– మంత్రి లోకేష్ కు మహిళా వర్సిటీ విద్యార్థినుల కృతజ్ఞతలు
– ఇకపై సెమిస్టర్ వారీగా రీఎంబర్స్ మెంట్ సొమ్ము విడుదలచేస్తాం
– రీసెర్చి, ఇన్నొవేషన్స్ పై దృష్టిపెట్టి మంచి పేరు తీసుకురండి
– సంస్కరణల కోసం జగన్ పై కంటే చంద్రబాబుతో 3రెట్ల పోరాటం
– పద్మావతి ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థినులతో మంత్రి లోకేష్ భేటీ
తిరుపతి: గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు వస్తాయో, రావోనన్న ఆందోళనతో చదువుపై దృష్టి పెట్టలేని పరిస్థితులు ఉండేవి, మీరు అధికారంలోకి వచ్చాక బకాయిలు లేకుండా రీఎంబర్స్ మెంట్ సొమ్ము జమ చేస్తుండటంతో టెన్షన్ లేకుండా చదువుకోగలుగుతున్నామని పద్మావతి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
పద్మావతి యూనివర్సిటీ అధునాతన ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన అనంతరం ట్రిపుల్ ఈ 3వసంవత్సరం విద్యార్థినుల తరగతి గదిని సందర్శించిన లోకేష్…వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రగిరికి చెందిన మేఘన మాట్లాడుతూ… మీ తాతగారు ఎన్టీఆర్ హయాంలో తిరుపతిలో మహిళా వర్సిటీ ఏర్పాటుచేశారు, రాష్ట్ర విద్యా మంత్రిగా మా సమస్యలపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది, గతంలో రీఎంబర్స్ మెంట్ సొమ్ము ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో, రాదోనన్న ఆందోళనకు గురయ్యేవాళ్లం, మీ ప్రభుత్వం వచ్చిక మొదటి సెమిస్టర్ కు సంబంధించిన సొమ్ము బకాయి పెట్టకుండా విడుదల చేయడం ఆనందంగా ఉంది, గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా విడుదల చేయాల్సిందిగా కోరారు.
మంత్రి లోకేష్ స్పందిస్తూ… ఇకపై ఫీజు రీఎంబర్స్ మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తాం, గత ప్రభుత్వం సుమారు రూ.4వేల కోట్ల రూపాయల రీఎంబర్స్ మెంట్ బకాయిలు పెట్టి వెళ్లింది. రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడ్డాక విడదల వారీగా గత బకాయిలను కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతికి చెందిన విజయలక్ష్మి అనే విద్యార్థిని మాట్లాడుతూ… ఇంజనీరింగ్ పూర్తయ్యాక వివిధ అనుబంధ కోర్సులు నేర్చకోవడానికి పెద్దఎత్తున ఖర్చుచేయాల్సి వస్తోంది. యూనివర్సిటీలోనే ఉద్యోగాలకు అవసరమైన కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని కోరారు.
మంత్రి లోకేష్ స్పందిస్తూ…టెక్నాలజీలో ర్యాపిడ్ గా మార్పులు వస్తున్నాయి. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా విద్యార్థినులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యావిభాగాన్ని బలోపేతం చేస్తున్నాం, ఇటీవలే విద్యాధికుడైన చైర్మన్ ను నియమించామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎపి విద్యార్థులు రాణించేలా యూనివర్సిటీ విద్యావిధానంలో సమూల మార్పులు తెస్తామని తెలిపారు. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు ఇంజనీరింగ్ విద్యను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసి, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామని లోకేష్ చెప్పారు. మౌనిక అనే విద్యార్థిని మాట్లాడుతూ… విద్యతోపాటు స్పోర్ట్స్ కు కూడా ప్రోత్సాహం కల్పించాలని కోరారు.
విద్యాబోధన ఎలా ఉందని మంత్రి లోకేష్ ఆరాతీయగా, వర్సిటీలో టీచింగ్ చాలా బాగుందని చెప్పారు. రాజకుమారి అనే విద్యార్థిని మాట్లాడుతూ… వర్సిటీలో అందించే ఆహారం కొంచం ఇబ్బందికరంగా ఉంది, మార్పులు చేయాలని కోరారు. 2వారాల్లో సరిచేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. వర్సిటీలో ఏర్పాటుచేసిన కొత్త ఇండోర్ స్టేడియంలో 20రోజుల్లో అధునాతన పరికరాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వర్సిటీలో ట్రిపుల్ ఈ విద్యను అభ్యసించిన వారికి ప్లేస్ మెంట్స్ 36శాతం మందికే వచ్చాయి, ఈ విషయంలో శ్రద్ధ వహించాలని విద్యార్థినులు కోరారు.
ట్రిపుల్ ఈ విద్యార్థులకు ఐటిలో శిక్షణ ఇవ్వాలని విద్యార్థినులు విజ్ఞప్తిచేశారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లో సైతం మంచి అవకాశాలు ఉన్నాయి, రీసెర్చి, ఇన్నొవేషన్స్ పై దృష్టి పెట్టండి. యూనివర్సిటీకి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి లభించేలా అధునాతన ఆవిష్కరణలు చేయాలని కోరారు. కడపకు చెందిన సరీమ్ మాట్లాడుతూ వర్సిటీ హెల్త్ సెంటర్ లో జనరల్ డాక్టర్ తోపాటు సైకాలజిస్ట్ ను కూడా ఏర్పాటుచేయాలని అన్నారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… జీవితం అన్న మనం అనుకున్నట్లుగా ఉండవు, ఒడిదుడుకులు, అవాంతరాలు ఉంటాయి. నేను 2019లో మంగళగిరిలో ఓటమి చెందినపుడు బాధపడ్డా. తర్వాత ప్రజల్లో మమేకమై అయిదేళ్లు సేవచేశా. రాష్ట్రంలో 3వ అతిపెద్ద మెజారిటీతో అక్కడి ప్రజలు తనను గెలిపించారని అన్నారు.
శిరీష అనే విద్యార్థిని మాట్లాడుతూ… ట్రిపుల్ ఈ లో 70మంది వరకు విద్యనభ్యసిస్తున్నాం. ఉద్యోగావకాశాలు తక్కువగా ఉంటున్నాయి. తాము 4వసంవత్సరం కోర్సు పూర్తిచేసే లోగానే వివిధ ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్ ఇప్పించండి. ప్లేస్ మెంట్ కౌన్సిలింగ్ కు ముందే తమకు శిక్షణ ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. లైబ్రరీలో సరిపడా పుస్తకాలు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ట్రిపుల్ ఈ విద్యార్థినుల ప్లేస్ మెంట్స్ కు ఎటువంటి ఢోకా లేదు. రేణిగుంట, కడపల్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటుచేశాం. కొత్తపరిశ్రమలు రావడానికి అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. డిజైనింగ్ కు సంబంధించిన యూనిట్లు కూడా వస్తున్నాయని చెప్పారు. హాస్టల్ లో సోలార్ వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని పలువురు విద్యార్థినులు కోరారు. హాస్టల్, తరగతి గదుల్లో మరమ్మతులు వచ్చినపుడు వెనువెంటనే చేపట్టాలని అన్నారు.
విద్యార్థినులు చెప్పిన సమస్యలు అన్నింటినీ నోట్ చేసుకున్న మంత్రి లోకేష్ మాట్లాడుతూ…రాబోయే మూడునెలల్లో అన్ని యూనివర్సిటీల్లో నిర్మాణాత్మకమైన మార్పులు తెస్తామని, విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం తాను జగన్మోహన్ రెడ్డిపై చేసిన పోరాటం కంటే 3రెట్లు అధికంగా చంద్రబాబుగారితో పోరాడుతున్నానని చెప్పారు. సంస్కరణల అమలుకు విద్యార్థినులు అందించిన ఫీడ్ బ్యాక్ తమకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.