రైతులకు ఆదాయం పెంచేవిధంగా జీఏపీ సర్టిఫికేషన్

· ఆర్బీకేల ద్వారా రైతుల గడపవద్దనే అన్ని సేవలు
· ‘పొలంబడి’ కార్యక్రమాల ద్వారా రైతులకు మరింత ఆదాయం.. తక్కువ పెట్టుబడి.. అధిక దిగుబడి..
· రాష్ట్రంలో త్వరలో ఎపెడా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు
· వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడి..

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా కృషిచేస్తుందని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అనేక రైతు పథకాలను అమలుచేయడంతో పాటు రైతు భరోసా కేంద్రాలను కేంద్రబిందువుగా ప్రతి గ్రామంలో నెలకొల్పి గడపవద్దనే విత్తనం నుండి పంట విక్రయం వరకూ అన్ని సేవలు అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (జీఏపీ) & ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ ప్రక్రియలో భాగంగా వ్యవసాయ, ఆహార శుద్ధి ఉత్పత్తుల ఎగుమతుల సంస్థ (ఎపెడా) ఆధ్వర్యంలో విజయవాడలో మురళీ ఫార్చూన్ హోటల్ లో గురువారం నిర్వహించిన జోనల్ స్థాయి (తూర్పుగోదావరి, కాకినాడ, డా. బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల జిల్లాల) వర్క్ షాపులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని ఇచ్చే పంటలు పండించేలా పొలంబడి కార్యక్రమాల ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పుడు FAO సహకారంతో గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (GAP) పై అవగాహన కల్పించి తగు ద్రువీకరణ ఇవ్వడం ద్వారా వారి పంటలను ఎగుమతి చేసే స్థాయికి రైతును తీసుకేళ్ళలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యేశమని ఆమె తెలిపారు. రైతుల పండించే పంటలకు మంచి ధర కావాలంటే మంచి పద్దతిలో పండించారని సర్టిఫికేషన్ చాలా కీలకమన్నారు. సర్టిఫికేషన్ ఉంటే ప్రపంచ మార్కెట్ లో సైతం ఎక్కువ ధర లభిస్తోందని వివరించారు. ప్రైవేట్ ఏజెన్సీలతో రైతులకు సర్టిఫికేషన్ చేయిస్తే ఖర్చు ఎక్కువతుందని, ఆ ఖర్చు రైతులకు భారంకాకూడదనే సదుద్దేశ్యంతో అతి తక్కువ ఖర్చుతో ఏపీ సీడ్స్ సంస్థను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (జీఏపీ) సర్టిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రణాళికలన్నీ సిద్ధం చేశామని ఆమె తెలిపారు.

రాష్టంలోని 26 జిల్లాలలో ఎంపిక చేసిన క్లస్టర్ల ద్వారా జీఏపీ శిక్షణా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పొలంబడి కార్యక్రమాల ద్వారా ఇప్పటికే మనం చాల వరకు మంచి వ్యవసాయ పద్ధతులు అమలు చేస్తున్నామని వీటిని మరింత మెరుగు పరచుకోవడమే ఈ కార్యక్రమం ఉద్యేశమని చెప్పారు. ప్రతి గ్రామంలో కనీసం 100 మంది రైతులు కలిసి ఒక గ్రూపుగా రైతు ఉత్పాదక సంఘాలుగా (FPO) ఏర్పడాలని సూచించారు. అప్పుడు వ్యాపారులే రైతు సంఘాల వద్దకు వచ్చి పంట ఉత్పత్తులను2 రెట్టింపు ధరకు కొనుగోలు చేస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులు వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. వారికి టెక్నికల్ నాలెడ్జ్ అందించే ఉద్ధ్యేశ్యంతో యూనివర్సిటీలతో మాట్లాడి శాస్త్రవేత్తల పరిశోధనలు రైతుల వరకూ తీసుకొచ్చేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విత్తనం నుండి పంట విక్రయం వరకూ అన్నిసేవలు రైతు గడపవద్దనే అందిస్తున్నామన్నారు. ఆర్బీకేల్లో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లను నియమించి ఈ ప్రభుత్వం సేవలందిస్తోందన్నారు. ఆర్బీకేల ద్వారా నిర్వహించే ‘డా. వైఎస్సార్ పొలంబడి’. ‘డా. వైఎస్సార్ తోటబడి’ కార్యక్రమాల్లో దాదాపు 11 లక్షల మంది రైతులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పెట్టుబడి 10 నుండి 22 శాతం తగ్గిందని, దిగుబడి 6 నుండి 24 శాతం పెరిగిందని ఆమె తెలిపారు.

గత మూడేళ్ళుగా రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల నుంచి అరటి గల్ఫ్, ఆసియా దేశాలకు ఎగుమతి అవుతుందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ చొరవ వలనే జరిగిందని చెప్పారు. ఇప్పుడు మనం దేశంలోనే అరటి ఎగుమతులలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచామన్నారు. అలాగే మన రైతుల పంటలు కూడా ఆసియా దేశాలతో పాటు యూరప్ దేశాలకు కూడా ఎగుమతి కావాలన్నదే ప్రభుత్వ ఆశయమని చెప్పారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చొరవతో APEDA ప్రాంతీయ కార్యాలయం త్వరలో రాష్ట్రంలో ఏర్పాటు అవుతుందని పూనం మాలకొండయ్య తెలిపారు.

ఏపీ సీడ్స్ ఎండీ జి. శేఖర్ బాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ భారతదేశ ధాన్య భాండాగారమని, రాష్ట్రంలో ప్రతి జిల్లాకి వైవిధ్యత ఉందని తెలిపారు. ఏపీ రైతులు పొలంబడి వంటి కార్యక్రమాల్లో పాల్గొని మంచి ఫలితాలు సాధిస్తున్నారని, దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదన్నారు. రైతుల ఆదాయం పెంచాలనే ఉద్దేశ్యంతో గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్, ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ఈ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. మంచి పద్దతులతో పండించిన పంటలకు మార్కెటింగ్ లో చాలా ప్రాధాన్యత ఉంటుందని శేఖర్ బాబు తెలిపారు.

GAP సర్టిఫికెట్ పొందేందుకు పాటించాల్సిన పద్ధతులు, ప్రమాణాలతో పాటు సర్టిఫికేషన్ పొందిన ఉత్పత్తులను ఏ విధంగా ఎగుమతి చేయాలనే అంశాలపై ఇండిగ్యాప్ (IndGAP) సర్టిఫికేషన్ కమిటీ చైర్ పర్సన్ శ్రీహరి కొటెల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జీఏపీ ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని శ్రీహరి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో పాటు ఎంపిక చేసిన రైతులకు విజయవాడలో గురువారం జోనల్ స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇదే విధంగా డిసెంబర్ 2న, డిసెంబర్ 9న, డిసెంబర్ 16న జోనల్ స్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ త్రివిక్రమ్ రెడ్డి, ఆర్బీకేల సంయుక్త వ్యవసాయ సంచాలకులు వి. శ్రీధర్, పొలంబడి డీడీఏ యాన్.సి.యెచ్ బాలు నాయక్, ఎపెడా రీజనల్ హెడ్ యు.ధర్మారావు, పోలయ్య జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, రైతులు, విలేజ్ అగ్రికల్చర్, హార్టీకల్చర్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు.

Leave a Reply