– కంచె గచ్చిబౌలి లోని 400 ఎకరాల భూమి ముమ్మాటికి ప్రభుత్వ ఆస్తి
– సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ కంచె గచ్చిబౌలి లోని సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి ముమ్మాటికి ప్రభుత్వ ఆస్తి. బీఆర్ఎస్, బీజేపీ తమ స్వార్థ రాజకీయాల కోసం కావాలనే అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది వారికి తగదు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా రాజకీయాలు చేయడం మంచిది కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి కి చెందిన ఒక్క ఇంచు భూమిని కూడా ప్రభుత్వం కబ్జా చేయలేదు.
ఇప్పటీ వరకు ఒక్క ఎకరం భూమిపై కూడా యూనివర్సిటీకి చట్టబద్ధ హక్కులు లేవు. ఈ సమస్యను పరిష్కరించాలని యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు పట్టించుకోలేదు. ఇప్పుడేమో పని గట్టుకొని మాపై దుష్ప్రచారం చేస్తున్నారు.
వారం రోజుల కిందట యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ తో మేం ప్రత్యేకంగా సమావేశమయ్యాము. వారి విజ్ఞప్తి మేరకు మా ప్రభుత్వం యూనివర్సిటీకి భూములపై నిబంధనల ప్రకారం చట్టబద్ధ హక్కులు కల్పించేందుకు చొరవ తీసుకున్నాము.
అక్కడున్న నేచురల్ రాక్ ఫార్మేషన్స్, సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి వనరులను కనుమరుగు చేస్తున్నామంటూ కొందరూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది అసత్యం. ప్రకృతిని పరిరక్షించేందుకు పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం.
ప్రజలంతా ఒక్కటీ గమనించాలి. వాస్తవం తెలుసుకోవాలి. 2003లో అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మేం అధికారంలోకి వచ్చాకా సరిదిద్దాం. చట్టబద్ధంగానే ముందుకు వెళ్తాం. తప్పుడు ప్రచారంతో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, పర్యావరణ ప్రేమికులు ఆందోళన కు గురి కావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.