ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు హర్షం
విజయవాడ: గత ఆర్ధిక సంవత్సరం (2022 – 23)లో డా. వై.ఎస్.ఆర్ ఆరోగ్యశ్రీ పథంకం క్రింద వర్కింగ్ జర్నలిస్టులకు రూ. 2 కోట్ల మేర నగదు రహిత వైద్య సేవలు అందించినందుకు ఆ సంస్థ సి.ఈ.ఓ. ఎం.ఎన్. హరీంద్ర ప్రసాద్ కు ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు కృతఙ్ఞతలు తెలిపారు. డా. వై.ఎస్.ఆర్ ఆరోగ్యశ్రీ అమలులో క్షేత్ర స్థాయి లో వర్కింగ్ జర్నలిస్టుల ఎదుర్కొంటున్న పలు సమస్యల పై మార్చి 15 వ తేదీన తాము ఇచ్చిన లేఖ కు ఆ సంస్థ సి.ఈ.ఓ. లేఖ ద్వారా స్పందించిన తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
హెల్ప్ లైన్ ‘104’ లో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు ఒక ప్రత్యేక ‘లైన్’ ఏర్పాటుచేస్తున్నట్లు ఆ లేఖ లో పేర్కొన్నందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2510 ప్రొసీజర్స్ ను నగదు రహిత వైద్య సేవలు విధానం లో వర్కింగ్ జర్నలిస్టులకు వర్తింపచేయడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథంకం క్రింద 8699 వర్కింగ్ జర్నలిస్టులు, వారి పై ఆధార పడ్డ 26,707 మంది కి నగదు రహిత వైద్య సేవలు అందుతున్నట్లు సి.ఈ.ఓ. లేఖ ద్వారా స్పష్టమైందని చైర్మన్ ఆ ప్రకటన లో పేర్కొన్నారు. అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల జారీ ని సులభతరం చేస్తూ ప్రభుత్వ ఉత్తరువులు వెలువడడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.