– న్యాయం చేయాలని వేడుకుంటే జగన్ స్టిక్కర్ అతికించి పంపేశారు
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎదుట బాధితుల గగ్గోలు
ఎస్.కోట: శంఖారావం సభకి వచ్చిన నారా లోకేష్కి వినతిపత్రం అందిస్తున్న ఈ వ్యక్తిపేరు శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన సుంకర పైడన్న. ఆయన జేబులో సెల్ ఫోన్కి జగనే మా నమ్మకం స్టిక్కర్ అతికించి ఉంది చూడండి.. కానీ పైడన్నకి జగన్ గ్యాంగ్ నమ్మకద్రోహం చేసింది. కోట్ల విలువైన 25 ఎకరాల భూమిని కబ్జా చేసి, సెల్ ఫోన్ కి జగనే మా నమ్మకం అంటూ స్టిక్కరేసి పంపేసింది ఎస్ కోట వైకాపా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గ్యాంగ్.
చివరికి బాధితుడైన సుంకర పైడన్నయువనేత నారా లోకేష్ వద్దకు వచ్చి తమగోడు విన్పించుకున్నారు. ఎస్.కోట నియోజకవర్గం కొత్తవలస నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సహకారంతో ఆయన బంధువులు యథేచ్చగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని బాధితుడు పైడన్న వాపోయారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… కొత్తవలస పంచాయతీ పరిధిలోని అర్దన్నపాలెంలో సర్వే నంబర్లు 134, 135-2, 137-2, 138-2లో దంతులూరి సూర్యనారాయణ గజపతి రాజుకు చెందిన 25 ఎకరాల 91 సెంట్ల భూమిని బోదుల స్వామి నాయుడుకు కౌలుకు ఇచ్చారు.
అయితే సూర్య నారాయణ చనిపోయిన తర్వాత ఆయన వారసులు ముద్దరాజు వెంకటరాజు, తాక్ష్య రవిరాజు, సుంకర పైడన్నలకు భూమిని విక్రయించారు. ఈ అమ్మకం వ్యవహారం ఉండగానే, కౌలుదారు బోదుల స్వామి నాయుడు ఆ భూమిని తమ పేరు మీద అక్రమంగా రిజిష్టర్ చేయించుకుని తన కుమారులైన అప్పలనాయుడు, విశ్వనాథం, వెంకటరావు, సత్యనారాయణ, సోమినాయుడులకు బదిలీ చేశారు.
ప్రస్తుత ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్కి తోటి అల్లుడైన బోడల విశ్వనాథం, ఐదుగురు అన్నదమ్ములు ఎమ్మెల్యే సహకారంతో అసలు పట్టా భూమి 25 ఎకరాల 91 సెంట్లు మాత్రమేకాగా, 50 ఎకరాల 67 సెంట్లకు నకిలీ పత్రాలు సృష్టించారు. ఆ భూమిని తమ పేరిట రెండుసార్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందుకు గాను ఎమ్మెల్యేకు 25 సెంట్ల భూమిని బహుమతిగా అందజేశారు.
పత్రాలన్నీ తమ ఆస్తిగా ఉన్నా, భూమి తమదేనని ఎమ్మెల్యే మనుషులు బుకాయిస్తున్నారని భూమి వాస్తవదారు దంతులూరి సూర్యనారాయణ కుమారులు, కొనుగోలుదారుడు సుంకర పైడన్న యువనేత లోకేష్ కు తెలిపారు. లోకేష్ స్పందిస్తూ రాష్ట్రంలో వైసిపి నేతలు భూకబ్జాదారులుగా మారిపోయారు,
టిడిపి-జనసేన ప్రభుత్వం వచ్చాక వైసిపి నేతల భూఆక్రమణలపై సిట్ వేసి, ఆక్రమించిన భూములను సొంతదారులకు అప్పగిస్తామని తెలిపారు. ఆక్రమిత భూముల్లో ప్రభుత్వ భూములు ఉంటే ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పారు.