Suryaa.co.in

Telangana

ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్దిదారుల‌కు రూ. 20.19 కోట్లు విడుద‌ల‌

– రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్ : బేస్‌మెంట్ పూర్తి చేసుకున్న ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్దిదారుల‌కు రూ. 20.19 కోట్ల రూపాయిల‌ను నేరుగా వారి బ్యాంకు ఖాతాల‌లో జ‌మ‌చేయ‌డం జ‌రిగింద‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. మొద‌టి విడ‌త‌లో పైల‌ట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసిన 70,122 ఇండ్ల‌లో బేస్ మెంట్ పూర్తి చేసుకున్న 2019 మందికి ల‌క్ష రూపాయిల చొప్పున రూ. 20.19 కోట్ల రూపాయిల‌ను విడుద‌ల చేశామ‌ని మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో మంత్రి తెలిపారు. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాకూడా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి ఆటంకం ఏర్ప‌డ‌కుండా నిధులు విడుద‌ల చేస్తామ‌న్నారు.

నిర్మాణం పూర్తైన వెంట‌నే బేస్ మెంట్ పూర్తైన త‌ర్వాత ల‌క్ష రూపాయిలు, గోడ‌లు పూర్తైన త‌ర్వాత 1.25 ల‌క్ష‌ల రూపాయిలు, శ్లాబ్ పూర్తిచేసుకున్న త‌ర్వాత 1.75 ల‌క్ష‌ల రూపాయిలు, ఇల్లు పూర్తైన త‌ర్వాత మిగిలిన ల‌క్ష రూపాయిలు విడుద‌ల చేస్తామ‌ని వివ‌రించారు.

బేస్‌మెంట్ గాని గోడ‌లు గాని శ్లాబ్‌గాని నిర్మాణం పూర్తిచేసుకుంటే అధికారుల కోసం ఎదురుచూడ‌కుండా ల‌బ్దిదారులే ఫోటో తీసి మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేసినా కూడా డ‌బ్బులు ల‌బ్దిదారుల ఖాతాలో జ‌మ‌చేస్తామ‌ని తెలిపారు.

క‌నీసం 400 ఎస్ ఎఫ్ టి కి త‌గ్గ‌కుండా 600 ఎస్ ఎఫ్‌టీకి మించ‌కుండా ల‌బ్దిదారులు ఇంటిని నిర్మించుకోవాల‌ని సూచించారు. అర్హులైన ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్దిదారుల ఎంపిక ప్ర‌క్రియ మ‌రింత వేగ‌వంతం చేయ‌డం, అధికారుల‌కు , ప్ర‌జాప్ర‌తినిధుల‌కు స‌మ‌న్వ‌యం ఉండేలా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ఒక ప్ర‌త్యేక అధికారిని నియ‌మిస్తున్నామ‌ని తెలిపారు.

LEAVE A RESPONSE