Suryaa.co.in

Devotional

శివతత్వం

శివశంకరన్ కంచి మఠానికి చాలాకాలంగా పెద్ద భక్తుడు. ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి మఠానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు అతనితో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. అతను దాన్ని తనకు జరిగిన అవమానంగా తలచాడు. వెంటనే స్వామి వద్దకు వెళ్ళి ఆ సేవకునిపై చాడిలు చెప్పాలని అతనికి లేదు. అతనికి ఒకసారి స్వామివారితో మాట్లాడే అవకాశం దొరికింది.

ఏదో సందర్భానుసారంగా మాట్లాడుతూ పరోక్షంగా తన గుండెల్లో ఉన్న బరువు దింపుకోవడానికి, అరటిపండులోకి సూదిని గుచ్చినట్లుగా, “మఠం పరిచారకులు కొంతమంది చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇతరులతో డబ్బు పుచ్చుకుంటున్నారు. పరమాచార్య స్వామివారు వీళ్ళతో ఎలా వేగుతున్నారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది” అని అన్నాడు. మహాస్వామి వారు గట్టిగా నవ్వారు. “నువ్వు చెప్తున్నది నాకేమి కొత్తది కాదు” అన్నట్టుగా చూసి, మాట్లాడడం మొదలుపెట్టారు.

”వేలమంది పనిచేసే ఒక కర్మాగారం తీసుకుందాం. అందరూ నైపుణ్యం కలవారు మంచివారు కాదు కదా? ఎన్నో లక్షల మంది పభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. అందరూ ఒకేరకమైన నిబద్ధతతో పని చెయ్యరు. చాలా మంది అసలు పని కూడా చెయ్యరు. పని చేసినా అది సరిగ్గా చెయ్యరు, అసంపూర్ణంగా చేస్తారు. కాని వాళ్ళను ఇంటికి పంపించలేము. మొత్తంగా ప్రభుత్వం పనిచేస్తోంది కదా అది ముఖ్యం. ఇది సరిగ్గా పనిచేస్తుంటే చాలు. ఇది మాత్రమే సాధ్యపడుతుంది. శ్రీమఠం ఒక పెద్ద సామ్రాజ్యం లాంటిది. చాలా రకములైన పరిచారకులు ఉంటారు ఇక్కడ. నీకు పరమేశ్వరుడు తెలుసా?” అని అడిగారు.

శివశంకరన్ కు శ్రీమఠంలో ఆ పెరుగలవారు ఐదారుగురు తెలుసు. ఎవరి గురించి మహాస్వామి వారు అడుగుతున్నారో అతనికి అర్థం కాలేదు. అతని అవస్థ చూసి స్వామివారు ”నేను చెప్తున్నది కైలాసవాసి అయిన పరమేశ్వరుని గురించి. అతని కంఠంలో పాము ఉంటుంది. ఒక చేతిలో అగ్ని ఉంటుంది. కాళ్ళకింద దురాశకు ప్రతిరూపమైన ఒక దేవతని తన ఆధీనంలో తొక్కి ఉంచుతాడు. భూతములు, దెయ్యాలు అతని గణాలు. వీటన్నిటిని వెంటబెట్టుకుని నృత్యం చేస్తుంటాడు విశ్వమంతా తిరుగుతూ.

పామును కనక వదిలేస్తే అది స్వేచ్ఛగా తిరిగి అందరిని భయపెట్టి కాటేస్తుంది. అగ్నిని నియంత్రించక పోతే, అది స్థావర జంగమాలను దహించివేస్తుంది. భూతపిశాచ గణములను వదిలేస్తే ఎవర్ని పడీతే వారిపై దాడి చేస్తాయి. అవి చేసే ఘోరాలను చెప్పవలసిన పని లేదు. ఇటువంటి చెడ్డ శక్తులను తన వద్ద ఉంచుకోవడమే పరమేశ్వరుని గొప్పతనం” అని చెప్పారు.

శివశంకరన్ ఇదంతా విని నిర్ఘాంతపోయి మౌనంగా నిలుచున్నాడు. మహాస్వామి వారు అతణ్ణి మృదువచనాలతో సంతృప్తి పరుస్తారు అనుకున్నాడు. కాని స్వామి వారి మాటలు ప్రపంచ రీతులని బట్టబయలు చేసారు. ఇది శివశంకరన్ కు మాత్రమే కాదు. భక్తులందరికి శుద్దమైన ఆలోచనలు కలిగిస్తుంది. ఉన్నత స్థితిని కలిగిస్తుంది.

!! యద్భావం తద్భవతి !!
— శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ – దరిశన అనుభవంగళ్

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

(కంచిపరమాచార్యవైభవం)

LEAVE A RESPONSE