Suryaa.co.in

Andhra Pradesh

జనసేనానికి  చిరంజీవి ఆశీర్వాదాలు

  • జనసేనకు రూ.ఐదు కోట్ల విరాళం

జనసేనకు విజయోస్తు…. విజయీభవ అని పద్మవిభూషణ్  చిరంజీవి  తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాదాల చెంత  జనసేన పార్టీ అధ్యక్షులు, తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించారు. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ఐదుకోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో మరో సోదరుడు నాగబాబు చెంతనుండగా పవన్ కళ్యాణ్ కి అందించారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో నిర్విరామంగా షూటింగ్ జరుపుకొంటున్న ‘విశ్వంభర’ షూటింగ్ లొకేషన్ ఈ అపూర్వ ఘట్టానికి వేదిక అయింది.

సోమవారం ఉదయం పదిగంటలకు లొకేషన్ కు చిన్నన్న నాగబాబు తో కలసి లొకేషన్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కి చిరంజీవి ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు. చిరంజీవి ఆశీర్వచనం అందుకున్న  పవన్ కళ్యాణ్ ఉద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి పాదాలకు నమస్కరించారు. పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా అన్న చిరంజీవి ఆశీర్వచనం కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ కి – అన్నయ్య ఆశీస్సులు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి.నీ వెనుక నేనున్నాను అనే భరోసా దక్కింది. అనంతరం సోదరులు ముగ్గురూ కొంత సేపు సంభాషించుకున్నారు.

ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయభేరి సభలో లోకపావని నూకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో టి.వి.లో ఆ దృశ్యాన్ని చూసిన చిరంజీవి తన తమ్మునికి తన ఆశీర్వాద బలంతోపాటూ ఆర్థికంగానూ అండగా నిలబడాలని ఐదు కోట్ల రూపాయలకు చెక్కును చిరంజీవి సిద్ధం చేసి మరునాడే అందచేశారు.

చిరంజీవి తనయుడు, గ్లోబల్ స్టార్ గా పేరుగాంచిన రామ్ చరణ్ సైతం తండ్రి మాదిరిగానే జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు.

చిరంజీవి చెక్కును అందించిన తరుణంలో జనసేన ప్రధాన కార్యదర్శులు నాగబాబు , టి.శివశంకర్ , కోశాధికారి ఎ.వి.రత్నం , కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధి వి.అజేయ కుమార్ , అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి పి.హరి ప్రసాద్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE