Suryaa.co.in

Andhra Pradesh

కేంద్ర ప్రాయోజిత పథకాలకు మళ్లీ ఊపిరి

విధ్వంసం నుంచి వికాసం వైపు
ఏడాదిలో వెచ్చించింది రూ.14,479 కోట్లు
కూటమి ప్రభుత్వంలో పట్టాలెక్కిన 82 పథకాలు
లక్షల మందికి చేకూరుతున్న లబ్ధి
తాగునీటి సౌకర్యం, రహదారులు, అభివృద్ధి పనులకు ఊతం

(సైనిక)

జగన్ ఐదేళ్ల పాలనలో అడుగడుగునా విధ్వంసమే. కేంద్రం అనేక ప్రజా ప్రయోజన పథకాలకు రూపకల్పన చేసి రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధులతో అమలుచేస్తున్నా వాటిని గత సర్కారు దుర్వినియోగం చేసింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వెనుకబడిన వర్గాలకు, మహిళలకు, శిశువులకు, గర్భిణులకు ప్రయోజనం కల్పించడమే కాదు- ఊళ్లలో అనేక వసతుల కల్పనకూ కేంద్ర పథకాలు ఉపయోగపడేవి.

జగన్ సర్కారు ఆ పథకాల పేరుతో నిధులు తీసుకుని దారి మళ్లించేసింది. ఆ పథకాలకు రాష్ట్రవాటా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ఫలితంగా ఆ ఐదేళ్లలో.. రూ.39,642 కోట్ల మేర కోత పడింది. మౌలిక సౌకర్యాలు, అభివృద్ధి, సంక్షేమం గాడి తప్పాయి. రాష్ట్రంలో 1.83 కోట్లమంది బాధితులయ్యారు. పథకాలకు అందాల్సిన సొమ్ము రూ.8,456 కోట్లను జగన్ సర్కారు ఉఫ్ అని ఊదేసింది. రూ.10,171 కోట్ల కేంద్ర నిధులను వేరే కార్యక్రమాలకు మళ్లించేసింది. అభివృద్ధి పనులకు ఉపయోగపడాల్సిన రూ.21,015 కోట్లు నాటి ప్రభుత్వ విధానాల వల్ల వృథా అయ్యాయి!

ఇది పునరుజ్జీవ జమానా..

ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిలోనే నాటి విధ్వంసం నుంచి వికాసానికి అడుగులు పడ్డాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలు గాడిన పడ్డాయి. చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రభుత్వం రూ.14,479.31 కోట్లు వెచ్చించి 82 కేంద్ర ప్రాయోజిత పథకాలకు పునరుజ్జీవం పోసింది. జగన్ సర్కారు పెండింగ్ పెట్టిన బిల్లులన్నీ చెల్లించడంతో పాటు, కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా సకాలంలో విడుదల చేస్తూ ప్రజలకు ప్రయోజనాలు అందేలా చూస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గత నెలాఖరు వరకు రూ.17,878.24 కోట్లను 134 కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం విడుదల చేసింది. ఇందులో ఆర్థిక సంఘం నిధులూ ఉన్నాయి. రైతులు, ఎస్సీ, ఎస్టీలు, విద్యార్థులు, కిశోర బాలికలకు లబ్ధి కలిగేలా వ్యవస్థను సంస్కరించింది.

గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, మంచినీటి సౌకర్యాలు మెరుగు పరిచేలా కేంద్ర పథకాలకు రాష్ట్ర నిధులూ జతచేసి అభివృద్ధికి బాటలు పరిచింది. 2024 జూన్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయానికి 95 కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రూ.8,695 కోట్లు విడుదల చేయకుండా పాత ప్రభుత్వం ఆపేసింది.

వ్యవసాయం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి. విద్య, గిరిజన సంక్షేమం, ఇతర వర్గాల సంక్షేమ పథకాలన్నీ కుంటుపడ్డాయి. అలాంటిది ఇప్పుడు ఏడాదిలోనే రూ. వేల కోట్లు వెచ్చించడమే కాకుండా లక్షలమందికి చేయూత అందించేలా డబుల్ ఇంజిన్ సర్కారు ఆసరా కల్పించింది.

ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన

నాడు.. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద పల్లెల్లో నాడు రహదారుల నిర్మాణం స్తంభించిపోయింది. రూ.125.32 కోట్ల బిల్లులు వైకాపా సర్కారు ఆపేసింది. 916 కి. మీ. మేర రోడ్ల నిర్మాణ పనులు స్తంభించిపోయాయి.

నేడు.. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకాన్ని గాడిన పెట్టింది. పెండింగ్ బిల్లులు ఇచ్చేసింది. అంతేకాకుండా మరో రూ.560.39 కోట్లు అదనంగా వెచ్చించింది. ఫలితంగా 435 కి.మీ. మేర రహదారుల నిర్మాణం పూర్తయింది.

సమగ్రశిక్షా అభియాన్

నాడు..జగన్ సర్కారులో సమగ్రశిక్షా అభియాన్ పథకం పనులు సవ్యంగా సాగలేదు. రూ.238.06 కోట్లు బిల్లులు పెండింగ్ ఉండిపోయాయి. పాఠశాలల్లో వసతులు మెరుగుకు కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోలేదు.

నేడు.. ఎన్డీయే ప్రభుత్వం రాగానే పాత బిల్లులు చెల్లించడంతో కేంద్రం కిందటి ఆర్థిక ఏడాది మరో రూ.1,240.10 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర వాటా కలిపి 1,893.50 కోట్లు వెచ్చించడంతో 35 లక్షలమంది. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించే ప్రక్రియ ఊపందుకుంది.

పోషణ 2.0

నాడు..పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం అందించేందుకు ఉద్దేశించిన పోషణ 2.0 పథకంలో నాటి సర్కారు రూ.85.70 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టింది. ఫలితంగా పోషకాహారం సకాలంలో అందించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

నేడు..ప్రస్తుత ప్రభుత్వంలో పోషణ గాడిన పడింది. కేంద్ర నిధులూ తీసుకుని రాష్ట్ర వాటా నిధులూ కలిపి మొత్తం రూ.1,260 కోట్లు గత ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసి 21.39 లక్షలమందికి ప్రయోజనం కల్పించింది.

జాతీయ ఆరోగ్య మిషన్

నాడు..జాతీయ ఆరోగ్య మిషన్ గర్భిణులు, నవజాత శిశువులు, పిల్లల ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించి పాత ప్రభుత్వంలో రూ.164.71 కోట్ల బిల్లులు మూలన పడ్డాయి.

నేడు..కూటమి సర్కారు ఏడాదిలో రూ.1,691.21 కోట్లు కేంద్ర, రాష్ట్ర నిధులు కలిపి వెచ్చించింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన యంత్రపరికరాల సరఫరాతో పాటు 60 వేలమంది ఆరోగ్య కార్యకర్తలు గౌరవ వేతనం చెల్లింపులు జరిగాయి.

జలజీవన్ మిషన్

నాడు.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చేలా కేంద్రం జలజీవన్ మిషన్ కింద నిధులు కేటాయించింది. జగన్ ప్రభుత్వం రూ.2,255 కోట్లు మాత్రమే ఉపయోగించుకుంది. రూ.571.96 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉంచింది. ఆ పథకం గడువు పూర్తయ్యేలోగా 95.44 లక్షల గ్రామీణ కుటుంబాలకు నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యం నెరవేరలేదు. పథకం గడువు కూడా ముగిసిపోయింది.

నేడు.. ‘ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. ఈ పథకం గడువు పెంచాలని కోరారు. పథకాన్ని పునరుద్ధరించేందుకు రూ.894.37 కోట్లు చెల్లించి కేంద్రం నుంచి అదనపు నిధులు సాధించారు. జలజీవన్ మిషన్ పథకాన్ని 2027-28 వరకు కొనసాగించేందుకు కేంద్రం అంగీకరించింది. దాదాపు రూ.80వేల కోట్లతో తిరిగి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన నిధులతో అనేకచోట్ల పెండింగ్ పనులు ఊపందుకున్నాయి.

మరికొన్ని ఇతర ప్రయోజనాలూ ఇలా..

▪️ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,76,000 కుటుంబాలకు ఉపయోగపడేలా రూ.361.91 కోట్లు విడుదలయ్యాయి.

▪️సమగ్ర వాటర్ షెడ్ కార్యక్రమం కింద 20 వేలమంది లబ్దిదారులకు ప్రయోజనం కలిగేలా రూ.85.56 కోట్ల బిల్లుల చెల్లింపులు పూర్తి చేశారు.

▪️గిరిజన ఉప ప్రణాళిక కింద వివిధ ఉపాధి పథకాల అమలుకు కేంద్రం నిధులిస్తోంది. గత ప్రభుత్వంలో రూ.14.59 కోట్ల పెండింగ్ బిల్లులు కొత్త ప్రభుత్వం ఇచ్చేసింది. దీని వల్ల వివిధ యూనిట్ల స్థాపనలో ఆలస్యం కాకుండా చూడటం సాధ్యమయింది ఫలితంగా 1.50 లక్షలమంది లబ్దిదారులకు ఊరట దక్కింది.

▪️మారుమూల గిరిజన వర్గాలకు వివిధ కార్యక్రమాల కింద పెండింగ్లో ఉంచిన రూ.32.57 కోట్లు విడుదల చేశారు. దీనివల్ల 4.88 లక్షలమంది గిరిజన లబ్దిదారులకు ప్రయోజనం కలిగింది. భూమి పంపిణీ చేసి అభివృద్ధి చేయడం, వ్యవసాయ పరంగా అభివృద్ధి పనుల వంటివి ఈ నిధులతో సాధ్యమయ్యాయి. గిరిజన ప్రాంతాల్లో వివిధ వసతుల కల్పనకు అవసరమైన రూ.23.21 కోట్లు కూడా విడుదల చేశారు.

▪️దీనదయాళ్ గ్రామీణ కౌసల్య యోజన కింద 65 వేలమంది గ్రామీణ యువతకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించేలా అవసరమైన శిక్షణకు కూటమి సర్కారు పెండింగ్ బిల్లులు చెల్లించి కార్యక్రమాన్ని గాడిన పెట్టింది.

LEAVE A RESPONSE