Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ ప్రజల దిశ మార్చనున్న బొప్పూడి సభ

-ఏపీ ప్రజల దిశ మార్చనున్న బొప్పూడి సభ
-భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టిన నారా లోకేష్

-అరాచకపాలన అంతం ఖాయమన్న కూటమి నేతలు

చిలకలూరిపేట: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనకు అంతమొందించి, 5కోట్లమంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ఏకతాటిపైకి వచ్చిన తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. ఈనెల 17వతేదీన చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వేదికగా నిర్వహించే భారీ బహిరంగసభ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు దశ, దిశ నిర్దేశించబోతోంది.

నభూతో నభవిష్యత్ అనేవిధంగా బొప్పూడిలో నిర్వహించేబోయే సభా ప్రాంగణం వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం ఉదయం 9.32గంటలకు భూమిపూజ చేసి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ప్రాంగణం వద్ద పనులను యువనేత ప్రారంభించారు. పొత్తు కుదిరిన తరువాత నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2014లో కూడా మూడు పార్టీలు కలిసి గుంటూరు జిల్లా నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించి, విజయ దుందుభి మోగించాయి.

అదే సెంటిమెంట్ తో 2024లో గుంటూరు గడ్డపై నుంచి కూటమి శంఖారావం పూరించనుంది. ప్రధాని నరేంద్ర మోడీ, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరుకాబోతున్న సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో యువనేత లోకేష్ నేతృత్వాన మూడుపార్టీల ముఖ్యనేతలు వివిధ కమిటీల తో భేటీ అయ్యి సభ ఏర్పాట్ల గురించి చర్చించారు. సభా స్థలాన్ని టిడిపి, జనసేన, బీజేపి ముఖ్య నేతలతో కలిసి యువనేత లోకేష్ పరిశీలించారు. 200 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించే ఈ భారీ బహిరంగసభకు వచ్చే లక్షలాది ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా సూచించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీ నారాయణ, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, యడ్లపాటి రఘునాథ్ బాబు, వల్లూరి జయప్రకాష్, లంకా దినకర్, శ్రీమన్నారాయణ, జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, గాదె వెంకటేశ్వరరావు, షేక్ రియాజ్, టిడిపి సీనియర్ నాయకులు జివి ఆంజనేయులు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, రామరాజు, పెందుర్తి వెంకటేష్, సత్యనారాయణరాజు, మూడు పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

జగన్ సర్కారును కూకటివేళ్లతో పెకలిస్తాం: పుల్లారావు
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి జగన్ అరాచక ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి వేస్తుంది. 17వ తేదీన జరగనున్న భారీ బహిరంగ సభ కోసం యావత్ రాష్ట్ర ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ సభలో రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఇవ్వడానికి ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తారు. కేంద్రం సహకారం లేనిదే రాష్ట్ర అభివృద్ధి జరగదు. అందుకే టీడీపీ-బీజేపీ-జనసేన కలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ప్రజలు హాజరవుతారు. బొప్పూడి సభ దేశంలోనే అతిపెద్ద భారీ బహిరంగ సభ కానుందని అన్నారు.

సైకో సర్కారు పతనం 17వతేదీ సభనుంచే : కొమ్మారెడ్డి పట్టాభిరామ్
టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ… సభా నిర్వహణ కోసం 13కమిటీల్లో 130 మంది 3పార్టీల నాయకులు పనిచేస్తారు. లక్షలాది మంది సభకు రాబోతున్నారు. సైకో సర్కారు పతనం 17వతేదీ సభనుంచే ప్రారంభమవుతుంది, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం నుంచి జగన్ కనుమరుగు కావడం ఖాయం. రాబోయే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కాబోతోంది. ఒకే నియోజకవర్గంలో 3సార్లు అభ్యర్థులను మార్చడం వైసిపి దయనీయస్థితికి అద్దం పడుతోందన్నారు. ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. జగన్ పాలనలో రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు. రాష్ట్రాభివృద్ధి కోసమే టిడిపి-బిజెపి-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి, మరో నెలరోజుల్లో జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీలతో గెలిపించాలని అన్నారు.

వైసిపికి అభ్యర్థులు కూడా దొరకరు: నాగభూషణం
బిజెపి సీనియర్ నేత పాతూరి నాగభూషణం మాట్లాడుతూ… ఎటువంటి అభివృద్ధి చేయకుండా లక్షలకోట్ల అప్పులు చేసిన జగన్ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే కూటమి లక్ష్యంగా కూటమి పనిచేస్తుందన్నారు. 17వతేదీన జన ప్రభంజనాన్ని చూసి వైసిపికి అభ్యర్థులు కూడా దొరకరు. ఇప్పటికే ఎడపెడా అభ్యర్థులను మారుస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం త్రిమూర్తుల మాదిరిగా మూడుపార్టీల అధినేతలు పనిచేస్తారు, 2014కి మించిన ఫలితాలు ఈ ఎన్నికల్లో రాబోతున్నాయని అన్నారు.

ఉండి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త జుత్తుగ నాగరాజు మాట్లాడుతూ… గత అయిదేళ్లుగా జగన్ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారు, రాష్ట్ర పునర్నిర్మారణం కోసం ప్రజలంతా కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు. లక్షలాది ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

జనసేన రాష్ట్రకార్యదర్శి కూడపాటి శివధర్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తి యథేచ్చగా దోపిడీగా పాల్పడుతున్నారు, లక్షలాదిగా తరలివచ్చే ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా విస్తృతఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రజలను అన్నిరకాలుగా మోసగించిన జగన్ జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలి, కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారని అన్నారు.

LEAVE A RESPONSE