Suryaa.co.in

Family

మరణం అంటే ఏమిటి ?

రెండు జన్మల మధ్య విరామమే మరణం.చావు పుట్టుకలు, బాధ, సంతోషం, ప్రపంచం, అహం ఇవన్నీ మనసులోనే వున్నాయి. మనసు నశిస్తే ఇవన్నీ నశించిపోతాయి. మనసు నాశనమవవలసిందే కాని తాత్కాలిక ప్రశాంతత కాదు. నిద్రలో మనసు శాంతిగా వుండి ఏమి తెలుసుకోలేదు. నిద్ర లేచిన తర్వాత నీవు పూర్వములాగానే వుంటావు. బాధకు అంతేమి వుండదు. మనసు నశిస్తేనే దుఃఖం అంతమైపోతుంది.
ఏదైతే ఉన్నదో అది ఉండనేవున్నది. లేనిది ఎపుడూ లేదు. పుట్టేది ఏది, చనిపోయేది ఏది. మేల్కోవడమే జననం, నిద్ర మరణం. ఒక వ్యక్తి చనిపోయినా, జీవించినా ఎందుకు వారి గురించి ఆలోచించాలి. వారి గురించి ఎందుకు బాధపడాలి. వారికి బంధాలన్ని పోయినవి కదా. నీ అహంను నాశనం చేయాలి. అహం నశిస్తే ఇక బాధ ఏముంది. జీవించి వున్నపుడే అహం నశించిపోతే ఇక అంతా శాంతియే. అహం నశించకపోతే బ్రతికినంత కాలం చావు గురించి భయపడాలి. గాఢనిద్రలో ఎందుకు హాయిగా వున్నామంటే దేహభావన లేదు కాబట్టి. జ్ఞాని కూడా విదేహముక్తిని గురించే మాట్లాడుతాడు. శరీరం ఎపుడు వదిలేద్దామా అని జ్ఞాని కూడా ఎదురుచూస్తూంటాడు.
కూలివాడు తన తలమీద మూటను, గమ్యస్థానమును చేర్చిన తర్వాత మూటదించుకుని ఎలాగా బంధవిముక్తుడగునో.. అలాగే జ్ఞాని కూడా శరీరాన్ని ఎపుడెపుడు విడిచిపెట్టి సుఖంగా ఉందామా అని ఎదురుచూస్తూంటాడు. బాహ్య దృష్టిని వదలి ఆత్మగానే వుండిపోతే ఏ బాధ వుండదు. శోకించడం నిజమైన ప్రేమకు చిహ్నం కాదు. నిజమైన ప్రేమ ఆత్మగా ఉండడమే. అలాంటి బాధాకరమైన సందర్భాలలో, జ్ఞానులతో సాహచర్యం వలన బాధ ఉపశమిస్తుంది.
(సేకరణ- శ్రీ రమణ మహర్షి బోధనలు .)

LEAVE A RESPONSE