-టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు
అధినేత చేతుల మీదుగా బీ ఫారం
చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించి అధినేత చంద్రబాబుకు కానుకగా ఇచ్చి తీరతామని టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం కూటమి విజయానికి చేరువుగా వెళుతుంటే, ముఖ్యమంత్రి జగన్ ప్రతి అడుగు పరాజయం, పరాభవం వైపే పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. గత ఆదివారం అనివార్య కారణాల వల్ల ఆయన బీ ఫారం అందుకోలేదు. బుధవారం శ్రీకాకుళంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతులమీదుగా ఆయన బీఫారం అందుకున్నారు. ఈ సందర్భంగా విజయీభవ అంటూ ప్రత్తిపాటిని అభినందించిన చంద్రబాబు దిగ్విజయంగా గెలిచి రావాలని సూచించారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు, ప్రజలకే జీవన్మరణ సమస్య అన్నారు. పొరపాటున మళ్లీ గెలిస్తే రాష్ట్రాన్ని టోకుగా అమ్మకానికి పెట్టడా నికి కూడా వెనకాడడని, జగన్ గ్యాంగ్ నుంచి ఏపీని, ఏపీ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.