-గజ్వేల్ అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి
-కల్లబొల్లి మాటలతో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నావ్
-ఓటు అడిగే నైతిక విలువ ఉందా?
-రైతు రుణమాఫీ, 4 వేల పెన్షన్, తులం బంగారం,
-నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు రూ.2,500 ఏమయ్యాయి?
-బీజేపీ చెప్పింతే వింటే జోడీ..లేకుంటే ఈడీనే
-పదేళ్లలో ప్రజలకు చేసింది శూన్యం
-దుబ్బాకలో పనికిరాని రఘునందన్…మెదక్లో పనికొస్తాడా?
-మెదక్ పార్లమెంట్లో వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి
-గజ్వేల్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్రావు
గజ్వేల్ అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యక ర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మూడు సార్లు ఈ గడ్డ నుంచి కేసీఆర్ను గెలిపించిన కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదన్నారు.
సమస్యలపై, పరిపాలనపై పట్టున్న వ్యక్తి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దుబ్బాకలో పనికి రాని రఘునందన్ ఇప్పుడు మెదక్ పార్లమెంట్కు పనికి వస్తాడా? అని ప్రశ్నించారు. రూ.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి మన పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిన మంచి మనసున్న మనిషి మన వెంకట్రామిరెడ్డి. ఎంతో మంది అనాథ బిడ్డల్ని అక్కున చేర్చుకున్న గొప్ప వ్యక్తి…కలెక్టర్గా తన పాలన మార్కుతో ఎన్నో అవార్డులను ఈ గడ్డకు తెచ్చిన వ్యక్తి అని పేర్కొన్నారు. గజ్వేల్ గడ్డ మీద ఈర్ష్య పెట్టుకున్న ఈ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటు ఎందుకు వేయాలి?
గజ్వేల్ నియోజకవర్గ బిడ్డల నోట్లో మట్టి కొట్టిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు ఉందా? అని ఘాటుగా ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. 100 రోజుల కాంగ్రెస్ పార్టీ బాండ్ పేపర్ పాలనలో ఉద్దరించుడు మాట దేవుడెరుగు కానీ, అన్నీ ఉద్దెర మాటలే చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2 లక్షల రుణమాఫీ అయితే కాంగ్రెస్కు ఓటేయండి.. కాకపోతే కారుకు వేయుండ్రి అని పిలుపునిచ్చారు. యాసంగి వడ్లకు, మక్కలకు 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని మనం ప్రతి ఊర్లో పంచాయితీ పెట్టాలి.
మన అక్కలకు, చెల్లెలకు ప్రతి నెలా రూ.2,500 డిసెంబర్ నెల నుంచి ఇస్తా అన్న మొట్ట మొదటి హామీని అమలు చేయకుండా మహా మోసం చేసిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. రూ.200 ఉన్న పెన్షన్ను 2000 చేసిన ఘనత మన కేసీఆర్ది అయితే రూ.4000 ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ఇయ్యని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. తులం బంగారం, నిరుద్యోగ భృతి ఇస్తామని కల్లబొల్లి మాయ మాటలు, పచ్చి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకుందన్నారు. పేగులు మెడలో వేసుకోవడం కాదు రేవంత్ రెడ్డి… పేదలకు భరోసా ఇవ్వు. మనిషివి అయితే పంట నష్టపోయిన రైతులను, ఆటో డ్రైవర్ సోదరులను ఓదార్చు. పార్టీ గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు తెరువు. మల్లన్న సాగర్ గేట్లు తెరిచి మా కూడవెల్లి వాగుకు నీళ్లు ఇస్తే మా గజ్వేల్, దుబ్బాక రైతులు పంటలు పండిరచుకుంటరు. మన ప్రభుత్వంలో 15 రోజులకు ఒకసారి కో-ఆపరేటివ్ డైరీ ఫామ్ రైతులకు బిల్లులు వస్తుండే. కానీ, నేడు మూడు నెలలు దాటిపోయినా బిల్లులు లేవు. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, భవిష్యత్ మనదే అని భరోసా ఇచ్చారు.
బీజేపీ చెప్పింది వింటే జోడీ…లేకపోతే ఈడీ
పదేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి చేసింది శూన్యమని విమర్శించారు. 2 కోట్ల ఉద్యోగాల హామీ పేరుతో దేశంలోని నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ బీజేపీ అని హరీష్రావు దుయ్యబట్టారు. పదేళ్లలో పెట్రోల్, డీజిల్, సిలిండర్ రెండిరతలు చేసి ఎన్నికల ముందు రెండు రూపాయలు తగ్గించింది…కానీ, ఈ పదేళ్లు తెలంగాణ రైతుల కోసం అహర్నిశలు పాటుపడి కాళేశ్వరం కట్టి రైతులకు నీళ్లు అందించిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. ఈ 100 రోజుల పాలనను రేపు ఎన్నికల రెఫరెండంగా చూపించి కాంగ్రెస్ మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. దానికి ఓటు వేస్తే మోసపోతాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ, 4,000 పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారు అంటారు. కాబట్టి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి. గజ్వేల్ అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించా లని విజ్ఞప్తి చేశారు.