Suryaa.co.in

Andhra Pradesh

ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలన్నదే మూడుపార్టీల అజెండా

-రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సాయం అవసరం
-రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీల పొత్తు
-రాజధాని, పోలవరం కట్టొద్దని జగన్ కు కేంద్రం చెప్పిందా.?
-విభజన హామీలు సాధించడంలో జగన్ పూర్తిగా వైఫల్యం
-కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ ఉన్న ప్రతిసారీ రాష్ట్రానికి మేలు
-కలలకు రెక్కలు ద్వారా ప్రభుత్వం నుండి విద్యార్థినుల చదువుకు వడ్డీలేని రుణసాయం
-టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
– చంద్రబాబు సమక్షంలో కలలకు రెక్కలు వెబ్ సైట్ లో తమ పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థినులు

అమరావతి : ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలి అనేదే టీడీపీ, జనసేన, బీజేపీల అజెండా అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జగన్ రెడ్డి విధ్వంస పాలనతో నష్టపోయిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సాయం అవసరం అని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేస్తున్నాయన్నారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కలలకు రెక్కలు అనే కార్యక్రమానికి నారా భువనేశ్వరి శ్రీకారం చుట్టారు.

బుధవారం ఉండవల్లిలో విద్యార్థినులతో కలిసి kalalakurekkalu.com సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ను అధికారికంగా చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలో జగన్ విధ్వంసం సృష్టించారు. దీంతో 30 ఏళ్లు రాష్ట్రం వెనక్కివెళ్లిపోయింది. దీన్ని పునర్నిర్మించాలంటే కేంద్రం సాయం అవసరం. విధ్వంసాలు చేసేవాళ్లు రాజకీయాలకు అనర్హులు. అన్ని రంగాల వారు రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారు.

నేను వేసిన పునాదికి నా తర్వాత వచ్చిన వారు అడ్డకుట్ట వేసి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి అయ్యేది కాదు. అమరావతి నిర్మించి, పోలవరం పూర్తి చేసి ఉంటే నేడు మనం మంచి స్థితిలో ఉండేవాళ్లం. మనం భూములు కేటాయించడం వల్ల అమరావతిలో అంతర్జాతీయ విద్యా సంస్థలైన విట్, ఎస్ఆర్ఎం, అమృత్ యూనివర్సిటీలు వచ్చాయి. ప్రజలు గెలవాలంటే వైసీపీ పోవాల్సిందే. చిలకలూరిపేట నుండి మంత్రి రజినీని ట్రాన్స్ ఫర్ చేశారు. మల్లెల రాజేశ్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు. అతని దగ్గర మంత్రి రజినీ 6.5 కోట్లు డబ్బులు తీసుకున్నారు. దానికి సజ్జల బ్రోకరిజం చేశాడు. మళ్లీ అతన్ని మార్చి కావటి మనోహర్ ను పంపాడు. దీంతో నా డబ్బుల కథ ఏంటని రాజేష్ నాయుడు అడుగుతున్నాడు. ఇలాంటి రాజకీయాలు ఊహించారా.?

విభజన కంటే జగన్ తోనే ఎక్కువ నష్టం
తక్కువ సీట్లు తీసుకున్నారని జనసేనను రెచ్చగొడుతున్నారు. పెద్దపార్టీ తక్కువ సీట్లు ఎలా తీసుకున్నారని బీజేపీని అంటున్నారు. వైసీపీ విముక్త రాష్ట్రం కోసం పని చేయడానికే మేం పొత్తు పెట్టుకుంటున్నాం. ప్రజాహితం కోసం, భవిష్యత్ తరాల కోసం మేం రాజీపడ్డాం. రాష్ట్రంలో నూతన ఒరవడిని పొత్తు సృష్టించబోతోంది. ప్రభుత్వ మార్పు అనివార్యం. గతంలో ఇక్కడ ఎకరా అమ్మితే హైదరాబాద్ లో 5 ఎకరాలు కొనవచ్చు. కానీ ఇప్పడు అక్కడ ఎకరా అమ్మితే ఇక్కడ వంద ఎకరాలు కొనవచ్చు.

ఈ ప్రభుత్వం హింస, దాడులు, హత్యలు, దొంగ ఓట్లు రాజకీయం చేస్తోంది. యువత భవిష్యత్ అంధకారం కాకుండా ఉండాలంటే యువత్ రోడ్లపైకి రావాలి. చట్టాలు చేయాల్సిన వాల్లే తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు. కొండలు తవ్వుతునారు…పర్యావరణం పాడైతే మంచి గాలి ఎలా వస్తుందా.? పబ్లిక్, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం ద్వారా పేదరిక నిర్మూలన చేస్తే దేశానికి శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే కేంద్ర సహకారం, రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం అవసరం.

సొంత పత్రిక లేదంటాడు…నిత్యం విషపు రాతలు రాయిస్తాడు
తనకు సొంత పత్రిక లేదు అని జగన్ అంటాడు..ప్రతి రోజూ సాక్షి పత్రికలో అబద్ధాలే రాయిస్తాడు. రాష్ట్ర విభజన కంటే జగన్ వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. అమరావతిని విధ్వంసం చేశారు. పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు…నిధులు సద్వినియోగం చేసుకోలేదు. అడిగిన వారిని ఇష్టానుసారంగా బూతులు తిడుతున్నారు. కేసులు పెడతారు, భయపెడతారు, మాకెందుకు అని నిస్సాహయాతతో ఉంటే రాష్ట్రాన్ని కాపాడుకోలేరు.

సిద్ధం సభలకు బస్సులు పెడుతూ వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. పొత్తులో భాగంగా సీట్లు కేటాయించడంతో పార్టీలో కొంతమంది కష్టపడినవాళ్లకు సీట్లు రాలేదు…కానీ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉంటాం…మరిన్ని అవకాశాలు వస్తాయి. ఎన్డీయేతో పొత్తు కొత్తగా పెట్టుకున్నది కాదు. నాడు వాజ్ పేజ్ ఉన్నప్పుడు ఒక్క మంత్రి పదవి కూడా తీసుకోకుండా మద్ధతు తెలిపాం. 2014-2019లో పొత్తు పెట్టుకున్నాం…నాడు మేం తెచ్చిన సంస్థలు తప్ప ఈ ప్రభుత్వ ఏమీ తీసుకురాలేదు. రాజధానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చింది…ఇంకా కావాలని అడిగాం.

ప్రత్యేకహోదా విషయంలో పట్టుబట్టాను..కానీ ప్యాకేజీ ఇచ్చారు. వెనకబడ్డ జిల్లాలకు రూ.350 కోట్లు సాధించాం..కానీ వైసీపీ ప్రభుత్వం నిధులు తెచ్చిందా.? నాడు హోదా విషయంలో తప్ప మాకు బీజేపీతో అభిప్రాయ బేధాలు లేవు. రైల్వే జోన్ కు ఈ ప్రభుత్వం భూములు ఇవ్వలేదు. కేసుల కోసం తిరిగి వాళ్లు లాభపడ్డారు. ప్రజాహితం, రాష్ట్ర భవిష్యత్ కోసమే నేను పనిచేస్తా. గాడి తప్పిన పాలను గాడిన పెడతాం.

2047 నాటికి వికసిత్ భారత్
1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆ సంస్కరణలు దేశానికి శ్రీరామరక్షగా మారాయి. ఈ సంస్కరణల వల్లే మన దేశాన్ని ప్రపంచం గుర్తించింది. నేను సీఎం అయిన కొత్తలో ఎప్పుడు కరెంట్ పోతుందో…వస్తుందో తెలీదు. ఎండాకాలం వస్తే రైతులు వచ్చి హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద ధర్నాలు చేసేవాళ్లు. అందుకే 1999లో రెగ్యులేటరీ కమిషన్ తెచ్చి సంస్కరణలకు నాంది పలికాం. ఇప్పటికీ మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. 2047 నాటికి వికసిత్ భారత్ అవుతుంది. భారతీయులు ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంటారు. దీనికి కారణం మనం తీసుకునే ఆర్థిక సంస్కరణలే. ఎక్కువ యువత మన దేశంలో ఉంది. మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లో యువత తక్కువగా ఉంది. సర్వీస్ సెక్టార్ లో మనకు తిరుగు ఉండదు. విదేశాల్లోనూ మనవాళ్లు పబ్లిక్ గవర్నెన్స్ లో ఆధిపత్యం చెలాయిస్తారు.

కలలకు రెక్కల ద్వారా విద్యార్థినుల చదువుకు వడ్డీలేని రుణసాయం
ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, అనుకున్నవి సాకారం చేసేందుకే కలలకు రెక్కలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మేం అధికారంలోకి వచ్చాక ఇంటర్మీడియట్ తర్వాత వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థినులకు ప్రభుత్వం దారా బ్యాంకు ఒప్పందంతో వడ్డీలేని రుణాలు. ఇప్పుడు కలలకు రెక్కలు అనే కార్యక్రమాన్ని వినూత్నంగా తీసుకొచ్చాం. కలలు కనండి..వాటిని నిజం చేసుకోండి అని అబ్డుల్ కలాం చెప్పారు. ఇంటర్ దాకా చదవుకుకుని పెద్దల ప్రోత్సాహం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో మానేస్తున్నారు. వారు వివిధ కోర్సుల్లో చేరడానికి బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు. దీనికి వడ్డీ ప్రభుత్వమే భరిస్తుంది.

ఆడపిల్లలకు చదువుపరంగా ఇప్పుడు ఏ పథకాలు అయితే ఉన్నాయో అవి కొనసాగుతాయి..ఇది కొత్తగా తీసుకొచ్చాం. మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, ఏ కోర్సులకు అయినా పథకం వర్తిస్తుంది. ఇప్పుడు పేర్లు రిజస్టర్ చేయిస్తాం…ప్రభుత్వంలోకి వచ్చాక అమలు చేస్తాం. ఇప్పటిదాకా ఇందులో 12 వేల మంది ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు. సమాజంలో అందరి భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు, సంస్కరణలు తెచ్చింది టీడీపీనే. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమానవాటా హక్కు తీసుకొచ్చారు. జనాభాలో సగమున్న మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాం.

ప్రత్యేకంగా మహిళలకు 22 కొత్త పథకాలు తీసుకొచ్చాం. విద్యకు ప్రాధాన్యమివ్వాలని ప్రతి కి.మీకి ఒక ఎలిమింటరీ స్కూల్, ప్రతి 3 కి.మీ అప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రతి 5 కి.మీ హైస్కూల్, మండలానికి ఒక జూనియర్ కాలేజీ, డివిజన్ కు ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం. ఉద్యోగాలు, కాలేజీ సీట్లలో రిజర్వేషన్లు 33 శాతం తీసుకొచ్చాం. దీంతో మహిళల జీవితాల్లో మార్పులు వచ్చాయి.

మహాశక్తి పథకాలతో మహిళల అభ్యున్నతికి కృషి
మహాశక్తిలో భాగంగా మహిళలకు 5 ప్రత్యేక పథకాలు తీసుకొచ్చాం. చదవుకునే ప్రతి బిడ్డకు యేడాదికి రూ.15 వేలు అందిస్తాం. గతంలో నా తల్లి పడుతున్న కష్టాలు చూసి సీఎం అయ్యాక దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ అందించాం. మళ్లీ రేట్లు పెరిగి గ్యాస్ కనెక్షన్లు తగ్గుతుండటంతో యేడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించాం. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. 18 నుండి 59 మధ్య వయసున్న మహిళలకు నెలకు రూ.15 వందలు అందించడబోతున్నాం. ఇది వారికి పెట్టుబడి నిధిగా ఉంటుంది.

తాగునీటికి ఇబ్బంది పడుకుండా ఇంటింటికీ మంచినీళ్లు ఇవ్వాలని తలపెట్టాం. ఈ 5 కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహిస్తే కుటుంబాలను మహిళలు పైకి తేవడానికి శక్తిని ఇస్తుంది. మీ పిల్లలకు ఎంత భూమి, ఎంత డబ్బు ఇస్తారన్నది ముఖ్యం కాదు…ఎంత మంచి చదువు చదివిస్తారన్న ముఖ్యం. టీడీపీ ఓట్లు చాలా విదేశాలకు వెళ్లిపోతున్నాయని నన్ను విమర్శించారు. పార్టీ నష్టపోయినా పర్వాలేదు..వారి జీవితాలు బాగుపడాలని ఆలోచించా.’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.

LEAVE A RESPONSE