Suryaa.co.in

Andhra Pradesh

జే బ్రాండ్ల అమ్మకాలకు టీచర్లు, వీఆర్వోలను పెట్టినపుడు.. పెన్షన్లు వారితో ఇవ్వలేరా?

-కుట్రపూరితంగానే పెన్షన్లు జాప్యం చేసి ప్రతిపక్షాలపై నిందలేస్తున్నారు
-ఖజానా మొత్తాన్ని సొంత వారికి దోచిపెట్టడమే పెన్షన్ల జాప్యానికి కారణం
-ఇళ్ల వద్ద ఇచ్చేందుకు సిద్ధమని కలెక్టర్లు చెప్పినా జవహర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి మోకాలడ్డారు
-జగన్ రెడ్డి చేసే గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరు
-శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య

జే బ్రాండ్ మద్యం అమ్మకాల కోసం మద్యం షాపుల వద్ద టీచర్లు, వీఆర్వోలను నిలబెట్టిన జగన్ రెడ్డి.. వారి ద్వారా పెన్షన్ పంపిణీకి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య డిమాండ్ చేశారు. పెన్షన్ల పంపిణీ విషయంలో జగన్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు

శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు మాట్లాడుతూ.. కోడికత్తి, వివేకా హత్య కేసు, పింక్ డైమండ్ లాంటి ఎన్నో విషయాల్లో జగన్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలు చేశారు. కుట్రలు కుతంత్రాలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇప్పుడు పెన్షన్ల విషయంలోఅధికారుల్ని అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు. ఒకటో తేదీన ఇవ్వాల్సిన పెన్షన్ల సొమ్మును అస్మదీయులకు దారబోశారు. అవ్వ తాతలకు ఇవ్వాల్సిన పెన్షన్లు సొమ్మును మార్చి 16-30 మధ్య రూ.13 వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారు.

పెన్షన్లకు డబ్బులు లేకుండా చేసి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీపైకి నెడుతున్నారు. రెండు రోజుల క్రితం కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో.. అందరు కలెక్టర్లూ ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీకి సిద్ధమని చెప్పారు. అయినా సెర్ప్ సీఈవో మురళీ ధర్ రెడ్డి, జవహర్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా ఇళ్ల వద్ద ఇవ్వలేమని ఆదేశాలివ్వడం జగన్ రెడ్డి కుట్రే.

ప్రభుత్వ ఖజానా మొత్తాన్ని ఊడ్చేసి, ఎన్నికలకు ముందు గోబెల్స్ ప్రచారానికి తెరలేపారు. ఎన్నికల విధుల నుండి వాలంటీర్లను ఎన్నికల సంఘం తప్పిస్తే.. సచివాలయ సిబ్బంది, సెర్ప్ సిబ్బంది, వీఆర్వోలు, వీఆర్యేలతో పంపిణీకి ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. తెలుగుదేశం పార్టీపై నెపం నెట్టడమే లక్ష్యంగా పెన్షన్లు ఆపారు. ఒకసారి ప్రజలు మిమ్మల్ని నమ్మారు. ఇప్పుడు మరోసారి నమ్మేందుకు సిద్ధంగా లేరు. కోడికత్తి, వివేకా హత్య లాంటి కేసుల్లో ఏం చేశారో ప్రజలంతా చూశారు. పెన్షన్ దారుల్ని ఎండలో అవస్థలకు గురి చేసిన జగన్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు.

చంద్రబాబు ఐదేళ్లలో రూ.1800 పెంచితే, జగన్ రెడ్డి ఐదేళ్లలో పెంచింది రూ.1000 మాత్రమే. పెన్షన్ అనే పదానికి సార్ధకత కల్పించింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. అప్పుడున్న బడ్జెట్ ఎంత.? ఇప్పుడున్న బడ్జెట్ ఎంత? అంత తక్కువ బడ్జెట్లోనూ ఐదేళ్లలో రూ1800 పెంచితే, రూ.12 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ పెంచింది రూ.1000 మాత్రమే. మరోవైపు చంద్రబాబు ధరలు పెంచలేదు, పన్నుల భారం మోపలేదు.

కానీ నేడు ధరల బాదుడు, పన్నుల వాత, ఛార్జీల మోతతో ప్రజల నడ్డి విరిచారు. చివరికి చెత్త పన్ను అంటూ ప్రజల్ని పీల్చి పిప్పి చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. విడతల వారీగా పెన్షన్లు పెంపు హామీకి కూడా తిలోదకాలిచ్చి రూ.31,500 ఎగ్గొట్టారు. ప్రభుత్వ సిబ్బందితో ఒక్క రోజులో ఇళ్ల వద్దే అందించే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ కుట్రతో ఇవ్వకుండా దగా చేస్తున్నారు. తక్షణమే పెన్షన్లు ఇళ్ల వద్ద అందించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.

బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద సూర్య మాట్లాడుతూ..
పెన్షన్లు ఆలస్యం చేయడం ద్వారా పెన్షన్ దారులకు అవస్థలకు గురి చేసి, ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ పైకి నెట్టాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. రూ.200 ఉన్న పెన్షన్ చంద్రబాబు రూ.2000 చేశారు. కానీ రూ.3000 చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పెంచింది కేవలం రూ.1000 మాత్రమే. చంద్రబాబుపై నెపం నెట్టాలనుకునే జగన్ రెడ్డి పప్పులు ప్రజల వద్ద ఉడకవన్నారు. మార్చి 16-30 మధ్య సొంత వారికి రూ.13 వేల కోట్లు దోచిపెట్టారు.

ఖజానాలో నిధులు లేక పెన్షన్లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ .. దాన్ని తెలుగుదేశంపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని ఇదివరకే జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా చెప్పారు. అందుకే ఎన్నికల కమిషన్ వారిని నేరుగా నగదు పంచే కార్యక్రమాలకు దూరంగా ఉంచింది. ఇప్పుడు వాలంటీర్లు దూరం కావడంతో.. కుట్రపూరితంగా పెన్షన్ దారుల్ని రోడ్డున నిలబెట్టారు. వాలంటీర్లు లేకపోతే.. సెర్ప్, మెప్మా, వీఆర్వోలు, వీఆర్యేలు అందుబాటులో ఉన్నారు కదా. వారితో పంపిణీకి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?

ఒక్క రోజులో ఇళ్ల వద్ద ఇవ్వడానికి కలెక్టర్లు సరేనన్నా.. జవహర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి వ్యతిరేకించడానికి కారణమేంటి? పెన్షన్ అందకుండా చేసిన విధానం, కుట్రను ప్రజలు గుర్తించారు. పెన్షన్లు సకాంలంలో ఇవ్వలేని అసమర్ధతను ప్రతిపక్షాలపైకి నెట్టేస్తున్న విధానాన్ని ప్రజలు గుర్తించారు. జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను ప్రజలంతా గుర్తించారు. కడుపు నింపుకోవడానికి మందులు కొనుక్కోవడానికి ఉపయోగపడే పెన్షన్ సొమ్ముల్ని సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పేదల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు.

ఈ రోజు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించినా, మధ్యాహ్నం వరకు సచివాలయ సిబ్బందిని ఉద్దేశ్యపూర్వకంగా రాకుండా చేసి వృద్ధుల్ని అవస్థలపాలు చేస్తున్నారు. ప్రజల్ని ఈ రకంగా బాధ పెట్టి రాజకీయం చేయడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి. మధ్యం షాపుల వద్ద టీచర్లను పెట్టావ్. వీఆర్వోలకు డ్యూటీలేశావ్. సినిమా థియేటర్ల వద్ద ఉద్యోగుల్ని పెట్టావ్.

కానీ, పెన్షన్లు పంపిణీకి సచివాలయాల వద్ద డ్యూటీ వేయలేవా అని ప్రశ్నించారు. వృద్ధులు, దివ్యాంగుల ఉసురు పోసుకునే నిన్ను పాతాళంలోకి తొక్కి పెడతాం. తక్షణమే ఇళ్ల వద్దనే పెన్షన్లు అందించాలి. జగన్ రెడ్డి రాజకీయ కుట్రను తెలుగుదేశం పార్టీపైకి నెట్టే ప్రయత్నాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

LEAVE A RESPONSE