– ఏపీ సచివాలయంలో సుదీర్ఘంగా సాగిన మంత్రుల బృందం సమావేశం
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఏపీ సచివాలయం 5వ భవనంలో మంత్రుల బృందం(జిఓఎం)ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలు, వైద్య ఆరోగ్య శాఖల మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ల ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు సహా ఇతర అంశాలపై మంత్రుల బృందం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించింది.
మంత్రి కేశవ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి సానుకూలంగా, మానవతా దృక్పథంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమైనందున ఉద్యోగుల సమస్యలను తగిన రీతిలో పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గురువారం సీఎం ప్రత్యేకంగా మూడు గంటలపాటు మంత్రుల బృందం, అధికారులుతో చర్చించినట్టు తెలిపారు.
మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆర్థికపరైన అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అంశాలను పరిష్కరించే దిశలో ప్రభుత్వం తగిన కసరత్తు చేస్తోందని తెలిపారు. అందుకు సంబంధించి ఇప్పటికే జెఎస్సి సమావేశం నిర్వహించగా మరలా మంత్రుల బృందం సమావేశం ద్వారా ఉద్యోగుల సమస్యలన్నిటనీ తెలుసుకున్నట్టు తెలిపారు.
సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు, ఐటి శాఖ కార్యదర్శి కె.భాస్కర్, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్, సిడిఎంఏ జి.సంపత్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జిజిజిఓ అధ్యక్షులు ఎ.విద్యాసాగర్, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరి యు.మనోహర్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎస్టియు సాయి శ్రీనివాస్, పిఆర్టియు ఎం.కృష్టయ్య, యుటిఎఫ్ ఎన్.వెంకటేశ్వర్లు, ఎపి టిఎఫ్ జి.హృదయరాజు, ఎపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కె.ఆర్ సూర్య నారాయణ, ఎపి ఉపాధ్యాయ సంఘం ఎస్.బాలాజి, ఎపి కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ టివి.ఫణిపేర్రాజు, ఎపి గవర్నమెంట్ వెహికల్ డ్రైవర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఎస్.శ్రీనివాసరావు, ఆల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లాస్ 4 ఎంప్లాయిస్ సెంట్రల్ అసోసియేషన్ ఎస్.మల్లేశ్వర రావు, ఎపి స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పిఎస్ఎన్ శాస్త్రి,ప్రసాద రావు, స్టేట్ గవర్నమెంట్ ఫెన్సనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, ఆయా సంఘాల కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.