Suryaa.co.in

Andhra Pradesh

సీఎం సొంత జిల్లాలో శాంతి భద్రతలు లేవు

– వైసీపీ పాలన చూస్తుంటే పాకిస్థాన్ లో ఉన్నామా లేక ఖలిస్తాన్‌లో ఉన్నామా అనే భావన కలుగుతోంది
– ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిoచి తన భర్త నామినేషన్ లో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ భార్యపై చర్యలు తీసుకోవాలి
– గులకరాయి కేసులో కావాలనే బోండా ఉమాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు
– వర్ల రామయ్య దేవినేని ఉమామహేశ్వరరావు

కడప జిల్లాలో శాంతిభద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. శనివారం నాడు టీడీపీ నేతలు వెలగపూడిలోని సచివాలయంలో ఎన్నికల అధికారిని కలిసి పలు అంశాలపై పిర్యాదు చేశారు. అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ….పులివెందులలో టీడీపీని లేకుండా చేయాలని సీఎం జగన్ దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు. లింగాల మండలం మురారిచింతల గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతి పరులైన సరిపాల చెలమారెడ్డి వృద్ధ దంపతులపై వైసీపీ నాయకులు అనుచితంగా దాడి చేశారు. కేవలం టీడీపీకి ఓటేస్తారనే ఉద్దేశ్యంతోనే అక్రమంగా దాడికి పాల్పడ్డారు. వైసీపీ పాలన చూస్తుంటే పాకిస్థాన్ లేక ఖలిస్తాన్‌లో ఉన్నామా అనే భావన కలుగుతోంది.

వృద్ధురాలిపై కనికరం లేకుండా చీర పట్టి లాగి మరి దాడి చేయడం హేయమైన చర్య. చుట్టుపక్కల మహిళలు తిరగబడితే పారిపోవడం సిగ్గుచేటు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఈసీ అధికారులకు చూపిస్తే ఆశ్చర్యపోయారు.ఇంత అమానుషంగా దాడి చేసినప్పటికీ వైసీపీ రౌడీమూకలపై పోలీసులు బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం దుర్మార్గం. ఈ విధంగా లా అండ్ ఆర్డర్ నడిస్తే కడపలో ఎన్నికలు అనవసరం. రౌడీ మూకలను వెనకేసుకొస్తున్న ఎస్‍ఐ, సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలి. కడప జిల్లాలో శాంతిభద్రతలు కాపాడాలని నూతనంగా వచ్చిన కడప ఎస్పీ చర్యలు తీసుకోవాలి.

కొండపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిమూలపు సురేష్ నామినేషన్ కార్యక్రమంలో, ర్యాలీలో కర్ణాటక ఆదాయపు పన్నుల విభాగం అధికారిగా పనిచేస్తున్న ఆయన భార్య విజయలక్ష్మీ పాల్గొనడంపై సీఈఓకు ఫిర్యాదు చేశాం. చట్టబద్ధంగా ఎన్నికలు ముగిసే వరకు విజయలక్ష్మీ ఇక్కడకు రాకూడదు. నిబంధనలకు విరుద్ధంగా తన భర్త నామినేషన్, ర్యాలీలో పాల్గొన్న విజయలక్ష్మీని వెంటనే సస్పెండ్ చేయాలి.

ఐఆర్ ఎస్ ఆఫీసర్ గా విజయలక్ష్మి కొనసాగడానికి అర్హత లేదని, ఆమెను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరాం.ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు వేయడానికి ఇతర రాష్ట్రాల్లో కల్పించినట్లు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని సీఈవోను కోరడం జరిగింది. తెలంగాణలో లీవ్ ఇచ్చిన జీఓను అందజేశాం తప్పకుండా ఉద్యోగస్తులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలి.

గులకరాయి దాడి కేసులో పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తారనే ఉద్దేశ్యంతోనే బోండా ఉమాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వెల్లంపల్లి ఓడిపోతాడనే ఉద్దేశ్యంతోనే తప్పుడు కేసులు పెడుతున్నారు. దీనిపై రేపు కేంద్ర పోలీస్ అడ్వైజర్ ను కలిసి రాష్ట్రంలో పోలీసుల తీరు వివరిస్తాం.ఇప్పటికీ వడ్డెరకాలనీకి చెందిన ఐదుగురు పోలీస్ కస్టడీలో ఉన్నారు. కోర్టులో సెర్చ్ వారెంట్ వేసినప్పటికీ వారి ఆచూకీ తెలపకుండా పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు. ఎవరిని సంతృప్తి పరచడానికి, ఎవరి కళ్లల్లో ఆనందం చూడడానికి పోలీసులు దొంగ నాటకం ఆడుతున్నారు?

అమాయకులపై వడ్డెర పిల్లలను బలితీసుకోవద్దని కోరుతున్నా. కోడికత్తి కేసులో దళితుడైన శ్రీనును ఐదేళ్లు జైల్లో పెట్టారో.. సతీష్ పై అదేవిధంగా ఉంచేలా జరుగుతున్న చర్యలు సరైనవి కాదు. ఈ కేసును చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా విచారణ చేపట్టాలి. ఈ కేసులో అన్యాయంగా బోండా ఉమను ఇరికించే ప్రయత్నం చేయవద్దు. అలా చేస్తే పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా భవిశ్యత్తులో తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వర్ల రామయ్య అన్నారు.

అనంతరం మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ……… జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి రావడం కోసం డ్రామాలాడుతున్నారన్నారు.ప్రజల దగ్గర సింపతి కోసం దాడులు చేయించుకొని బలహీనవర్గాలను బలి చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కోడి కత్తి శీను, 2024 లో గులకరాయి సతీష్ బలహీన వర్గాల బిడ్డలను పోలీసులు కేసుల్లో ఇరికిస్తున్నారు. సతీష్ తండ్రి రాయి సతీష్ విసిరినట్లు వీఆర్వో కి చెప్పారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారని ఇంతకంటే పెద్ద కట్టుకథ ఉంటుందా అని దేవినేని పోలీసుల తీరుపై ఆగ్రహించారు.

పోలీసులు అత్యుత్సాహంతో జగన్ పట్ల ఉన్న స్వామి భక్తిని ప్రదర్శించడానికి తప్పుడు కేసులు పెడితే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు ఇప్పటికే ట్రాన్స్ఫర్ అయ్యారని గుర్తు చేశారు. బోండా ఉమా నీ ఈ కేసులో ఇరికించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. పోలీస్ కమిషనర్ వెల్లంపల్లి పై ఈసీకి ఫిర్యాదు చేశామని, పోలీస్ అబ్జర్వర్ కూడా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

జూన్ 4 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని అక్రమ కేసులు పెట్టి ప్రజలను వేధించిన పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఈసిని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్సీ ఏ. ఎస్ రామకృష్ణ, టీడీపీ నేత మన్నవ సుబ్బారావు, వల్లూరి కిరణ్ తదితరులున్నారు

LEAVE A RESPONSE