Suryaa.co.in

Andhra Pradesh

ఆదర్శ మంగళగిరికోసం అంతా కలసిరండి!

క్రిస్టియన్లు, ముస్లింలకు అండగా నిలుస్తా
తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ భేటీ
కాజలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన యువనేత

మంగళగిరి: మంగళగిరిని రాష్ట్రంలోనే నెం.1గా తీర్చిదిద్దడానికి అన్నివర్గాల ప్రజలు కలిసి రావాలని మంగళగిరి టిడిపి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి పరిధిలో పలువురు తటస్థ ప్రముఖులను యువనేత నారా లోకేష్ శనివారం రాత్రి కలుసుకున్నారు. తొలుత తాడేపల్లి 8వవార్డుకు చెందిన పాస్టర్ కోలా న్యూమన్ ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. న్యూమన్ కుటుంబసభ్యులు యువనేతకు సాదర స్వాగతం పలికారు.

వందేళ్ల చరిత్ర కలిగిన క్రైస్తవ ప్రార్థన మందిరం చర్చికి న్యూమన్ పాస్టర్ గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో క్రిస్టియన్ మైనార్టీల సమస్యలను తాను అధ్యయనం చేశానని చెప్పారు. పాస్టర్లకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతో పాటు క్రిస్టియన్ మైనార్టీలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేస్తామని చెప్పారు.

మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని తాను నిర్ణయించానని, ఇందుకు తనకు సహకారం అందించాలని కోరారు. తర్వాత లోకేష్ తాడేపల్లికే చెందిన పటాన్ అబ్బాస్ ఖాన్ ఇంటికి వెళ్లారు. గత ప్రభుత్వంలో దుల్హాన్, రంజాన్ తోఫా వంటి పథకాలను అమలుచేస్తే వైసిపి ప్రభుత్వం వచ్చాక రద్దుచేశారని గుర్తుచేశారు. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనారిటీ సోదరులను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని, గత ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్దరిస్తామని చెప్పారు.

అనంతరం మంగళగిరికి చెందిన ప్రణవి ఆర్థో కేర్ సెంటర్ అధినేత తోట శ్రీనివాస రాఘవను వారి నివాసంలో కలుసుకున్నారు. మంగళగిరి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యసేవల కోసం ఎన్టీఆర్ ఆరోగ్య రథాలను ఏర్పాటుచేశామని, రాబోయే రోజుల్లో వైద్యసేవలను విస్తృతం చేసేందుకు మీవంతు సహాయ, సహకారాలు అందించాలని కోరారు.

చివరగా మంగళగిరికి చెందిన మరో ప్రముఖుడు కొటికలపూడి శ్రీనివాసరావును వారి నివాసంలో కలుసుకున్నారు. శ్రీనివాసరావు సెంట్రల్ వాటర్ కమిషన్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించడమేగాక వివిధ రాష్ట్రాల్లో పనిచేశారు. మంగళగిరి సర్వతోముఖాభివృద్ధికి మీలాంటి పెద్దల సలహాలు, సూచనలు అవసరమని, రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు.

ప్రముఖులను కలిసిన తర్వాత కాజ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని యువనేత లోకేష్ ప్రారంభించారు. అనంతరం కాజ కి చెందిన వైసిపి నేత పల్లా వెంకటేశ్వర రావు, ఆయన తో పాటు 65 వైసిపి కుటుంబాలు టిడిపిలో చేరారు. వారందరికీ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నారా లోకేష్.

 

LEAVE A RESPONSE