Suryaa.co.in

Telangana

రాజకీయంగా సీఎం కెసిఆర్ ను కొట్టాలంటే మరో కేసీఆరే పుట్టాలి

బీఆర్ఎస్ ను ఓడించడం ఎవరి తరం కాదు
కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావడం తథ్యం
తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలను సంపూర్ణంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ది
ఉద్యోగాల కల్పన పై కాంగ్రెస్ పార్టీ కి మాట్లాడే అర్హత లేదు
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కలిపి కేవలం 24 వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించింది.. అందులో తెలంగాణకు వచ్చిన ఉద్యోగాలు కేవలం 10 వేలు మాత్రమే
ఆ 10 వేలు కూడా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాము కాబట్టి చివరి రెండేళ్లు మాత్రమే ఆ ఉద్యోగాలు ఇచ్చారని, అంటే కాంగ్రెస్ పాలనలో ఏటా సగటున వెయ్యి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు
కాంగ్రెస్ లో వాళ్లు వాళ్లు కొట్టుకొని చావడానికే సమయం లేదు. వాళ్లు ప్రజల గురించి ఆలోచించే పరిస్ధితిలో లేరు
ఉస్మానియా విద్యార్థులను అడ్డమీద కూలీలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు
రైతు బంధును బిచ్చమేస్తున్నామని అంటున్నారు
కాంగ్రెస్ నాయకుల నోటికి అడ్డూ అదుపూ లేదు
ఓడిపోతున్నామని అర్థమయ్యి కాంగ్రెస్ నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారు
బోధన్ పట్టణంలో జరిగిన మహా యువ గర్జన సభలో పాల్గొని ప్రసంగించిన ఎమ్మెల్సీ కవిత

బోధన్ : రాజకీయంగా సీఎం కేసీఆర్ ను కొట్టాలంటే మరో కేసీఆర్ యే పుట్టాలని, బీఆర్ఎస్ ను ఓడించడం ఎవరి తరం కాదని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బోధనలో జరిగిన మహా యువ గర్జన సభలో పాల్గొని కవిత మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమంలో యువత ముందునడిచిందని, ఎత్తిన పిడికిలి దించకుండా ఉద్యమించారని గుర్తు చేశారు. నాకేందని అనుకుంటే దేశానికి స్వతంత్రం వచ్చేది కాదని, తెలంగాణ కూడా వచ్చేది కాదని, ఆ క్రమంలో ఎన్నికలు వచ్చాయి కాబట్టి బాధ్యత తీసుకోవాలని బీఆర్ఎస్ కు ఓట్లు వేయించాలని కోరారు.

ప్రతీ ఇంటికి వెళ్లి ప్రతీ గుండెను తట్టి ఓట్లు వేయించాలని, అభివృద్ధి పట్ల ఆశ ఉన్న యువకులు కదలాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ యువ విభాగం ఈ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ పథకం చేరని ఇళ్లు లేదని, కాబట్టి ప్రతీ ఇంటి నుంచి పార్టీకి ఓట్లు వేయించాలన్నారు. బోధన్ లో కాంగ్రెస్ అభ్యర్థి పీ సుదర్శన్ రెడ్డిని గెలిపించడం వల్ల ప్రజలకు ఏ మాత్రం లాభం లేదని తెలియజేశారు. షకీల్ ను 50 వేలపైగా మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

బోధన్ లో కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గెలిస్తే పొద్దు పొడుసుడు ఉందని, కేవలం పొద్దుగూకుడే ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధనయజ్ఞానికి సహకరించారు తప్పా బోధన్ ప్రాంతానికి చుక్క నీరు కూడా తేలేదని విమర్శించారు.

ఆయన సొంత గ్రామం సిర్నపల్లిలో చెరువుకు షకీల్ రూ. 53 లక్షలతో మరమ్మత్తు చేయించారు తప్పా ఆయన రూపాయి తీసుకురాలేదని ఎత్తిచూపించారు. అలాగే, బీజేపీ అభ్యర్థి మోహన్ రెడ్ది స్వగ్రామయంలో చెరువులను షకీల్ యే బాగు చేయించారని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ. 17 కోట్ల నిధులు ఇచ్చారని తెలియజేశారు. సుదర్శన్ రెడ్డి గ్రామానికే రూ. 7 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.

తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలను సంపూర్ణంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దని తెలిపారు. రైతు బంధు రాని ఇల్లు లేదని స్పష్టం చేశారు. బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో అదే స్పూర్తితో అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు.

ఉద్యోగాల కల్పన పై రేటెంత రెడ్డికి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కలిపి కేవలం 24 వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించిందని, అందులో తెలంగాణకు వచ్చిన ఉద్యోగాలు కేవలం 10 వేలు మాత్రమేనని వివరించారు. ఆ 10 వేలు కూడా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాము కాబట్టి చివరి రెండేళ్లు మాత్రమే ఆ ఉద్యోగాలు ఇచ్చారని, అంటే కాంగ్రెస్ పాలనలో ఏటా సగటున వెయ్యి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని చెప్పారు.

కాంగ్రెస్ పాలనలో అలా ఉంటే గత పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో 2.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటే నోటిఫికేషన్లు జారీ చేశామని, అందులో 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామని స్పష్టం చేశారు. మరో 40 వేల ఉద్యోగాల భర్తీ ఆయా దశల్లో ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయగానే, పరీక్షలు పెట్టగానే, ఫలితాలు వెల్లడించగానే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోర్టుల్లో కేసులు వేయడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలకు, యువతకు కలిగే ప్రయోజనాలను దొంగదారిలో అడ్డదారిలో ఆపాలని ప్రయత్నం చేయడం తప్పా కాంగ్రెస్ పార్టీ మంచి చేయడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ మారాలంటే యువత మారాలని, మార్పు యువత నుంచే రావాలని అన్నారు.

“కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. రకరకాల రూపంలో ప్రజలను ప్రలోభ పెట్టాలని చూస్తున్నాయి. డబ్బులు ఇవ్వచూపుతున్నాయి. కరెన్సీ నోటుపై గాంధీ తాత బొమ్మ ఉంటుంది. జేబులో గాంధీ బొమ్మ ఉంటే ఉండనివ్వండి కానీ గుండెల్లో ధైర్యం ఉండాలి. అంత ధైర్యం ఉంటే ఎంత ఎవరు కోటీశ్వరులు వచ్చిన ఎదుర్కొంటాం. ” అని వ్యాఖ్యానించారు.

రైతుబంధు, ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులకు పెన్షన్లు. షాద ముబారక్, కళ్యాణ లక్ష్మీ వంటివి కావాలని ఎవరైనా కేసీఆర్ ను అడిగారా కానీ ఇవన్నీ ఎందుకు చేశారు అని ప్రశ్నించారు. తెలంగాణపై ప్రేమ ఉంది కాబట్టే సీఎం కేసీఆర్ ఇవన్నీ చేయగలిగారని తెలిపారు. కేసీఆర్ మనస్సు మహాసముద్రం, ఆలోచన ఆకాశమంతా అని అన్నారు. సీఎం కేసీఆర్ ను ఓడగొట్టాలంటే మరో కేసీఆర్ పుట్టాలి కానీ ఓడించడం ఎవరితోనూ సాధ్యం కాదని తేల్చిచెప్పారు.

మూడో సారి కచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు. “కాంగ్రెస్ లో వాళ్లు వాళ్లు కొట్టుకొని చావడానికే సమయం లేదు. వాళ్లు ప్రజల గురించి ఆలోచించే పరిస్ధితిలో లేరు. ఉస్మానియా విద్యార్థులను అడ్డమీద కూలీలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైతు బంధును బిచ్చమేస్తున్నామని అంటున్నారు. కాంగ్రెస్ నాయకుల నోటికి అడ్డూ అదుపూ లేదు” అని మండిపడ్డారు. ఓడిపోతున్నామని అర్థమయ్యి కాంగ్రెస్ నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు.

LEAVE A RESPONSE