Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు సభలకు వస్తున్న జన ప్రభంజనంతో వైసీపీ వెన్నులో వణుకు

-వైసీపీ పాలనలో నష్టపోని వర్గం ఏదైనా ఉందా?
-ఎన్నికలు ఎప్పుడు జరిగినా పులివెందుల సహా అన్ని స్ధానాల్లో టీడీపీ గెలుపు
-టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి

చంద్రబాబు సభలకు వస్తున్న జన ప్రభంజనం చూసి వైసీపీ వెన్నులో వణుకు మొదలైందని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి అన్నారు. ఆదివారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సైకో పాలనను అంతమెందించేందుకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన రా..కదలిరా సభలకు విద్యార్ది, యువత, రైతులు, మహిళలు అన్ని వర్గాలు బ్రహ్మరధం పడుతున్నారు.

ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో 50 ఏళ్లు వెనక్కి నెట్టారు. వైసీపీ పాలనలో నష్టపోని వర్గం లేదు. ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలకు 130 పధకాలు రద్దు చేసి, 1 లక్షా 14 వేల కోట్ల నిధులు దారి మళ్లించారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ కార్పోరేషన్ల ద్వారా ఒక్కరికి కూడా కనీసం ఒక్క రుణం ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యాభివృద్ది కోసం తెచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య వంటి పధకాలు జగన్ రద్దు చేసి ఆ వర్గాలను విద్యకు దూరం చేశారు. స్ధానిక సంస్ధల్లో బీసీలకు రిజర్వేషన్లలో కోత కోసి 16,800 పదవులు దూరం చేశారు.

బడుగు, బలహీన వర్గాలను ఊచకోత కోస్తున్నారు. వైసీపీ పాలనలో 6 వేలకు పైగా దళితులపై దాడులు జరిగాయి, 188 మంది హత్యకు గురయ్యారు. దళిత డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఊరేగిస్తారా? ఇసుక మాఫియాను ప్రశ్నించిన వరప్రసాద్ కి శిరో ముండనం చేశారు. ఎస్సీలపై ఇన్ని ఘోరాలు చేసి అంబేద్కర్ విగ్రహం పెడితే ఆ పాపం పోతుందా? అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత కూడా జగన్ రెడ్డికి లేదు. దళితులకు న్యాయం చేసిన పార్టీ టీడీపీనే.

2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, మెగా డీఎస్సీ అన్న హామీల ఏమయ్యాయి? ఉపాధి, ఉద్యోగాలు లేక యువత గంజాయికి బానిసలుగా మారారు. మద్యపాన నిషేదంపై మాట తప్పి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 40 వేల కోట్లు అప్పులు తెచ్చారు. జగన్ రెడ్డి కల్తీ మద్యం తాగి 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు, 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1500 ఇస్తాం.

అమ్మకు వందనం కింద ప్రతి విద్యార్దికి రూ. 15 వేలిస్తాం. రైతుల అప్పుల్లో రాష్ట్రం మొదటి స్ధానంలో ఉంది. సాగునీటి ప్రాజెక్టులన్నీ నిర్వీర్యం చేశారు. పండుగల సమయంలో సంబరాలు చేసుకోవటం తప్ప ఇరిగేషన్ మంత్రికి పోలవరం అంటే తెలీదు. వ్యవసాయ శాఖామంత్రి ఎవరో ప్రజలకు తెలీదు. టీడీపీ హయాంలో గ్రామాలను అన్ని విధాల అభివృద్ది చేస్తే జగన్ రెడ్డి మాత్రం పంచాయితీ నిధుల్ని దారి మళ్లించారు. ఉచిత ఇసుక రద్దు చేసి 43 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారు. ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ అన్నింటిలో రూ. 5 లక్షల కోట్లు దోచుకున్నారు.

జగన్ రెడ్డి మార్చిన 68 మందిలో 46 మంది ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీలే. ఎమ్మెల్యేలను మార్చటం కాదు జగన్ రెడ్డి..రాష్ట్రాన్ని నాశనం చేసిన నిన్ను మార్చేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. పెట్రోల్,డీజిల్, ఆర్టీసీ కరెంట్ అన్ని రేట్లు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపిన జగన్ రెడ్డి రాష్ట్రానికి అవసరమా? ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలకు 130 పధకాలు అమలు చేసిన ఘనత టీడీపీదే.

సబ్ ప్లాన్ నిధులు పక్కాగా అమలు చేసి ఆ వర్గాలను ఆదుకున్న విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు. ప్రజలకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని ప్రజలు నమ్మకంతో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పులివెందులతో సహా అన్ని స్దానాల్లో టీడీపీ గెలవటం ఖాయం.

LEAVE A RESPONSE