Suryaa.co.in

Andhra Pradesh

వాలంటీర్లు… రాజీనామా చేయకండి

-ఈ ఎన్నికల్లో ఎవరి మాటా వినొద్దు
-పేదల ఇళ్లు, పట్టాలతో వైసీపీ బెదిరింపులు దుర్మార్గం
-సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శనివారం వెంకటాచలం లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ నాయకులు వాలంటీర్లను బెదిరిం చి బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. వారంతా రాజీనామా చేయొద్దని కోరుతున్నా. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే జీతం రూ.10 వేలకు పెంచబోతున్నామని తెలిపారు. బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా నిలబడండి.

మా ప్రభుత్వం రాగానే మేం బాగా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా భాగస్వాములు కావొద్దు. వైసీపీ నేతల మాటలే కాదు..టీడీపీ నాయకుల మాట కూడా వినొద్దని సూచించారు. తహసీల్దార్లు భూములతో పాటు పేదల ఇళ్ల పట్టాలను వైసీపీ నేతల చేతుల్లో పెట్టడం దుర్మార్గమన్నారు. వాటితో వైసీపీ నేతలు ఎన్నికల్లో బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రీ సర్వే పేరుతో భూముల రికార్డులను ఇష్టారాజ్యంగా మార్చేశారని, వాటికి ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు.

పొదలకూరు తహసీల్దారుగా వ్యవహరించిన స్వాతి సస్పెన్షన్‌కు గురై మూడున్నరేళ్లు గడుస్తోంది. ఆమెతో అనేక అక్రమాలు చేయించి ఈ రోజు కనీసం కలిసేందుకు కూడా ఆమెకు కాకాణి అవకాశం ఇవ్వడం లేదన్నారు. వైసీపీ నేతలకు ఇచ్చిన ఇళ్లు, భూముల పట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. అవసరమైతే ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లండి..పోలీసుల సహకారం కోరాలని విజ్ఞప్తి చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వెలగపల్లి వరప్రసాద్‌ను ఆశీర్వదించాలని కోరారు.

LEAVE A RESPONSE