స్వగ్రామం నుంచే సాఫ్ట్ వేర్ ఉద్యోగం

ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి
– ఐ.టీ, నైపుణ్యం, ఫైబర్ నెట్ ఉన్నతాధికారులతో “వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల” ఏర్పాటుకు టాస్క్ ఫోర్స్
-టాస్క్ ఫోర్స్ లో ఏపీ ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్ మెంట్, ఏపీటీఎస్ ఎండీలు, ఐ.టీ సలహాదారులు, ఉన్నత విద్య మండలి ఛైర్మన్ హేమచంద్ర
– కన్నవారితో..ఉన్న ఊరిలోనే ఐ.టీ ఉద్యోగం..ఇదే ప్రభుత్వ లక్ష్యమన్న ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
– 10 రోజుల్లోగా ‘వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల నమూనా’ రూపకల్పనకు మంత్రి ఆదేశం
– మానవవనరులను మన రాష్ట్రానికి వెనక్కి రప్పించాలన్నదే ధ్యేయం: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి: రాష్ట్రంలో “వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల” ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 10 లక్షల మంది ఐ.టి ఉద్యోగులు ఉన్నారు. వారికి స్వగ్రామంలో పనిచేసుకునే విధంగా అన్ని ఏర్పాటు చేసి ఎక్కువ మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులను స్వగ్రామాలలో కన్నవారితో ఉంటూ ఉద్యోగం చేసుకునేలా వర్క్ ఇన్ హోమ్ టౌన్లకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల ఏర్పాటుకు కావలసినసిన సదుపాయాలు, అవసరాలు, నమూనా రూపకల్పన కోసం ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఐటీ, నైపుణ్య, శిక్షణ ఫైబర్ నెట్ ఉన్నతాధికారులతో ‘టాస్క్ ఫోర్స్ కమిటీని’ ఏర్పాటు చేశారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఐ.టీ, నైపుణ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఏలూరు ఎంపీ శ్రీధర్ సమక్షంలో సమావేశం జరిగింది.
ఎక్కడెక్కడో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు..సొంత ఊళ్లలోనే నిశ్చింతగా పని చేసుకునే విధంగా చేపట్టాల్సిన చర్యలను ప్రభుత్వం ప్రారంభించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ మూడోవారంలోగా బిజినెస్ సెంటర్ల ఏర్పాటులో కీలకమైన మోడళ్లను తయారు చేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీని మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమ చంద్ర, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఐ.టీ శాఖ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి తదితర 6 మంది ఉన్నతాధికారులతో టాస్క్ ఫోర్స్ లతో కూడిన సభ్యులను టాస్క్ ఫోర్స్ కమిటీగా ఏర్పాటు చేశారు.
సాధ్యమైనంత వేగంగా వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించాలని, అందుకు అవసరమైన ఇంటర్ నెట్, విద్యుత్ వంటి మౌలిక వసతుల వ్యయాల అంచనాలను రూపొందించాలన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలలోని ఐ.టీ ల్యాబ్ ల జాబితా సహా సాఫ్ట్వేర్ ఉద్యోగం స్వగ్రామంలోనే చేసుకునే వీలుగా ఉండే ప్రాంతాలను చూసి అనుకూలమైనవాటిని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. వాటికి అవసరమైన ప్రోత్సహకాల విషయంపైనా సమీక్షించాలన్నారు. వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల నమూనా కోసం బెంగళూరు హైదరాబాద్ పెద్ద ప్రాంతాలలోని సదుపాయాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఇప్పటికే వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల ఏర్పాటుకు కావలసిన సకల వసతులు ఉన్న 100 సెంటర్లు సిద్ధంగా ఉన్నట్లు నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకు వచ్చింది. వెంటనే వాటిని పరిగణలోకి తీసుకొనేందుకు మంత్రి ఆమోదం తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ శ్రీధర్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి, నైపుణ్యాభివద్ధి శిక్షణ శాఖ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి, ఐ.టీ, నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రా, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్, ఐ.టీ శాఖ సలహాదారులు శ్రీనాథ్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply