Suryaa.co.in

Devotional

శ్రీ ఆంజనేయ మహాత్మ్యం

బ్రహ్మ దేవుని చరిత్రం
శ్రీ హనుమానుడు సువర్చలా దేవితో గంధ మాదన పర్వతం మీద సుఖంగా వున్నాడు .శ్రీ రామ మంత్రాన్ని సర్వదా జపిస్తూ ,శ్రీ రామ నామ పానాన్ని అనుభవ సిస్తున్నాడు .అయినా ఒక రోజూ ఆయనకు శ్రీ రామ దర్శనం చేయాలనే కోరిక కలిగింది .అంతే వెంటనే బయల్దేరి గంధ మాదనం నుంచి బయల్దేరి అయోధ్యకు చేరాడు .శ్రీ రాముని సందర్శించి భక్తీ ,వినయంతో నమస్కరించి స్తుతి చేసి ,ఆయన మనస్సును గెలిచాడు .అప్పుడు సీతా రాముడు హనుమను గాదంగా ఆలింగనం చేసుకొన్నాడు .శిరస్సును మూడు సార్లు ముద్దు పెట్టుకొన్నాడు .హనుమ క్షేమ సమాచారాలను అడిగి తెలుసు కొన్నాడు. ఆంజనేయుడు ”రామా !నువ్వు వుండగా ,కులాసా కు ఏమి కొదవ?నీ పై భక్తీ వున్న వాళ్ళందరికీ క్షేమమే నన్ను ఆలింగనం చేసుకొని  నాకు  పరమానందాన్ని కలిగించావు .నాకు ఉక్కిరి బిక్కిరి గా వుంది .మాట రావటం లేదు ”అన్నాడు .

హనుమ మాటలకు రాఘవుడు సంతోషించి ”హనుమా !సీతా దేవి లంకాలో వున్న కాలంలో చాలా కస్టాలు అనుభవించింది .రావణ సంహారం తర్వాత ,అయోధ్యలో ఉంటున్నా ఆమె ఎందుకో సంతోషంగా కనిపించటం లేదు ..నా వ్రేలి ఉంగరాన్ని కావాలని బ్రహ్మ కోరగా ,ఆయనకు ఎవరికి తెలియకుండా ఇచ్చాను .ఆ ముద్రికను చూస్తె కాని జానకి సంతోషించదు .నువ్వు బ్రహ్మ లోకానికి వెళ్లి బ్రహాను అడిగి ఆ ముద్రికను తీసుకొని రావాలి ”అన్నాడు …

అతి వేగంగా హనుమ బ్రహ్మను చేరి ,సనకసనందనాదులు స్వాగతం చెప్పగా ,బ్రహ్మ దగ్గరకు తీసుకొని వెళ్ళారు .ఆయన అర్ఘ్య ,పాద్యాదులు ఇచ్చి ,కుశల ప్రశ్నలు వేసి ,ఉచిత ఆసనం పై కూర్చో పెట్టాడు. షోడశోప చారాలు చేసి పూజించాడు .హనుమను వచ్చిన కారణం   అడిగాడు బ్రహ్మ ..హనుమ శ్రీరాముని ఆజ్న ను తెలియ జేశాడు .దానికి బ్రహ్మ దేవుడు ”నా ప్రార్ధన విని శ్రీ రాముడు నాకు ఆ ముద్రికను ప్రసాదించాడు .రోజూ నేను దాన్ని పూజిస్తూ,శ్రీ రాముడిని ధ్యానం చేస్తున్నాను .దాన్ని యెట్లా ఇవ్వమంటావు?” అన్నాడు .దానికి హనుమ ”సృష్టి కర్తా !నా మాట విను .ఆ ఉంగరం మీదే సీతా సాధ్వి ద్రుష్టి నిలిపి వుంది .రోజూ రోజుకు కృశించి పోతోంది .ఆమె ముఖంలో సంతోషం చూసి చాలా కాలమైంది. వెంటనే తీసుకొని రమ్మని శ్రీ రామాజ్న ”అని తెలిపాడు .అయినా చతుర్ముఖ బ్రహ్మలో మార్పేమీ రాలేదు.

ఇప్పటి వరకు ఎంతో శాంతంగా వున్న హనుమ ఒక్క సారిగా తన తనువును విపరీతంగా పెంచాడు.సత్య లోకం దాటి శరీరం పెరిగి పోయింది .దశ దిశలా ఆక్రమించాడు .బ్రహ్మాండాన్ని బద్దలు చేసేట్లు తయారయ్యాడు .ఆ తేజస్సుకు లోకాలు భస్మం అయేట్లున్నాయి.ప్రళయ కాల మేఘంలాగా విజృంభించాడు. ఇరవై చేతులతో ,ఇరవై ఖడ్గాలను ధరించి ,భయంకరమైన ముఖంతో ,తీక్ష్ణ మైన కోరలతో ,మహా సింహం లాంటి విశ్వరూపాన్ని ధరించి ,ప్రళయ కాల గర్జన చేశాడు.బ్రహ్మ, మిగిలిన దేవతలు,మహర్షులు ఆశ్చర్యంతో భయపడి పోయారు. అందరు భక్తీ తో రామ నామం జపించారు .సనకస నందనులు బ్రహ్మతో రాముని ఉంగరం వెంటనే ఇచ్చేసి ఈ సంక్షోభాన్ని నివారించమని హితవు చెప్పారు .

అప్పుడు బ్రహ్మ హనుమంతుని భక్తిగా స్తుతించాడు .హనుమంతుని విశ్వ రూపాన్ని చూసి విభ్రమం పొందాడు బ్రహ్మ ..బ్రహ్మ ప్రార్ధన విని ,హనుమ తన రూపాన్ని ఉప సంహరించాడు .అప్పుడు బ్రహ్మ ”హనుమా !అదిగో సరస్సు .దానిలో అనేక రామ ముద్రికలున్నాయి .అంతకు పూర్వం వున్న ,అనంత కల్పాలు ,అందులో రామావతారాలు ,కనిపిస్తాయి ..ఆయా అవతారాలలో బ్రహ్మకు ఇచ్చిన రామ ముద్రికలన్నీ కనిపిస్తాయి  .వాటిలో ఏది శ్రీ రాముని ముద్రిక యో పరీక్షించి తీసుకో ”అన్నాడు.

హనుమ సంతోషంలో ఆ సరస్సులో మునిగాడు .రామ ముద్రికలు అనేకం కనిపించాయి.ఏమీ పాలుపోలేదు. వెంటనే భక్తీ గా వాటి చుట్టూ ప్రదక్షిణం చేశాడు .భౌతిక ,ఆధ్యాత్మిక తాపాలన్నీ తొలగిపోయేట్లుగా ఆ సరస్సులో స్నానం చేశాడు .ఆనందించాడు .బ్రహ్మకు నమస్కరించి ,సీతా రామ సన్నిధికి చేరాడు .ఆనందామృత సరస్సులో మునుక లేసి వచ్చిన ఆంజనేయుడిని శ్రీరాముడు సాదరంగా స్వాగతించి ‘హనుమా !నువ్వు తెచ్చిన ఆ ముద్రికను ఇవ్వు .దాన్ని సీతకు ఇచ్చి సంతోషం కలిగిస్తాను.’అన్నాడు .ఆంజనేయుడు జంకుతూ వెనుక అడుగు వేస్తున్నాడు .భక్తుని అవస్థను భగవంతుడు గ్రహించాడు .”హనుమా !భక్త శేఖరా !ఎందుకు భయం?నీకు నాకు భేదం లేదు కదా.భయం వదిలి పెట్టి బ్రహ్మ లోకంలో నువ్వు చూసిన వింతలు తెలియజెయ్యి ”అన్నాడు చాలా ప్రేమగా .

రాముని మాటలకు ధైర్యం తెచ్చుకున్న హనుమ ”భగవాన్ ! నీకు నమస్కారం .సత్య లోకంలో చతుర్ముఖ బ్రహ్మ భార్య సరస్వతీ దేవితో ఆనందంగా వున్నారు.అక్కడ  బ్రహ్మర్షులు ,వేదాంతులు ,జిత క్రోదులు వున్నారు .వారి భాగ్యమే భాగ్యం .అక్కడ అమృత సరస్సు వుంది .అక్కడ నీ ముద్రికలు అనేకంగా కన్పించాయి .వాటిని చూసి నమస్కరించి వచ్చేశాను .బ్రహ్మ ముద్రికను ఇవ్వలేను అన్నాడు .నాకు కోపం వచ్చి నా విశ్వ రూపం చూపించాను .ఆ సరస్సులో ఏ ముద్రిక నీదో తెలియలేదు .అందుకే వట్టి చేతులతో తిరిగి వచ్చాను .”అని వివరించాడు .

శ్రీ రాముడు హనుమను చేరబిలిచి ”హనుమా ! నీ సత్య వ్రతం ,సత్య భాషణంలకు మెచ్చాను .నీ మీద ప్రసన్న భావం ఏర్పడింది .వరం కోరుకో ఇస్తాను .ఇది వరకు ఎన్నో అవతారాలు ఎత్తాను .కార్య నిర్వహణం కోసం ఈ అవతారం ఎత్తాను .బ్రహ్మ నాకు భక్తుడు .అందుకని ప్రతి అవతారంలోను ,నా ప్రతినిధిగా ఉండటానికి బ్రహ్మకు నా ముద్రికను ఇస్తుంటాను .దానిని నిశ్చల భక్తితో పూజిస్తూ సృష్టి కార్యం చేస్తుంటాడు .జానకీ దేవికి నీ మీద పుత్ర వాత్సల్యంతో వుంది .మళ్ళీ వెళ్లి అమృత సరస్సులోని ముద్రికను ఒక దాన్ని తెచ్చి మీ అమ్మ గారికి ఇవ్వు .”అని చెప్పాడు .

హనుమ వెంటనే బ్రహ్మ లోకం చేరి అంగుళీయకాన్ని తీసుకొని వాణీ విభుడికి కృతజ్ఞతా పూర్వక నమస్కారం చేసి శ్రీరాముని దగ్గరకు వచ్చాడు.శ్రీ రాముడు హనుమను దగ్గరకు తీసుకొని ”హనుమా !బ్రహ్మ లోకాన్ని చూసి ఆనందించావు .అందువల్ల రాబోయే యుగాలకు నువ్వు బ్రహ్మగా వుండే వరం ఇస్తున్నాను. నువ్వు నన్ను పూజించి ,సేవించి ,ఆనందం చేకూర్చావు .నేను ,సీతాదేవి నీ యందు సదా వాత్సల్యంతో ఉంటాము.నువ్వు లోకాలను సృజిస్తూ ,జగత్తుకు మంగళాన్ని కలిగిస్తూ శోభిల్ల గలవు”అని ఆశీర్వదించాడు. రామాజ్న పొంది ,సెలవు తీసుకొని మళ్ళీ  గంధ మాదనం చేరి రామ మంత్ర జపంతో తరిస్తూ జీవించాడు.

ఇప్పుడు బ్రహ్మ చేసిన హనుమ స్తుతిని వినండి
”ఉస్త్రారూధ సువర్చలాసహచర ,సుగ్రీవ మిత్రామ్జనా –సూనో ,వాయు కుమార ,కేసరి తనూజా ,అక్షాది దైత్య సంహారా
సీతా శోక హరా ,అగ్ని నందన ,సుమిత్రా సంహవ ,ప్రాణదా –శ్రీ బీమాగ్రాజ శంభు పుత్ర ,హనుమాన్ ,పంచాష్య తుభ్యం నమః ”
”ఖడ్గం ,ఖేటక ,భిండి వాల ,పరశుం ,పాశం ,త్రిశూలం ,ద్రుమాన్
చక్రం ,శంఖ ,గదా ,ఫలం ,కుశ ,సుధా కుమ్భాన్ హలం ,పర్వతం
టంకం ,పుస్తక ,కార్ముక అహి ,డమరుం ,నేతాణి ,దివ్యాయుదా
న్యేవం ,వింశతి ,బాహుభి శ్చ  దధతం ,ధ్యాయే హనుమత్ప్రభుం  ”

LEAVE A RESPONSE