Suryaa.co.in

Andhra Pradesh

మేము ఎన్డీయేతోనే ఉన్నాం, ఉంటాం

-మేం పాలకులం కాదు…సేవకులం
-పాలకుడు ఎలా ఉండకూడదో దేశంలో జగన్ పాలన ఒక కేస్ స్టడీ
-ప్రజలు గెలవాలి…..రాష్ట్రం నిలవాలి అనే మా పిలుపునందుకుని ప్రజలు అనూహ్య మద్దతిచ్చారు
-పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన కూలీలు…..ఎన్ఆర్ఐల తరలివచ్చి ఓట్లు వేశారు
-ప్రజలు మాకు ఇచ్చింది అధికారం మాత్రమే కాదు…ఒక ఉన్నతమైన బాధ్యత అనేది మా విధానం
-జగన్ అహంకారం, అవినీతి, విధ్వంసంతో దెబ్బతినని వర్గం లేదు…వ్యవస్థ లేదు
-ప్రజలు 5 ఏళ్లు స్చేచ్చను, బతకడంపై ఆశను కోల్పోయారు…అరాచకాన్ని చూశారు
-కూటమి కార్యకర్తలు, నాయకుల సమిష్టి కృషి వల్లే ఈ ఫలితాలు
-కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు శిరసువంచి నమస్కరిస్తున్నా
-ఎన్నికల ఫలితాలపై ప్రజలకు, భాగస్వామ్య పక్షాలకు, మీడియాకు ధన్యవాదాలు
-టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు

అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ- జనసేన-బీజేపీ కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు శిరసువంచి నమస్కరిస్తున్నానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అన్నారు. ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలి అనే మా పిలుపునందుకు ప్రజలు అనూహ్య మద్దతిచ్చారన్నారు. కూటమి నేతలు, కార్యకర్తల సమిష్టి కృషి వల్లే ఈ విజయం దక్కిందని ఆయన అన్నారు. ప్రజలు ఇచ్చింది అధికారం మాత్రమే కాదని…ఇది ఒక ఉన్నతమైన బాధ్యత అని స్పష్టం చేశారు.

ఫలితాలు వెలువడిన అనంతరం మొదటి సారి ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…‘‘నా సుదీర్ఘ రాజకీయ యాత్రలో వైసీపీ లాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. అన్నిరంగాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ జగన్ నిర్వీర్యం చేశారు. మా ధ్యేయం ఒక్కటే ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలబడాలి. ఎన్ని త్యాగాలైనా చేసైనా భవిష్యత్ తరాల కోసం ముందుకెళ్లానుకుని నిర్ణయించుకున్నాం.

నేను ఇప్పటికి 10 ఎన్నికలు చూశాను…ఎన్నో సమీక్షలు నిర్వహించి ఎన్నికలకు వెళ్లాం. భూమ్మీద ఎవరూ శాశ్వతం కాదు…దేశం, ప్రజాస్వామ్యం, పార్టీలు శాశ్వతం. పందా లేని పార్టీలు ఎన్నో కనుమరుగు అయ్యాయి. ఈ తీర్పుతో రాష్ట్రంలో అందిరికీ స్వాతంత్ర్య వచ్చింది అని చంద్రబాబు నాయుడు అన్నారు.

పొట్టకూటి కోసం పక్కరాష్ట్రాలకు వెళ్లిన వారూ వచ్చి ఓట్లేశారు
ఇంతటి చారిత్రాత్మక ఎన్నికలు నా జీవీతంలో చూడలేదు..ఈ ఎన్నికల్లో ఎక్కడో విదేశాల్లో ఉండే వ్యక్తులు లక్షలు ఖర్చు పెట్టుకని వచ్చి మరీ ఓటు వేశారు. పక్క రాష్ట్రాలకు పొట్టకూటి కోసం వెళ్లిన వారు కూడా సొంత డబ్బులు పెట్టుకుని వచ్చి ఓట్లు వేశారు. ప్రజల నిబద్ధతను ఎలా అభినందించాలో, ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల కంటే టీడీపీ, ఏపీ చరిత్రలో ఈ విజయం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది.

టీడీపీ స్థాపించినప్పుడు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో 200 సీట్లు వచ్చాయి. 1994లో ప్రతిపక్షానికి కొన్ని చోట్ల డిపాజిట్ రాలేదు. వాటన్నింటినీ కూడా ఇప్పుడు అధికమించి నేడు ఈ విజయం చేకూరడానికి కారణం ప్రజలు అనుభవించిన బాధలు. ఐదేళ్లు ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారు. బతకడంపై ఆశలు కోల్పోయారు.

ఈ ఎన్నికల్లో కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి. ఇందులో టీడీపీకి 45.60 శాతం, వైసీపీకి 39.37 శాతం ఓట్లు వచ్చాయి. ఎప్పుడూ లేనంతగా 95 వేల మెజారిటీ టీడీపీ అభ్యర్థులకు వచ్చింది. గతంలో కుప్పం, సిద్ధిపేట మెజారిటీల్లో పోటీ పడేవి. కానీ ఇప్పుడు గాజువాక, భీమిలి, మంగళగిరిలో 90 వేల మెజారిటీ దాటాయి.

మా కార్యకర్తలు కంటినిండా నిద్రలేని పరిస్థితులు చూశారు
అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనంను ప్రజలు క్షమించరన్నదానికి ఈ ఫలితాలే నిదర్శనం. ప్రజలు చెప్పిన గుణపాఠం పాలకులకు కాదు.అవినీతి, అహంకారంతో ముందుకు వెళ్లే విధ్వంసకారులకు ఇదే జరగుతుంది.ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నా. మా కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కంటినిండా నిద్రలేని పరిస్థితులు చూశారు. మనిషిని హింసిస్తూ, ప్రాణంతో బతకాలంటే జై జగన్ అనమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని నినదించిన చంద్రయ్య లాంటి వారి త్యాగాలు ఉన్నాయి. ఆ త్యాగాల ఫలితమే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం.

మీడియా ఐదేళ్లు పడిన ఇబ్బందులు, కోర్టుల చుట్టూ తిప్పిన ఇబ్బందులు, సీఐడీ ఆఫీసులు చుట్టూ తిప్పిన ఘటనలు చూసుకుంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి. పవన్ కళ్యాణ్ ను కూడా స్వేఛ్చగా ఉండనివ్వలేదు. విశాఖ పర్యటనకు వెళ్తే నగర బహిష్కరణ చేయాలని చెప్పారు. కేసులు పెడితే ఎందుకు కేసు పెట్టావని అడిగితే సమాధానం చెప్పకుండా అరెస్టు చేసి తర్వాత వివరాలు చెప్తామని చెప్పారు.

పాలకులం కాదు..సేవకులం అనే నినాదానికి శ్రీకారం చుడతాం
ప్రజలు మాకు ఇచ్చింది అధికారం అని అనుకోవడం లేదు…బాధ్యతగా తీసుకుంటున్నాం. పాలకులం కాదు..సేవకులం అనే నినాదానికి శ్రీకారం చుడుతున్నాం. సూపర్-6, ప్రజాగళం మేనిఫెస్టో ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి కూటమికి బీజం వేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.

బీజేపీ కూడా కూటమిలో భాగమైంది. మూడు పార్టీలు ఎక్కువ తక్కువ కాకుండా భేషజాలు లేకుండా పని చేశాయి. కేంద్ర నాయకత్వంతో కలిసి గట్టిగా పని చేశాం. 5 ఏళ్ల జగన్ పాలనలో 30 ఏళ్ల విధ్వంసం జరిగింది. అప్పులు ఎంత చేశారో తెలీదు. సహజ సంపదలైన ఇసుక, మైన్, గనులు అన్నింటినీ ఇష్టానుసారంగా దోచేశారు. బోరుబావులు ఇంకిపోతాయని తెలిసి కూడా పొలాల పక్కన ఇసుకను తవ్వేశారు.

ప్రాణభయంతో రైతులు మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. గాడితప్పిన వ్యవస్థలను పునరుద్ధరిస్తాం. 1999 నుండి విద్యుత్ రంగంలో మార్పులు తీసుకొచ్చి నాణ్యమైన విద్యుత్ అందించాం. కానీ ఈ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ రంగంపై అప్పులు తెచ్చి వాటినీ దుర్వినియోగం చేశారు. విద్యుత్ శాఖను సంక్షోభంలోకి నెట్టారు.

నేను చేసిన ప్రతిజ్ఞను ప్రజలు నిజం చేశారు
అసెంబ్లీలో నన్ను, నా కుటుంబ సభ్యులను అవమానించారు. నా జీవితంలో ఎప్పుడూ అంతలా బాధపడలేదు. నాపై బాంబు దాడి జరిగినా వీరోచింతంగా ఎదుర్కొన్నా తప్ప భయపడలేదు. కౌరవసభలో ఉండనని ఆ నాడు చెప్పాను…అది చెప్పడానికి కూడా కనీసం అసెంబ్లీలో నాకు మైకు ఇవ్వలేదు. గౌరవ సభగా మార్చిన తర్వాతే సభకు వస్తానని చెప్పాను.

నేను చేసిన ప్రతిజ్ఞను ప్రజలు నిజం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు నేను ఎప్పుడూ కుంగిపోలేదు.గెలిచినప్పుడు ఎగిరిపడలేదు. ఓడిపోయినప్పుడు బాధ్యతగా ప్రతిపక్ష పాత్ర పోషించాం. గెలిపిచిప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు అందించాము. మేము ఎప్పుడూ ప్రజల పక్షానే ఉన్నాం. నా మాటను, గౌరవాన్ని నిలబెట్టిన ప్రజల రుణం తీర్చుకుని ప్రజల ఆశల మేరకు పని చేస్తాం. నేడు ఓట్లు వేసిన ప్రజలు….రేపు కూడా సహకరించాలని కోరుతున్నా. ప్రజల సహకారం, భాగస్వామ్యంతో పాలన సాగిస్తాం.

పాలకుడు ఎలా ఉండకూడదో దేశంలో జగన్ పాలన ఒక కేస్ స్టడీ
కూటమి విజయంపై భాగస్వామ్య పక్షాలకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రధాని మోదీ, కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. మూడు పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి కార్యకర్త, నాయకుడు బ్రహ్మాండంగా పని చేశారు. మా విజయం మూడు పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి.

పాలకుడు ఎలా ఉండకూడదో…ఎలాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడో జగన్ చరిత్ర ఒక కేస్ స్టడీ. పాలకులంటే ఎలా ఉండాలో చాలా మంది పని చేశారు. పాలకుడు ఎలా ఉండకూడదో చేసి చూపించాడు. ప్రజలు ఎన్నికల్లో చాలా సందర్భాల్లో చాలా మందిని ఓడించారు. కానీ జగన్ విషయంలో ఇక నువ్వు వద్దే వద్దు అని ప్రజలు బలమైన తీర్పును ఇచ్చారు. నేడు ఎన్ డి ఎ మీటింగ్ కోసం డిల్లీ వెళుతున్నాను. మేము ఎన్డీయేతోనే ఉన్నాం, ఉంటాం.’ అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE