అతి త్వరలో అమీర్ పేట హాస్పిటల్ ప్రారంభం:తలసాని

అతి త్వరలో అమీర్ పేట లోని హాస్పిటల్ లో డయాలసిస్ సేవలను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం అమీర్ పేట లో 4.53 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల హాస్పిటల్ ను రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెద్ద మనసుతో 50 పడకల హాస్పిటల్ నిర్మాణానికి అనుమతించి నిధులు మంజూరు చేసినందుకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటన విడుదలలో కృతజ్ఞతలు తెలిపారు. 6 పడకలు గా ఉన్న ఈ హాస్పిటల్ ను 30 పడకల కు అప్ గ్రేడ్ చేస్తూ 2012 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 2.97 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కానీ నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 50 పడకల హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలనే లక్ష్యంతో ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు విన్నవించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరిక మేరకు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హాస్పిటల్ భవనాన్ని సందర్శించారు. కాగా 2017 సంవత్సరం లో 50 పడకల హాస్పిటల్ గా నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ 7.47 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు చెప్పారు. 2018 సంవత్సరం లో పనులు చేపట్టినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా నిర్మాణ పనులు మధ్యలో కొద్ది రోజుల పాటు నిలిచిపోయాయని తెలిపారు. G ప్లస్ 2 పద్దతిలో హాస్పిటల్ భవనాన్ని ఒక్కో ప్లోర్ ను 9,451 SFT విస్తీర్ణంలో నిర్మించినట్లు తెలిపారు. ఈ హాస్పిటల్ కు వచ్చే పేషంట్స్ కోసం అల్ట్రా సౌండ్ స్కానర్, ECG, ఎక్స్ రే, ఇతర అత్యాధునిక వైద్య పరికరాలను 50 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ హాస్పిటల్ ద్వారా అమీర్ పేట, సనత్ నగర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, శ్రీ నగర్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుతాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
ప్రభుత్వ వైద్య సేవల కోసం దూర ప్రాంతాల్లో ఉన్న గాంధీ, ఉస్మానియా వంటి హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్ లో ఈ హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని చెప్పారు. పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను చేరువ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ఇప్పటికే బస్తీ దవాఖాన లను ప్రారంభించి ప్రజల చెంతకు వైద్య సేవలు తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. హాస్పిటల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మరో 50 పడకల హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని TSMIDC అధికారులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో MLC సురభి వాణి దేవి, కలెక్టర్ శర్మన్, TSMIDC MD చంద్ర శేఖర్ రెడ్డి, CE రాజేంద్ర కుమార్, హాస్పిటల్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సునీత, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ, కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply