షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండో సోలార్ పవర్ సంస్థ ముసుగులో భూదోపిడీకి సిద్ధం

-రామాయపట్నం పోర్టుకి సమీపంలోని విలువైన భూమిని కారుచౌకగా తనమనిషిద్వారా తనపరం చేసుకునేందుకు జగన్ రెడ్డి ఆరాటపడుతున్నాడు
• రూ.లక్షమూలధనంతో, 11నెలల క్రితం ప్రారంభమైన కంపెనీ రూ.33వేలకోట్లతో సోలార్ ప్యానెల్స్ నిర్మిస్తుందా?
• విజయసాయిరెడ్డి వియ్యంకుడి కొడుకు శరత్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మరోవ్యక్తి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీకోసం, పేదలకు అంగుళం భూమి కూడా లేకుండా బలవంతంగా తీసుకోవాలని చూస్తారా?
• భూసేకరణకు సంబంధించి రైతులు వేసిన కేసుని హైకోర్టు వచ్చే నెల 06వ తేదీకి వాయిదా వేసినా, ప్రభుత్వం పేదల మెడపై కత్తిపెట్టి బలవంతంగా భూములు తీసుకోవడమేంటి?
– నెల్లూరు నుంచి జూమ్ ద్వారా మీడియాతో మాట్లాడిన టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ప్రజాసమస్యలు గాలికొదిలేసిన జగన్మోహన్ రెడ్డి తన బినామీలకు, సొంతమనుషులు, వారి సంస్థలకు వేలఎకరాలు, వేలకోట్ల విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టే పనిలో నిమగ్నమయ్యాడు. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ అయిన ఇండోసోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి, నెల్లూరుజిల్లా గుడ్లూరు మండలంలో 4,827 ఎకరాలు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేశారు. చేవూరు, రావూరు, ఏలూరుపాడు, సాలిపేట గ్రామాలపరిధిలోని ఇళ్లవద్ద బయట అంగుళం స్థలంకూడా లేకుండా ఆక్రమించాలనిచూస్తున్నారు. ఇండోసోలార్ సంస్థకు భూములు కట్టబెట్టేందుకు ప్రభుత్వం నవంబర్, డిసెంబర్లో గ్రామసభలు నిర్వహిస్తే, ప్రజలు పూర్తిగా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ప్రభుత్వనిర్ణయానికి వ్యతిరేకంగా ఏకగ్రీవతీర్మానం కూడా చేశారు. మాకున్న ఎకరా, 2ఎకరాలతోపాటు, ఆఖరికి శ్మశానాల్నికూడా లాక్కుంటే తాము ఏంచేయాలని అధికారుల్ని నిలదీశారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కి గ్రామప్రజలంతా క్యూలో నిలబడి మరీ తాము భూములు ఇవ్వమని అర్జీలు ఇచ్చారు. వారంతా హైకోర్టుకి వెళితే, న్యాయస్థానం సదరు కేసుని ఫిబ్రవరి 06వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టులో కేసు నడుస్తున్నా, లెక్కచేయకుండా ప్రభుత్వం మరలా భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.

ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూమి మార్కెట్ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరం విలువ రూ.18లక్షల70వేల వరకు ఉంటే, అధికారులు రూ.21లక్షల70వేలు ఇస్తాం. ఇస్తారా..ఛస్తారా అంటున్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మీభూముల విలువ సొమ్ముని మీ అకౌంట్లలో వేస్తాం.. మీరుఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా భూములు స్వాధీనంచేసుకుంటామనడం దుర్మార్గం కాదా? అక్కడి భూమి విలువ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.25 నుంచి రూ.30లక్షలవరకు పలుకుతోంది. రాయామపట్నం పోర్టు కార్యక్రమాలు మొదలైతే, అక్కడ ఎకరా భూమి విలువ రూ.50లక్షలనుంచి రూ.కోటికి పెరుగుతుంది. ఇప్పటికే రోడ్డుపక్కన ఉన్నభూమి రూ.40, రూ.50లక్షలు పలుకుతోంది. అంతవిలువైన 4,827 ఎకరాల భూమిని, రైతుల అభ్యంతరాలు లెక్కచేయకుండా విశ్వేశ్వరరెడ్డి కంపెనీకి కట్టబెట్టడానికి ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోంది? ఫిబ్రవరి 03-2022న ఇండో సోలార్ పవర్ కంపెనీ ఏర్పాటైంది. ఆ కంపెనీలో విజయసాయిరెడ్డి వియ్యంకుడి కొడుకు శరత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, మరోకాయన డైరెక్టర్లుగా ఉన్నారు.

11నెలలక్రితం, కేవలం రూ.లక్షమూలధనంతో ఆవిర్భవించిన కంపెనీకి ఒకేసారి 4,827 ఎకరాల ప్రజలభూమి కట్టబెడతారా?
విశ్వేశ్వరరెడ్డి ఆర్థికస్తోమత ఏంటి? అతను కడపజిల్లాలో ట్రాన్స్ ఫార్మర్లు రిపేర్ చేసుకునేవ్యక్తి, అలాంటి వ్యక్తి, ఆయన కంపెనీ రూ.33వేలకోట్లతో సోలార్ ప్యానెల్ పరిశ్రమ ఏర్పాటుచేస్తుందని చెప్పడం హాస్యాస్పదం కాదా? విశ్వేశ్వరరెడ్డికి ఇప్పటికే ట్రాన్స్ ఫార్మర్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఆయనకంపెనీ సరఫరా చేసే ట్రాన్స్ ఫార్మర్లు సంవత్సరం దాటితే మొత్తం పనికిరాకుండా పోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ తో ఆగకుండా, ఇప్పుడు ఇండోసోలార్ ప్రాజెక్ట్ పేరుతో నెల్లూరులో వేలకోట్ల విలువైన భూములు కట్టబెడతారా?
అధికారం పోయేనాటికి వేలకోట్లు దోచేద్దాం.. తమవారికి దోచిపెడదామని చూస్తున్నారు. అంగుళం భూమిలేకుండా మొత్తం తీసుకుంటే, తాము ఎలా బతకాలని రోదిస్తున్న ప్రజల బాధ మీకు కనిపించడంలేదా? నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో 25ఏళ్లక్రితం కిసాన్ ఎస్ఈజెడ్ (SEZ) పేరుతో 2,500 ఎకరాలు సేకరించారు. కృష్ణపట్నంలో రిలయన్స్ సంస్థకోసం సేకరించిన 2,500ఎకరాలు కూడా బీడుపడ్డాయి. కృష్ణపట్నం ఎస్ఈజెడ్ (SEZ)లో 4వేల ఎకరాలభూమి ఖాళీగానే ఉంది. ఈ భూముల కేటాయింపు మొత్తం కాంగ్రెస్ హయాంలో జరిగిందే. కిసాన్ ఎస్ఈజెడ్ కు భూములిచ్చిన రైతులు పాతికేళ్లుగా వేదన అనుభవిస్తున్నారు. కళ్లముందే తమభూములు బీడుపడి, పరిశ్రమలురాక, వాటిని సాగుచేయలేక విలపిస్తున్నారు. ఈ ప్రభుత్వం అసలు ఏం చేయాలనుకుంటోంది? గ్రామాల్లోని భూములన్నీ రైతుల చేతిలో లేకుండా, పారిశ్రామికవేత్తల పరంచేయాలని చూస్తున్నారా?కంపెనీల బ్యాక్ గ్రౌండ్ చూడకుండా ఇష్టానుసారం భూకేటాయింపులు చేయడమేంటి? కావలికి 10కిలోమీటర్ల దూరంలోని మోచెర్ల గ్రామంలో ఎకరం భూమివిలువ రూ.15కోట్లు.

కోట్లరూపాయల విలువైన భూమిని ఎకరం రూ.21 లక్షలకు ఎలా తీసుకుంటారు? ఇళ్లు కట్టుకోవడానికి కూడా అంగుళంభూమి లేకుండా చేస్తారా?భూసేకరణకోసం ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించలేదు. ప్రజాభిప్రాయసేకరణ జరగలేదు. సోషల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్, ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ జరగలేదు. ఇవేవీ చేయకుండా భూములు సేకరించడం నియంత్రత్వపాలన కాదా? జీవోనెం-01 చూస్తున్నాం. ప్రతిపక్షాలు, ప్రజలు రోడ్లపైకి రాకూడదా?టీడీపీఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజుని రాత్రినుంచి ఉదయానికి నాలుగుపోలీస్ స్టేషన్లు మార్చారు.ఇవన్నీ చేసేబదులు రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలేదు…తానుచెప్పిందే శాసనం అని ముఖ్యమంత్రి ప్రకటించవచ్చు కదారామాయపట్నం పోర్టుకు సమీపంలో ఉన్నందునే ఇండోసోలార్ ప్రాజెక్ట్ సంస్థకు ప్రభుత్వం 4,827 ఎకరాలు దోచిపెడుతోంది. సోలార్ ప్యానెల్స్ తయారీకోసం కాదు. ఇది ముమ్మాటికీ వేలకోట్ల కుంభకోణం. ప్రజాస్వామ్యం బతికుందని గుర్తుంచుకోండి. రైతులకు అండగా నిలిచి ప్రభుత్వంతో తాడేపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము.

Leave a Reply