దేశ చరిత్రలో అత్యంత కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ

డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి పడిపోయింది. బుధవారం ఉదయం ఒక డాలర్ కు రూ.78.13 పైసలతో ఫారిన్ ఎక్స్ఛేంజీ మార్కెట్ ప్రారంభం కాగా.. చివరికి రూ.78.40 పైసల వద్ద ముగిసింది. విదేశీ పెట్టుబడిదారులు దేశం నుంచి భారీ స్థాయిలో సొమ్మును వెనక్కి తీసుకుంటుండటంతో.. డాలర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగిందని, అదే రూపాయి పతనానికి కారణమైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒక్క జూన్ నెలలోనే ఇప్పటివరకు రూ. 38,500 కోట్ల మేర సొమ్మును విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్టు రిజర్వు బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి.

రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగినా..
రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగినా చారిత్రక కనిష్ఠ స్థాయికి తగ్గడం గమనార్హం. డాలర్లకు డిమాండ్ తో రూపాయి విలువ తగ్గుతుండటంతో.. దానిని అడ్డుకునేందుకు కొన్ని నెలలుగా రిజర్వు బ్యాంకు తన వద్ద ఉన్న డాలర్ నిల్వలను మార్కెట్లోకి వదులుతోంది. దీనితో దేశంలో ఫారిన్ ఎక్స్ఛేంజీ నిల్వలు తగ్గుతున్నాయని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఒక్క జూన్ 3–10 మధ్యే విదేశీ కరెన్సీ నిల్వలు 459 కోట్ల డాలర్ల మేర తగ్గాయని వెల్లడించారు.

Leave a Reply