– 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఎస్పీఎల్ పిటిషన్ డిస్మిస్
– పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లండి
– సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలని హైకోర్టుకు సూచన
– సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశం
న్యూఢిల్లీ: తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో రేవంత్రెడ్డి సర్కారుకు శరాఘాతం తగిలింది. స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారించేందుకు నిరాకరిస్తూ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం డిస్మిస్ చేసింది.
హైకోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని.. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది.
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. రిజర్వేషన్లు 50శాతం మించొద్దనే అభిప్రాయం సరికాదని కోర్టుకు వివరించారు. ఇందిరా సహానీ కేసులోనూ 50శాతం పరమితి దాటొచ్చని ఉందని గుర్తు చేశారు.
దేశంలో ఎక్కడా జరగని విధంగా, తెలంగాణలో కులగణన సర్వే జరిగిందని, ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్క తేల్చిందని అభిషేక్ సింఘ్వీ అన్నారు
రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని, 3 నెలలు దాటినా బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని వాదించారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొందినట్టేనని సుప్రీం చెప్పిందని, సుప్రీం తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారినట్టేనని వాదనలు వినిపించారు.
అయితే, రిజర్వేషన్లు 50 శాతం మించరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కృష్ణమూర్తి తీర్పు స్పష్టంగా చెబుతోందని, ప్రతివాదుల తరఫు న్యాయవాది బలంగా వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.
ఈ దశలో పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని కొట్టివేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా ఈ కేసులో విచారణను కొనసాగించాలని హైకోర్టుకు సూచించింది.