ఫోన్స్‌ అనుమతి ఉండవని తెలిపారు.

కౌంటింగ్‌ కేంద్రం లోని ప్రతి మూలను కవర్‌ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఉంటుందని.. స్ట్రాంగ్‌ రూం నుంచి లెక్కింపు కేంద్రం వరకు బారికేడ్లు, పటిష్ఠ భద్రత ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.17 లక్షల పోస్టల్ బ్యాలెట్స్‌ వచ్చాయని చెప్పారు. ఈ పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు 276 టేబుల్స్‌ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుందని.. మరో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యల్పంగా 13 రౌండ్ల లెక్కింపు వికాస్‌ రాజ్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10 వేల మంది సిబ్బంది పాల్గొంటారని.. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్‌గా కేటాయిస్తామన్నారు. లెక్కింపు రోజు ఉదయం 5 గంటలకు మరోసారి ర్యాండమ్‌గా సిబ్బందిని కేటాయిస్తామని చెప్పారు.

2400 పైగా మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్‌లో పాల్గొంటారని చెప్పారు. కౌంటింగ్ రోజున మద్యం దుకాణాలు బంద్‌ ఉంటాయని.. అలాగే ర్యాలీ లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ర్యాలీ లకు పోలీసులు అనుమతి ఇస్తే చేసుకోవచ్చునన్నారు. శనివారం సాయంత్రం 6.30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్‌ విడుదల చేసుకోవచ్చన్నారు.

LEAVE A RESPONSE