Suryaa.co.in

Andhra Pradesh

పిల్లలను చూసుకోవాలన్నా, పరిశ్రమలను నడపాలన్నా మహిళలకే సాధ్యం

-అభివృద్ధిలో మంగళగిరిని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
-స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి

మంగళగిరి: ఇంట్లో పిల్లలను చూసుకోవాలన్నా, పరిశ్రమలను నడపాలన్నా అది మహిళలకే సాధ్యమని నారా బ్రాహ్మణి అన్నారు. తగినంత ప్రోత్సాహం అందిస్తే ఏ రంగంలోనైనా మహిళలు అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి వైష్ణవి ఫంక్షన్ హాల్ లో జరిగిన స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో ఆమె సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాల్లో మహిళలు సాగిస్తున్న ప్రగతి పథానికి తెలుగుదేశం ప్రభుత్వం వేసిన పునాదులే కారణం. ఎన్టీఆర్ గారు మహిళలకు ఆస్తిహక్కు, రాజకీయాల్లో 9% రిజర్వేషన్లు కల్పించారు. స్త్రీ అభ్యున్నతికి పద్మావతీ మహిళా వర్సిటీ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ బాటలోనే మహిళాభ్యున్నతికి చంద్రబాబు గారు బాటలు వేశారు. మహిళలకు స్థానిక సంస్థలు, కళాశాలలు,ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు అమలు చేశారు. డ్వాక్రా ఏర్పాటుతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా మహిళలకు ఆర్థికంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు.

అక్రమ అరెస్ట్ తో అభివృద్ధిని అడ్డుకోలేరు:
స్కిల్ డెవలప్ మెంట్ లో లక్షలాదిమంది యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించిన చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని అడ్డుకోలేనట్టే…అక్రమ అరెస్ట్ తో అభివృద్ధికి కేరాఫ్ అయిన చంద్రబాబు గారిని ఆపలేరు. ఐదేళ్లుగా పాలన చేతకాక అన్నింటా విఫలమయ్యారు. నిత్యావసర ధరలు పెంచి పేద, మధ్యతరగతి నడ్డి విరిచారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చి యువత భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టారు. జే ట్యాక్స్ బెదిరింపులు తట్టుకోలేక పారిశ్రామిక వేత్తలు పారిపోయారు. ఒక్క పరిశ్రమ తీసుకురాలేదన్నారు.

ఈ సందర్భంగా దుర్గ అనే మహిళ మాట్లాడుతూ…లోకేషన్న తోపుడు బండి ఇచ్చారు. నా కుటుంబానికి ఆధారం చూపారు. నేను కూడా సంపాదిస్తున్నాను. ఇంటికి ఆసరాగా నిలిచాను. జ్యోతి అనే మహిళ మాట్లాడుతూ…స్త్రీ శక్తి పథకం ద్వారా తమ కాళ్లపై తాము నిలబడి అవకాశం కల్పించిన లోకేషన్నకు జీవతాంతం రుణపడి ఉంటాం. పథకం కింద కుట్టు మిషన్ ట్రైనింగ్ తీసుకుని ఉపాధి పొందుతున్నాను. వేడి నీటికి చన్నీళ్లలా నా భర్త సంపాదనకు నాదీ తోడైంది. మా కుటుంబం సంతోషంగా ఉంది.

మహిళలకు అండగా మహాశక్తి :
చంద్రబాబు గారు మహిళా పక్షపాతి అని, మహిళల కోసమే మహాశక్తి కార్యక్రమం తెచ్చారని బ్రాహ్మణి అన్నారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నేరుగా వారి ఖాతాలోకి జమ చేయాలనే నిర్ణయం గతంలో ఏ రాజకీయ పార్టీ తీసుకోలేదు. మొదటిసారిగా చంద్రబాబు దీనికి ప్రణాళిక రచించారు. తల్లికి వందనం పథకం ద్వారా తన కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో వారందరికీ డబ్బులు జమ చేస్తాం. దీపం పథకం కింద మూడు సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని సంకల్పించారని బ్రాహ్మణి తెలిపారు.

అంతకుముందు తాడేపల్లి నులకపేటలోని ట్విల్స్ బట్టల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. వస్త్రాల వ్యాపారులతో మాట్లాడారు. ఐదేళ్లుగా వ్యాపారం సరిగా జరగడం లేదని, షాపులు ఖాళీగా ఉన్నాయని వ్యాపారులు తెలిపారు. అధికారంలోకి రాగానే వస్త్ర వ్యాపారులను అన్ని విధాలా ఆదుకుంటామని బ్రాహ్మణి భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE