Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ అధికారిక సోషల్‌ మీడియాలో దారుణ వ్యవహారం

– ఆ ఖాతాల నిండా మార్ఫింగ్‌ ఫొటోలు, బూతులే
– వీడియోలతో సహా చూపిన అంబటి రాంబాబు
– చేబ్రోల్‌ కిరణ్‌ అరెస్ట్‌ చంద్రబాబు ఆడించిన డ్రామా
– కూటమి పాలనలో చాలా వేగంగా రిలీజైన వ్యక్తి అతడే
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు

తాడేపల్లి: తమ సోషల్‌ మీడియాలో వేలాది మందిని టీడీపీ పెంచి పోషిస్తోందని, ఐటీడీపీ పేరుతో డబ్బులు, బహుమతులతో మంత్రి నారా లోకేష్‌ వారిని ప్రోత్సహిస్తున్నారని వైయస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. తమ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననమే టీడీపీ లక్ష్యం అని, అందుకే నిరంతరం తప్పుడు పోస్టులతో దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఏర్పాటై మరో నెలకు ఏడాది అవుతుంది. ఈ 11 నెలల కాలంలో చంద్రబాబు ఏమీ చేయకపోయినా ఏదేదో చేసినట్లు చెప్పుకోవడానికే సరిపోయింది. ఈసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రగల్భాలు చూస్తే.. మాటలు కోటలు దాటిపోయాయి.

‘సోషల్‌ సైకోలకు కోరలు పీకండి. మదమెక్కిన మాట్లాడే వారిని వదిలే ప్రసక్తే లేదు. సోషల్‌ మీడియా సైనికులకు చెక్‌. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్‌ కింద కేసు పెడతాం’.. ఇవీ చంద్రబాబు వీర ప్రగల్భాలు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ కూడా ఒక డ్రామా ఆర్టిస్ట్‌. కొన్ని సోషల్‌ మీడియాపోస్టులు చూసి తన బిడ్డలు కన్నీరు పెట్టుకున్నారంటూ, మంత్రివర్గ సమావేశంలో ఆయన బాధ పడ్డారని ఎల్లో మీడియా అచ్చేసింది.

ఆ విచారణపై జడ్జీ విస్మయం
మాజీ సీఎం వైయస్‌ జగన్‌ మీద, ఆయన సతీమణి గురించి చేబ్రోలు కిరణ్‌ అనే ఒక ఐటీడీపీ కార్యకర్త అసభ్యకరమైన భాషలో మాట్లాడటం రాష్ట్రమంతా చూసింది. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో అతడ్ని అరెస్ట్‌ చేసినట్టు సీఎం చంద్రబాబు ఒక డ్రామా నడిపారు. ఇది డ్రామా అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కిరణ్‌ రిలీజైనంత వేగంగా ఏ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ కూడా విడుదలైంది లేదు.

ఏప్రిల్‌ 11న అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిస్తే 23వ తేదీన రిలీజ్‌ కూడా అయ్యాడు. వైయస్సార్సీపీ కార్యకర్తలు ఎవరు అరెస్ట్‌ అయినా విచారణ పేరుతో పోలీస్‌ కస్టడీ కోరుతున్నారు. కానీ కిరణ్‌ విషయంలో మాత్రం అదేదీ జరగలేదు. చంద్రబాబు నాయుడే స్వయంగా కిరణ్‌ని పిలిచి ప్రోత్సహించాడు కాబట్టే ఆయన్ను జైలు నుంచి వేగంగా ఇంటికి పంపించారు. కిరణ్‌ కేసులో మంగళగిరి పోలీసులు ఇంత వేగంగా పని చేశారేంటి అని సాక్షాత్తు జడ్జీ అడిగినట్టు కూడా నాకు కొందరు చెప్పారు.

తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వ పరిస్థితి ఎంతవరకు దిగజారి పోయిందంటే మేమేదైనా విమర్శలు చేస్తే వాటికి చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌ సమాధానం చెప్పడం లేదు. కిర్రాక్‌ ఆర్పీ, సీమ రాజా వంటి సోషల్‌ సైకోలతో రాజకీయంగా సమాధానాలు చెప్పిస్తున్నారు. అంటే అలాంటి వారి మీద ఆధారపడి రాజకీయాలు చేసే దౌర్భాగ్య స్థితికి చంద్రబాబు దిగజారారు.

ఎవరైనా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పుడు కచ్చితంగా రసీదు తీసుకోవాలి. మన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోతే.. ఆ రసీదులు మన దగ్గర ఉంటేనే, కోర్టులను ఆశ్రయించగలం. న్యాయ పోరాటం చేయగలం. అలాగే, ఎక్కడైనా మనం చేసిన కంప్లైంట్‌కు పోలీసులు రసీదు ఇవ్వడానికి నిరాకరిస్తే.. వెంటనే తనకు తెలియజేయాలని అంబటి రాంబాబు కోరారు.

LEAVE A RESPONSE