దేశవ్యాప్తంగా తమిళులకు ఎక్కువ గుర్తింపు ఉంది అనడం కన్నా, వారు నిత్యం అస్తిత్వ పోరాటం చేస్తూ, ఎక్కువగా జాతీయ వార్తల్లో నిలుస్తుంటారు అనడం సబబు.
మాతృభాష పై మమకారం : తెలుగు రాష్ట్రాల్లో భాషా పరిరక్షణ సంఘాలు ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాయి. కానీ తమిళ నాట మాత్రం మాతృభాష ఉద్యమాలు నిరంతరం ఒక జీవ వాహినిగా ప్రవహిస్తూనే ఉంటాయి. అందుకే ఎవరైనా తమిళం జోలికి వస్తే, జాతీయ స్థాయిలో కూడా ఉద్యమాలు చేయడానికి వీరు వెనుకాడరు.
సంస్కృతి పరిరక్షణ: తెలుగు నాట సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న ఆదరణ తగ్గుముఖం పడుతోంది. ఆధునిక పద్ధతులకు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. కానీ తమిళ ప్రజలకు సంస్కృతి అంటే పంచ ప్రాణాలు. ఇప్పటికీ పెళ్లిళ్లలో పంక్తి భోజనాలు, సంప్రదాయ వేషధారణలు కనిపిస్తుంటాయి. ఇక పండగలు, పబ్బాలకు తమిళులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. జల్లికట్టు ఉద్యమముతో జాతీయ స్థాయిలో పేరు సంపాదించారు.
భాష విషయంలో తమదే పై చేయి అంటారు: ద్రావిడ భాషల్లో తమిళమే గొప్పదని తమిళులు ఎప్పటికీ నమ్ముతుంటారు. అందుకే తెలుగుకి ప్రాచీన హోదా కల్పించాలని ఇక్కడి మేధావులు పోరాటం చేస్తున్నప్పుడు, దానిని నీరు గార్చడానికి తమిళ భాషా నిపుణులు చేయని ప్రయత్నమంటూ లేదు. తెలుగుకి ప్రాచీన హోదా ఇవ్వకూడదని వాదించారు. ఆఖరికి తూమాటి సంజీవరావు లాంటి తెలుగు భాషా ప్రేమికులు తగిన ఆధారాలు చూపి, కోర్టులో కేసు గెలిస్తే గానీ, ఈ ఉపద్రవం నుండి మనం బయట పడలేకపోయాం.
అట్టడగు, నిమ్న వర్గాల హక్కులను కాపాడే చిత్రాలు తీయడం: టి.కృష్ణ లాంటి దర్శకులు చనిపోయాక, ఆర్.నారాయణమూర్తి లాంటి దర్శకులు సినిమాలు తీయడం తగ్గించాక, తెలుగులో ప్రజా పోరాటాలు, అస్తిత్వ పోరాటాల మీద వస్తున్న చిత్రాల శాతం బహు తక్కువ. కానీ తమిళంలో నిరంతరం అలాంటి చిత్రాలు నిర్మితమవుతూనే ఉన్నాయి. అందులో చాలా చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునూ పొందుతుంటాయి. కబాలి, కాలా, పెరియారుమ్ పెరుమాళ్, మండేలా, విసనరై, జై భీమ్, అసురన్, తంగాలన్ లాంటి చిత్రాలను అందుకు ఉదహరణలుగా చెప్పుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వములో కీలక శాఖలు: చెన్నారెడ్డి, పీవీ లాంటి వారి తర్వాత, తెలుగు వారు కేంద్ర ప్రభుత్వములో ఎప్పుడూ కీలక శాఖలు పొందలేదు. కింజరపు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి.. అంతకు ముందు జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, కేసీఆర్, దాసరి నారాయణరావు, చిరంజీవి మొదలైన తెలుగు వ్యక్తులు కేంద్ర క్యాబినెట్ నందు పనిచేసినా, చెప్పుకోదగ్గ ప్రధాన శాఖలు పొందలేదు. కానీ తమిళ మహిళ నిర్మలా సీతారామన్ రక్షణ, ఆర్థిక శాఖలు పొందారు. ఇప్పటికీ ఆ శాఖల్లో రాణిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కూడా చిదంబరం ఆర్థిక, హోం శాఖలు పొందారు. గతంలో తమిళ వ్యక్తి అంబుమని రాందాస్ ఆరోగ్య శాఖ పొందారు.
ఎం.జీ.ఆర్ కు భారతరత్న: ఎం.జీ.ఆర్ తమిళములో స్టార్ హీరో. అంతే కాదు, సీఎంగా పనిచేసిన వ్యక్తి. తమిళ రాజకీయాల్లో తిరుగులేని పాత్ర పోషించారు. భారతరత్న కూడా పొందారు. నిజానికి తెలుగులో ఎన్టీఆర్ కి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. కానీ ఎన్టీఆర్ చనిపోయి ఇన్ని రోజులైనా, ఇప్పటికి ఏ కేంద్ర ప్రభుత్వమూ ఆయనకు భారతరత్న ఇవ్వడానికి సంసిద్ధం కాలేదు. కానీ, ఎం.జీ.ఆర్ అభిమానులు మాత్రం ఆయనకు అక్కడ “భారతరత్న” ఇచ్చే దాకా వదిలిపెట్టలేదు. ఆయన చనిపోయిన సంవత్సరం లోపునే, ఆయనకు ఆ గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నించారు. అదీ వారి పట్టుదల.
నిజానికి తెలుగు వారితో పోల్చుకుంటే, తమిళ నాట దక్కిన “భారతరత్న”లూ ఎక్కువే. రాజగోపాలచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సి.వి.రామన్, కామరాజ్, అబ్దుల్ కలాం, సి.సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, ఎం.జీ.ఆర్, ఎం.ఎస్.విశ్వనాథన్.. ఇలా తొమ్మిదిమంది భారతరత్న పొందారు. కానీ తెలుగు వారిలో జాకీర్ హుస్సేన్, పీవీ నరసింహారావు.. ఇలా ఒకరిద్దరికి తప్ప ఇప్పటివరకు ఇంకెవరికీ ఆ పురస్కారం పెద్దగా ఇవ్వలేదు.
ద్రావిడవాదం మీద నిత్యం కృషి చేసే పార్టీలు: తమిళ రాజకీయాల్లో రెండు ప్రధాన పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే.. రెండూ కూడా ద్రావిడ వాదాన్ని తలకు ఎత్తుకున్న పార్టీలే. ఆర్య ద్రావిడ బేధాలను ఎప్పటికకప్పుడు ప్రకటిస్తూ, జాతీయ స్థాయిలో చర్చను లేవదీసిన పార్టీలే. కానీ ఈ స్థాయి ద్రావిడవాదం తెలుగు నాట లేదు. కొన్ని కమ్యూనిస్టు పార్టీలు, నాస్తిక సంఘాలు తప్ప ద్రావిడ వాదాన్ని తలకు ఎత్తుకొనే పార్టీలు తెలుగు నాట లేవు. అందరినీ కలుపుకొని పోవాలన్న మనస్తత్వం తెలుగు వారిది. కానీ తమిళ నాట చాలా చోట్ల “మీరు వేరు, మేము వేరు” అన్న ధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఆ ధోరణే జాతీయ స్థాయిలో చర్చకు కారణమవుతూ ఉంటుంది.
భారతీయార్ జయంతి ఉత్సవాలు గొప్పగా జరుగుతుంటాయి: తమిళ నాట కవులను, కళాకారులను స్మరించుకునే సంప్రదాయం చాలా గొప్పగా ఉంటుంది. ఉదాహరణకు తమిళ కవి భారతీయార్ జయంతి వేడుకలను ఒక పెద్ద పండగల వాళ్ళు చేస్తారు. కవి సమ్మేళనాలు, సాహితీ పోటీలు, సభలు విరివిగా జరుగుతుంటాయి. ఎందుకో మన తెలుగు కవులు శ్రీశ్రీ, గురజాడ, కాళోజీ లాంటి వారి జయంతులు ఆ స్థాయిలో జరగవు.
తిరుపతిలో కూడా ఆధిపత్యం: తిరుమల, తిరుపతిల్లో అనేక చోట్ల తెలుగు వారితో సమానంగా వ్యాపారాలు చేయడం తమిళవారికే చెల్లింది. ఇప్పటికీ శ్రీవారి ఆలయాన్ని తమ సొంత ఆలయంగా తమిళులు భావిస్తుంటారు. మదురై, అరుణాచలం లాంటి ప్రాంతాల్లో కూడా తెలుగు వారు వ్యాపారాలు చేసుకుంటున్నపటికీ, తమిళులతో పోటీ పడడం కాస్త కష్టమే అనుకోవాలి.
– బాబు కొయిలాడ