Suryaa.co.in

Entertainment Features

చిరు ‘గ్రేట్ యాక్సిడెంటల్ ఎస్కేప్ ‘!

మెగాస్టార్ గా సినీ అభిమానులు పిలుచుకునే చిరంజీవి – ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు .
సినిమా టికెట్ ధరల తగ్గింపు వివాదం లో చర్చల కోసం అన్నట్టుగా – ముఖ్యమంత్రి జగన్ నుంచి ఆహ్వానం రావడంతో చిరంజీవి ఆనందభరితులయ్యారు . ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఆయన ఒక్కరే విజయవాడ వెళ్లారు . ముఖ్యమంత్రి సహజంగానే ఎదురేగి , చిరుకు స్వాగతం పలికి – లోపలి
chiranjeevi-jagan తోడ్కొని వెళ్లారు . సినిమా టిక్కెట్ల వివాదంలో చిరంజీవి వ్యక్తిగత అభిప్రాయం తెలుసుకోడానికి , ముఖ్యమంత్రి చొరవతీసుకుని ఆయనను పిలిపించారేమో అనే భావం కలిగింది .

చిరంజీవి సైతం – ‘టికెట్ల వివాదానికి ముఖ్యమంత్రి అడిగారు . నా అవగాహన మేరకు చెప్పాను . అంతకు మించి ఏమీ విశేషం లేదు …అవసరమైతే మళ్ళీ వస్తాను ….’ అని రెండు ముక్కల్లో తేల్చేసినట్టయితే ; వివాదం ఉండేది కాదు . కానీ, చిరంజీవి గన్నవరం ఎయిర్పోర్ట్ లో చాలా వివరంగానూ …ఎక్కువగానూ మాట్లాడారు.దీనితో బోలెడంతమంది రామగోపాల్ వర్మలు ఉన్న తెలుగు సినీ పరిశ్రమ తరఫున, ‘ఏకైక పెద్ద’ గా మాట్లాడారనే భావం కలిగింది .ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవికి గల ఈక్వేషన్ చూసిన వారు – చిరుకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ఊహించారు . ఈ ఊహాగానాలతో సోషల్ మీడియా ఓ రోజంతా ఊగిపోయింది .ఈ ప్రచారంలో అంతర్లీనంగా ఇమిడివున్న ‘ప్రమాదాల’ను చిరంజీవి బాగానే అంచనా వేశారు .

1 .తన స్వంత సోదరుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే , రాష్ట్ర రాజకీయాల్లో పీకల్లోతున మునిగి ఉన్నారు . సందర్భం దొరికినప్పుడల్లా; జగన్ పై విమర్శలు , వ్యంగ్య బాణాలు గుప్పిస్తున్నారు . జనసేన సంబంధీకులు కూడా వైసీపీపై విమర్శలు గట్టిగానే చేస్తున్నారు .జనసేనను పవన్ కళ్యాణ్ స్థాపించి 12
chiranjeevi-pawan-kalayan-1588081179ఏళ్ళు దాటిపోయినా …. చిరంజీవి ఇప్పటిదాకా నోరు మెదపలేదు . వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వం స్వీకరిస్తే …మౌనం కుదరదు . తమ్ముడికి అనుకూలంగా మాట్లాడలేరు. వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుందో ఆయనకు తెలుసు .

2 . చిరంజీవి చర్మం బాగా పలుచన . ఒకరిని విమర్శించలేరు. విమర్శలను తట్టుకోలేరు . రాజకీయాల్లో ఉండాలి అనుకునే వారికి -చర్మం రెండు అంగుళాలు దళసరిగా ఉంటేగానీ కుదరదు .
3 . వ్యక్తిగతంగా చిరంజీవి ధైర్యవంతుడు,ఆత్మవిశ్వాసం గలిగిన వారు కాదు . ‘నేను సినీ ఇండస్ట్రీకి పెద్దగా ఉండను ….ఏ వివాదాలు పరిష్కరించడానికి చొరవ తీసుకోను …..’అని ప్రకటించడంలోనే చిరంజీవి వ్యక్తిత్వం మొత్తం ఇమిడి వున్నది . రాజకీయంగా – సొంత కులంలో కూడా విశ్వసనీయత ఉన్నవారు కాదు. గోదావరి జిల్లాల్లో ప్రజారాజ్యం దెబ్బకు దివాళా తీసిన కుటుంబాలు కొన్ని ఇంకా తేరుకోలేదు. ఏదో సరదాగా సినిమాలు చేసుకుంటూ  ‘మెగాస్టార్ ‘ అనే టైటిల్ కు న్యాయం చేసుకుంటూ వెళ్లాలనే భావన కలవారు .

అందుకే, రాజ్యసభ సభ్యత్వం అంటూ సోషల్ మీడియా లో ప్రచారం మొదలైన 24 గంటల్లోనే -ఆ ప్రచారాన్ని ఖండ ఖండాలుగా ఖండించారు . రాజకీయాల మనిషిని తాను కాదు అని చిరంజీవి చెప్పారు . మొత్తం మీద ఈసారికి ఆయన బయటపడి పోయారు .ఇక ముందు సినిమా పరిశ్రమ తరఫున వకాల్తా పుచ్చుకోకపోయినా ఆశ్చర్యం లేదు . ముఖ్యమంత్రితో చిరంజీవికి జరిగిన ఆత్మీయ సమావేశాన్ని కూడా రాజకీయం చేసారంటూ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి నొచ్చుకున్నారు .ఈ అనుభవం నేపథ్యంలో రాజకీయ పుకార్లు రావడానికి అవకాశం లేని రీతిలో చిరంజీవి -ముఖ్యమంత్రి జగన్ ను కలుసుకుంటారని ఆశించవచ్చు . సిపిఐ నారాయణ వెయ్యి కళ్ళతో చూస్తూనే ఉంటారు .

rayudu
-భోగాది వేంకట రాయుడు

LEAVE A RESPONSE