Suryaa.co.in

Andhra Pradesh

హైకోర్టు తీర్పు ఏపీపీఎస్సీ, ప్రభుత్వ అసమర్థ పాలనకు అద్దం

– హైకోర్టును తప్పుదోవ పట్టించిన ఏపీపీఎస్‌సి
– టీడీపీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు

నిరుద్యోగుల జీవితాలతో ఎపీపీఎస్సీ ఆటలాడుతోందని టీడీపీ ఉత్తరాంధ్ర పట్టభ్రదుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు …

2018 డిసెంబర్ లో 162 పోస్టులతో 27/2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇందులో 30 వరకు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 28 వరకు డీఎస్పీ వంటి కీలక ఉద్యోగాలు కలవు. 2019 మేలో ప్రిలిమ్స్ జరగ్గా 2020 డిసెంబర్ లో డిజిటల్ మూల్యాంకనం చేపట్టి మెయిన్స్ ఫలితాలను 2021 ఏప్రిల్ లో విడుదల చేసింది.

కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో నోటిఫికేషన్ లో ఎక్కడా డిజిటల్ మూల్యాంకనం అనే పదం లేదు కాబట్టి డిజిటల్ గా మూల్యాంకనం చేయటం తగదని హైకోర్టు జడ్జి డివివి సోయాజులు 2021 అక్టోబర్ లో తీర్పు ఇచ్చి మూడు నెలల్లో మ్యాన్యువల్ గా మూల్యాంకనం చేయాలని పేర్కొన్నారు. దీనిపై ఎపీపీఎస్సీగానీ, అభ్యర్థులుగానీ ఎటువంటి అప్పీలుకు వెళ్లలేదు.

2021 డిసెంబర్ 5న మ్యాన్యువల్ మూల్యాంకనం ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఆన్సర్ పేపర్లు రవాణా చేయుటకు సెక్యురిటి ఏర్పాట్లు చేయమని ఏపీపీఎస్సీవారు ఎస్పీ గారికి లేఖ కూడా రాయడం జరిగింది. 2022 ఫిబ్రవరిలో మూల్యాంకనం పూర్తి కానున్నట్లు మూల్యాంకనం తరువాత ఏర్పాట్లకు సంబంధించి ఏపీపీఎస్సీ చర్యలు తీసుకుంటున్నట్లు వారి లేఖ ద్వారా తెలియవచ్చింది. ఫిబ్రవరిలో ఫలితాలు ప్రకటిస్తున్నట్లు సాక్షి దినపత్రికలో వార్త కూడా వచ్చింది.

అయితే.. ఆ మూల్యాంకన ఫలితాలను ఏపీపీఎస్సీ తొక్కిపెట్టింది. అసలు మ్యాన్యువల్ మూల్యాంకనం 2022 మార్చి 25న ప్రారంభమైనట్లు ఏపీపీఎస్సీ కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ లో తెలియజేసి హైకోర్టును తప్పుదోవ పట్టించింది. 2022 మేలో మెయిన్స్ ఫలితాలిచ్చి జులైలో ఇంటర్యూలు నిర్వహించి ఆగస్టు లో తుది ఫలితాలిచ్చెను. దీనిలో ఎంపిక అయిన వాళ్లు ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆర్వోలుగా పనిచేస్తున్నారు.

2021 డిసెంబర్ 2022 ఫిబ్రవరి మధ్య మ్యాన్యువల్ మూల్యాంకనం జరిగినట్లు లిఖిత పూర్వమైన ఆధారాలతో అభ్యర్థులు కోర్టుకు వెళితే.. మెయిన్స్ పరీక్షను రద్దు చేసి అభ్యర్థులకు రెండు నెలలు సమయం ఇచ్చి ఆరు నెలల్లో మెయిన్స్ పరీక్ష ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు 2024 మార్చి 13న తీర్పు ఇచ్చింది.

ఏపీపీఎస్సీ పట్ల సందేహాలు :
1.2021 అక్టోబర్ లో హైకోర్టు 3 నెలల్లో మ్యాన్యువల్ మూల్యాంకనం పూర్తి చేయాలని తీర్పు ఇవ్వగా 2022 మార్చిలో మూల్యాంకనం ప్రారంభమైనట్లు అఫిడవిట్ లో తెలియజేయడం కోర్టు ధిక్కారం కాదా?
2.2021 డిసెంబర్ నుండి 2022 ఫిబ్రవరి వరకు మ్యాన్యువల్ మూల్యాంకనం జరిగినట్లు లిఖితపూర్వకమైన ఆధారాలున్నాయి. అయితే.. ఆ మెయిన్స్ ఫలితాలను ఎందుకు తొక్కిపెట్టారు?
3. పాత ఓఎంఆర్ షీట్ చించేసి.. కొత్తగా మరో ఓఎంఆర్ షీట్ ను ఎందుకు పిన్ చేయాల్సి వచ్చింది?
4.హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుతామని హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రభుత్వం ఎందుకు స్పందించింది?
5.అసలు ఈ కేసుకు, ప్రభుత్వానికి సంబంధమేమిటి?
6. తమ అనుయాయులను ఎన్నికల ఆర్ ఓలుగా నియమించుకొని తప్పుడు మార్గాల్లో ఎన్నికల్లో గెలవడమే లక్ష్యమా?
7. ఒక రాజ్యంగబద్ధమైన సంస్థపై ప్రభుత్వ పెత్తనమేంటి?
8.నిజంగా కష్టపడి మెయిన్స్ రాసిన అభ్యర్థులకు ఏపీపీఎస్సీ న్యాయం చేస్తుందా?
9.గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు, ఇంటర్యూ ఫలితాలు గతంలో అధికారికంగా ఏపీపీఎస్సీ ప్రకటించేంది. ఇప్పుడు ప్రకటించకపోవడం వెనుక గల మర్మమేమిటి?
ఇలా ఎన్నో ప్రశ్నలు లక్షలాది ఉద్యోగార్థుల మెదళ్లలో మెదులుతున్నవి. ఏపీపీఎస్సీపై పూర్తిగా విద్యార్థులకు, ఉద్యోగార్థులకు నమ్మకం పోతోంది.

ఇప్పటికైనా చిత్తశుద్ధితో పారదర్శకంగా పనిచేసి ఉద్యోగార్థులకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఏపీపీఎస్సీపై ఉంది. పక్కన ఉన్న తెలంగాణలో టీఎస్ పీఎస్ సి అసమర్థ పనితీరువల్ల ప్రభుత్వమే కూలిపోయింది. ఇక్కడ ఏపీపీఎస్సీ అసమర్థ పనితీరు వల్ల విద్యార్థులు, ఉద్యోగార్థులు అప్పులపాలై ప్రభుత్వ ఉద్యోగాల పట్ల విశ్వాసం కోల్పోయి నిరాశ, నిస్ప్రహలకు లోనవుతున్నారని టీడీపీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు వివరించారు.

LEAVE A RESPONSE